రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫర్ ఆకర్షణీయమేనా ?

Sharing is Caring...

 Attracting Investors……

రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫర్  (Jio IPO) మార్కెట్ నిపుణులు,ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ ఈ ఐపీఓ ప్రకటన చేశారు. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఆఫర్ లలో ఒకటిగా నిలవబోతోంది.

ఈ ఐపీఓ ద్వారా ‘ జియో ప్లాట్‌ఫార్మ్స్’ కంపెనీ 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఇందులో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లు ఎవరూ తమ షేర్లను అమ్మడం లేదు. అంటే ఐపీఓ ద్వారా వచ్చే డబ్బు మొత్తం నేరుగా కంపెనీ అభివృద్ధి, అప్పులు తీర్చడానికే ఉపయోగపడుతుంది. ఇది ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచే అతిపెద్ద సానుకూల అంశం.

మార్చి 2026 నాటికి ‘జియో ప్లాట్‌ఫార్మ్స్’ 52.4 కోట్లకు పైగా కస్టమర్లతో భారతదేశంలోనే అతిపెద్ద వైర్‌లెస్ ఆపరేటర్‌గా కొనసాగుతోంది. ఇందులో 5G వినియోగదారులు మాత్రమే 26.8 కోట్లకు పైగా ఉన్నారు.జియో కేవలం టెలికాం రంగమే కాకుండా, భారతదేశం కోసం సొంతంగా సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తక్కువ కక్ష్య ఉపగ్రహాల (LEO Satellite) కనెక్టివిటీ రంగంలోకి దూసుకుపోతోంది. 

ఐపీఓ ద్వారా సేకరించే నిధులలో దాదాపు ₹27,500 కోట్లను జియో ఇన్‌ఫ్రాకామ్ అప్పులను పూర్తిగా లేదా పాక్షికంగా తీర్చడానికి వాడనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కంపెనీ లాభాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

మార్కెట్ అంచనాల ప్రకారం జియో ప్లాట్‌ఫార్మ్స్ విలువ దాదాపు 131 బిలియన్ డాలర్లు (సుమారు ₹11 లక్షల కోట్లు) ఉండవచ్చు. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ దాదాపు 3.8 బిలియన్ డాలర్లు (సుమారు ₹31,000 కోట్ల నుండి ₹36,000 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలు 

జియో ఇంకా తమ షేర్ ధర (Price Band) ఎంత అనేది అధికారికంగా ప్రకటించలేదు. సెబీ (SEBI) ఆమోదం లభించిన తర్వాత ఇది వెల్లడవుతుంది. ఒకవేళ వాల్యుయేషన్ చాలా ఎక్కువగా నిర్ణయిస్తే, లిస్టింగ్ లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు.

మార్కెట్లో పోటీ, రీఛార్జ్ ధరల మార్పులపై కంపెనీ ఆదాయం ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద చూస్తే, జియో బ్రాండ్ ఇమేజ్, బలమైన కస్టమర్ బేస్,అప్పులు లేని భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా ఈ పబ్లిక్ ఆఫర్  దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అత్యంత ఆకర్షణీయమైనదిగా పరిగణించబడుతోంది.

రిలయన్స్ జియో ఐపీఓ కి మార్కెట్ నుండి పెద్ద ఎత్తున  సానుకూల రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో జియో బ్రాండ్ ఇమేజ్ గ్రామీణ ప్రాంతాల వరకు బలంగా ఉంది. ‘సొంత బ్రాండ్’ అనే నమ్మకంతో లక్షలాది మంది సామాన్య ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

కంపెనీ వార్షిక లాభం మొదటిసారిగా ₹30,000 కోట్లు దాటడం, దాదాపు 52.4 కోట్లకు పైగా కస్టమర్ బేస్ కలిగి ఉండడం సంస్థ పట్ల సంస్థాగత పెట్టుబడిదారులకు (FIIs & DIIs) నమ్మకాన్ని పెంచింది. అన్‌లిస్టెడ్ మార్కెట్ (Grey Market) లో ఇప్పటి నుంచే ఈ షేర్ల పట్ల బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రైస్ బ్యాండ్ రీజనబుల్‌గా ఉంటే కనుక, లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!