Endangered ancient tribe ……
షోంపెన్’ తెగ భారతదేశంలోని అత్యంత అరుదైన, అంతరించిపోతున్న ప్రాచీన ఆదివాసీ సమూహాలలో ఒకటి. అండమాన్ నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దట్టమైన వర్షారణ్యాల లోపల వీరు నివసిస్తున్నారు.
భారత ప్రభుత్వం వీరిని ‘పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్’ (PVTG) గా గుర్తించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా కేవలం 229 మంది మాత్రమే. బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండే వీరి జీవన శైలి సంస్కృతి విలక్షణమైనది.
షోంపెన్ ప్రజలు స్థిర నివాసం లేని అర్థ-సంచార (Semi-Nomadic) జీవనాన్ని సాగిస్తారు. ఆహారం కోసం పూర్తిగా అడవిపైనే ఆధారపడతారు.అడవిలో దొరికే పాండనస్ పండ్లు .. వీరి ముఖ్యమైన ఆహారం, దీనిని వీరు ‘లారోప్’ అని పిలుస్తారు.
అడవి పందులు, కోతులు, కొండచిలువలు, పక్షులు,నదులలోని చేపలను వీరు వేటాడి తింటారు.ఇటీవల కాలంలో వీరు నిమ్మకాయలు, మిరపకాయలు, దుంపలు, పొగాకు వంటి చిన్న చిన్న తోటలను పెంచడం కూడా అలవాటు చేసుకున్నారు.
అడవి జంతువులు, వరదల నుండి రక్షణ కోసం వీరు చెట్ల పైభాగంలో లేదా ఎత్తైన కర్రల సహాయంతో నిర్మించిన గుడిసెలలో నివసిస్తారు. ఉష్ణమండల వాతావరణం కారణంగా వీరు చాలా పరిమితమైన వస్త్రాలను ధరిస్తారు. పురుషులు, మహిళలు చెట్ల బెరడుతో చేసిన వస్త్రాలను మొల చుట్టూ మాత్రమే కట్టుకుంటారు.
పురుషులు పూసల దండలు వేసుకుంటే, మహిళలు వెదురుతో చేసిన చెవి రింగులు, చేతి గాజులను ధరిస్తారు. వీరు ఎల్లప్పుడూ కాలిజోళ్లు లేకుండా (Barefoot) నడుస్తారు.
వీరు వేట కోసం ప్రధానంగా విల్లు, బాణాలు , పదునైన ఈటెలు, గొడ్డలిని ఉపయోగిస్తారు. అడవిలోని నదులు దాటడానికి వీరు చెక్కతో తయారు చేసిన చిన్న చిన్న పడవలను సొంతంగా తయారు చేసుకుంటారు. ఆహారాన్ని ఉడికించడానికి వీరు పచ్చి వెదురు బొంగులను (Bamboo Cooking) పాత్రలుగా వాడుకుంటారు.
వీరి సమాజంలో పురుషాధిక్యత (Patriarchal) ఉంటుంది. కుటుంబంలో లేదా సమూహంలో ఉండే అత్యంత వృద్ధుడైన పురుషుడే ఆ గుంపుకు పెద్దగా వ్యవహరిస్తాడు. షోంపెన్ ప్రజలు చంద్రుడిని తమ సృష్టికర్తగా, దేవతగా పూజిస్తారు. ఎవరైనా చనిపోతే చంద్ర దేవతే స్వయంగా భూమిపైకి వచ్చి వారి ఆత్మను స్వర్గానికి తీసుకెళ్తుందని, చంద్రునిపై ఉండే మచ్చలు వారి పూర్వీకుల గుర్తులని వీరు బలంగా నమ్ముతారు.
వీరు మాట్లాడే భాషకు లిపి లేదు. వీరిలోనే వేర్వేరు గుంపుల మధ్య వేర్వేరు మాండలికాలు (Dialects) ఉంటాయి, ఇవి ఒక గుంపు వారికి మాత్రమే అర్థమవుతాయి.
సాధారణ పర్యాటకులు వెళ్లి ‘షోంపెన్’ (Shompen) తెగ వారిని చూడటానికి వీలు లేదు. ఇది చట్టరీత్యా పూర్తిగా నిషేధించబడింది. షోంపెన్ ప్రజల నివాస ప్రాంతాలకు వెళ్లడం, వారితో సంభాషించడం లేదా వారిని ఫోటోలు తీయడం వంటి పనులు చేయడంపై భారత ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది.
కేంద్ర ప్రభుత్వం అండమాన్ నికోబార్లోని గ్రేట్ నికోబార్ దీవిని అత్యంత సురక్షితమైన ‘ట్రైబల్ రిజర్వ్’ (గిరిజన ప్రాంతం) గా ప్రకటించింది. కేవలం ప్రభుత్వ అనుమతి పొందిన పరిశోధకులు (Researchers) గిరిజన సంక్షేమ అధికారులకు (AAJVS) మాత్రమే కొన్ని ప్రత్యేక నిబంధనలతో అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది.
షోంపెన్ ప్రజలు పుట్టుకతోనే చాలా సిగ్గుపడే స్వభావం కలవారు. అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానంతో ఉంటారు. వారు సెంటినలీస్ తెగలాగా అపరిచితులపైకి బాణాలు వేస్తూ క్రూరంగా దాడి చేయరు, కానీ నాగరికులు ఎవరైనా తమ ప్రాంతానికి వస్తే దట్టమైన అడవుల్లోకి పారిపోయి దాక్కుంటారు.అడవి అంచున ఉండే కొన్ని షోంపెన్ గ్రూపులు మాత్రం ప్రభుత్వ సంక్షేమ అధికారులతో మితమైన సంబంధాలు కలిగి ఉన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘షోంపెన్ కాంప్లెక్స్’ ద్వారా అవసరమైనప్పుడు బట్టలు, రేషన్ సామగ్రి, వైద్య సదుపాయాలను వారు అందుకుంటారు.ఇటీవలి కాలంలో వీరిలో క్రమంగా మార్పు వస్తోంది. సాధారణ ఎన్నికలలో షోంపెన్ తెగకు చెందిన కొందరు గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా నాగరిక ప్రపంచం వైపు .. ప్రజాస్వామ్య ప్రక్రియ వైపు మొదటి అడుగు వేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల ఈ షోంపెన్ తెగ శతాబ్దాల నాటి అటవీ నివాసాలు, వారు తాగే మంచినీటి వనరులు దెబ్బతినే అవకాశం ఉందని, తద్వారా ఈ అరుదైన మానవ జాతి మనుగడ ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

