తెలుగులో తొలి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇదేనా ?

Sharing is Caring...

Subramanyam Dogiparthi……………….

First Suspense Thriller in Telugu

అప్పటికీ ఇప్పటికీ గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ ఈ లక్షాధికారి సినిమా. అరవై ఏళ్ళ క్రితం 1963 లో  విడుదలైంది. అర్ధరాత్రి కాగానే టవర్ క్లాక్ 12 గంటలు కొట్టడం , గుడ్లగూబ అరుపులు , విలన్ కర్రల టక్ టక్ సౌండ్  భయం గొలిపేవిగా ఉంటాయి. 

ఇప్పటి  నిర్మాత,దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి  తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించారు ఈ సినిమా. అదే ఆయన మొదటి సినిమా కూడా . ఈ సినిమాలో కరెంట్ మనుషులు గమ్మత్తుగా ఉంటాయి . చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చి షాక్ తో ఫినిష్ చేసి వెళ్లిపోతాయి . ఇప్పుడు హాశ్చర్యం కలిగించేది ఏమిటంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలను విక్టరీ మధుసూదనరావు గారు తీసారా అని.

NTR , కృష్ణకుమారి , గుమ్మడి , నాగయ్య , రుష్యేంద్రమణి , సూరేకాంతం , రేలంగి , గిరిజ , రమణారెడ్డి , మిక్కిలినేని ప్రభృతులు నటించారు . పాటలన్నీ బాగుంటాయి . దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే , మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది , ఎలాగో ఉన్నది ఇలాగే ఉంటుందా , అద్దాల మేడ ఉంది అందాల భామ ఉంది పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .

సూరేకాంతం శ్రీమంతం పాట అచ్చమ్మకూ నిత్యము శ్రీమంతమాయెనే పాటలో సూరేకాంతం సిగ్గు పడటం చూస్తే మనకు సిగ్గు , ముచ్చట వేస్తాయి .ఈ సినిమాలో ఒక పాటలో NTR , కృష్ణకుమారి మహాబలిపురం బీచ్ లో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచే సీన్ ఉంటుంది . ఆ సీన్ తీస్తున్నపుడు పెద్ద అల ధాటికి కృష్ణకుమారి పడిపోతే  NTR గట్టిగా పట్టుకొని కాపాడాడట .

మా నరసరావుపేటలో నాగూర్వలి టాకీసులో చూసా . తర్వాత టి.వి లో చాలా సార్లు చూసా . టి.వి లో ఈమధ్య కూడా చూసా . ఆసక్తి కలవారు యూట్యూబులో చూడవచ్చు . బాగుంటుంది . చూడని వారు చూడండి .  
————-

Tharjani ………..

లక్షాధికారి’  సినిమాను తెలుగులో తొలి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ కి కూడా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చేయడం అదే మొదటిసారి. అలాగే గుమ్మడి ఈ సినిమాలో  విలన్‌గా నటించడం విశేషం. రెగ్యులర్ గా విలన్ పాత్రలు చేసేవారితో  అయితే చివరి వరకు ఉత్కంఠ సాగదని  గుమ్మడిని ఎంచుకున్నారు. ఇవన్నీ సినిమాకు హైలైట్ అయ్యాయి. ప్రేక్షకులను సినిమా అలరించింది. 

సినారే రాసిన  ‘మబ్బులో ఏముంది’ పాటను డ్యూయెట్‌గా వాడుకున్నారు. అది ఒక లలిత గీతం. ఆలిండియా రేడియోలో  ఎక్కువగా వినిపించేది. ఆరోజుల్లో సినిమా బడ్జెట్‌ నాలుగున్నర లక్షలు. అప్పట్లో సినిమా బాగా ఆడింది. సెకండ్‌ రిలీజ్‌లో అంతకు మించి ఆదరణ పొందింది.

ఎన్టీఆర్‌ ప్రత్యేక చిత్రాల్లో లక్షాధికారి ఒకటిగా నిలిచిపోయింది. మొదట ఈ సినిమాకు అక్కినేని ని హీరోగా అనుకున్నారు. ఆయన డేట్స్ అడ్జెస్ట్ కాక అపుడు ఎన్టీఆర్ ని సంప్రదించారు.  ఈ సినిమా తరువాత  తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఎన్నో సినిమాలు తీశారు.

అక్కినేని నాగేశ్వరరావుతో ‘జమిందారు, ధర్మదాత, దత్తపుత్రుడు’, శోభన్‌బాబు తో ‘సిసింద్రీ చిట్టిబాబు, డాక్టర్‌ బాబు, ఇద్దరు కొడుకులు’, కృష్ణంరాజు తో ‘అమ్మానాన్న’… వంటి  సినిమాలు తీశారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!