Mental strength is medicine…………. …………..
క్యాన్సర్ భయంకరమైన వ్యాధి. సెలబ్రిటీలకే కాదు సామాన్యులకు వస్తుంది.క్యాన్సర్ శరీరంలోని అన్నిభాగాలను అటాక్ చేస్తుంది. చర్మం నుంచి కాలేయం వరకు ప్రతి అవయవానికి సోకుతుంది. ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ని ముందుగానే రాకుండా నివారించాలి.. క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయిందంటే..ఇక పరిస్థితి నరకప్రాయమే.
తరచుగా ఈ క్యాన్సర్ గురించి వింటుంటాం. 5-10% క్యాన్సర్ కేసులు మాత్రమే జన్యుపరమైనవి .. మిగిలినవి బాహ్య కారకాల ఫలితంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ ఇతర ఇన్ఫెక్షన్లను అభివృద్ధి చేసే ప్రమాదంలో పడేస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది. అయితే క్రమం తప్పకుండా మెడిసిన్ వాడి .. భయపడకుండా ఈ క్యాన్సర్ ను జయించిన వాళ్ళు కూడా ఉన్నారు. సెలెబ్రిటీలలో చాలామంది క్యాన్సర్ బాధితులున్నారు ..జయించిన వారు ఉన్నారు.
ప్రముఖ నటి గౌతమి క్యాన్సర్ సర్వైవర్ ..వివిధ ఫోరమ్లలో ఈ వ్యాధి గురించి మాట్లాడుతుంటుంది. గౌతమి 35 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్ను ఎదుర్కొంది. ధైర్యంగా నిలబడింది. సన్నిహిత మిత్రులతో కలసి లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ బాధితులకు సహాయం అందిస్తోంది. నగరాల్లోని వాలంటీర్లు NGOల నెట్వర్క్ ద్వారా చురుకుగా పనిచేస్తున్నారు.
రెండేళ్ల క్రితం బాలీవుడ్ నటి సోనాలి బింద్రే కూడా మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడింది. మెటాస్టాసిస్ క్యాన్సర్లో క్యాన్సర్ కణాలు రక్తం ద్వారా శరీరంలోని కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తాయి. క్యాన్సర్ శరీరంలోని అసలు భాగాల నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే దాన్ని మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. కాలేయం, ఊపిరితిత్తులు, గ్రంథులు, ఎముకలు వంటి ప్రాంతాల్లో క్యాన్సర్ సోకుతుంది. సోనాలి కూడా భయ పడకుండా ట్రీట్మెంట్ తీసుకుంటోంది.
రచయిత, దర్శకురాలు తాహిరా కశ్యప్కు 2018లో రొమ్ము క్యాన్సర్ స్టేజ్ 0 లోఉన్నట్లు నిర్ధారణ అయింది. స్టేజ్ 0 బ్రెస్ట్ క్యాన్సర్ లేదా డక్టల్ కార్సినోమా ఇన్ సిటు (DCIS) అనేది నాన్-ఇన్వాసివ్ క్యాన్సర్. ఈ తరహా క్యాన్సర్ లో రొమ్ములోని పాల వాహిక లైనింగ్లో అసాధారణమైన, క్యాన్సర్ కణాలు పెరుగుతాయి.దెబ్బతిన్నకణాలు, నాళాల వెలుపల చుట్టుపక్కల ఉన్న రొమ్ము కణజాలంలోకి వ్యాపించవు.ఈమె కూడా ధైర్యంగా నిలబడి పోరాడింది.
బాలీవుడ్ నటి లిసారే దశాబ్దం క్రితం మల్టిపుల్ మైలోమా క్యాన్సర్తో బాధపడ్డారు. ఒక సంవత్సరం పాటు పోరాడిన తర్వాత ఆమె బాడీ క్యాన్సర్ రహితంగా మారింది. మల్టిపుల్ మైలోమా అనేది ప్లాస్మా కణంలో ఏర్పడే ఒక రకమైన క్యాన్సర్. ప్లాస్మా సెల్ ఒక రకమైన తెల్ల రక్త కణం, ఇది యాంటీబాడీలను తయారు చేయడం ద్వారా అంటువ్యాధులతో పోరాడుతుంది.
నటి మనీషా కొయిరాలా నవంబర్ 2012లో అండాశయ క్యాన్సర్తో బాధపడ్డారు. మనీషా న్యూయార్క్లో ఆరు నెలల పాటు చికిత్సతీసుకుంది.. తర్వాత శస్త్రచికిత్స చేయించుకుంది. ఈమెకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని అప్పట్లో చెప్పారు. ధైర్యంగా ఉంటూ చికిత్స తో వ్యాధిని జయించింది.
తాజాగా నటి హంసా నందిని కూడా క్యాన్సర్తో పోరాటం చేస్తున్నట్లు ప్రకటించారు.నందిని ఆమధ్య క్యాన్సర్ బారిన పడ్డారు. రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3 నుంచి కోలుకున్న ఆమె ఇప్పుడు జన్యుపరమైన క్యాన్సర్తో పోరాడుతున్నారు. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నటులలో కూడా కొందరు క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. క్యాన్సర్ సోకిందని బెంబేలు పడకుండా వ్యాధి నివారణకు గట్టి ప్రయత్నం చేయాలి. గతంలో కంటే ఇపుడు క్యాన్సర్ కు పలు చికిత్సలు అందుబాటులో కొచ్చాయి.