Bharadwaja Rangavajhala……………………………….
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన తొలి సిన్మా ‘ఆత్మ గౌరవం’ హీరో అక్కినేని అయినప్పటికీ ఎన్టీఆర్ తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా?ఎన్టీఆర్ డేట్స్ దొరక్కే.. ‘జీవన జ్యోతి’ శోభన్ బాబుతో తీశారు. ఎన్టీఆర్ తో విశ్వనాథ్ ‘కలిసొచ్చిన అదృష్టం’, ‘నిండు హృదయాలు’,’నిండు దంపతులు’ ,’చిన్ననాటి స్నేహితులు’ వంటి సినిమాలు చేశారు.
ఎన్టీఆర్తో విశ్వనాథ్ కి సినిమాల్లోకి రావడాని కన్నాముందే పరిచయం ఉందని చాలామందికి తెలియదు. వాళ్లిద్దరూ బెజవాడ నుంచి గుంటూరు వరకూ రోజు ఓకే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ బోల్డు విషయాలు మాట్లాడుకునేవారు. విశ్వనాథ్ కన్నాఎన్టీఆర్ పెద్దవాడు … విశ్వనాథ్ ఇంకా ఏసీ కాలేజ్ లో ఉండగా అన్నగారు సబ్ రిజిష్టార్ అయిపోయారు.
విచిత్రం గా ఇద్దరు వాహిని కాంపౌండ్ లో తిరిగి కలిశారు. వీరిద్దరితో పాటు నటుడు జగ్గయ్య కూడా ఏసీ కాలేజీలోనే చదువుకున్నారు. అందరూ చిన్ననాటి స్నేహితులే. విశ్వనాథ్ ఎన్టీఆర్ ,జగ్గయ్య లతో “చిన్ననాటి స్నేహితులు” అనే సినిమా తీశారు.
‘డబ్బుకు లోకం దాసోహం’ సినిమాకు ముందుగా విశ్వనాథ్ డైరెక్టర్ అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఇష్టపడకపోవడంతో యోగానంద్ ను డైరెక్టర్ గా తీసుకున్నారని అప్పట్లో పుకార్లు వచ్చాయి. నిజానికి అప్పటికి విశ్వనాథ్ డేట్స్ దొరక్కపోవడంతో ఎన్టీఆర్ ఆయనకు అత్యంత సన్నిహితుడైన యోగానంద్ తో ఆ సినిమా పూర్తి చేయించారు.
శంకరాభరణం సిన్మా ఆయన తొలి చిత్రం అనుకునేవారు…ఆయన కేవలం సంగీతం సిన్మాలు తీశారు అనుకునేవారు కూడా ఉన్నారు పాపం. శంకరాభరణం ఆడుతున్న రోజుల్లోనే ఆయనే దర్శకత్వం వహించిన ‘అల్లుడు పట్టిన భరతం’ సినిమా విడుదలైన విషయం ఎందరికి గుర్తుంది? అలాగే ‘ప్రెసిడెంట్ పేరమ్మ’ అనే టైటిల్ తో ఆయన నూతన్ ప్రసాద్ , కవితలతో ఓ సోషల్ డ్రామా తీశారని ఎంత మందికి గుర్తుంది. వీటన్నిటికన్నా ముందు… ఆయన ‘కాలాంతకులు’ అనే ఓ క్రైమ్ ఓరియంటెడ్ మూవీ తీశారు.
అందులో గుర్రాలు ఫైట్లూ ఉండడంతో … కెఎస్ఆర్ దాస్ గారిని తీసుకొచ్చి అవి తీయించుకుని దర్శకులలో తనతో సమానమైన స్తానాన్నిస్తూ ఆయన పేరూ వేయడం విశ్వనాథ్ సంస్కారానికి నిదర్శనం.మరి మా జర్నలిస్ట్… ప్రస్తుతం మా ఆఫీస్ ఉన్న ఇంటి ఓనరు అయిన వాసిరాజు ప్రకాశంగారికి ‘కాలం మారింది’ సినిమా తీసిపెట్టారాయన.
‘శంకరాభరణం’ కన్నా ముందు కూడా విశ్వనాథ్ సినిమాల్లో సంగీతం కాస్త ప్రత్యేకంగా ఉండేది.’శంకరాభరణం’ తర్వాత ఆయన సినిమాలు సంగీత ప్రధానమై పోయాయి.ఇదీ తేడా .. తప్ప మిగిలినదంతా సేమ్ టూ సేమ్ . విశ్వనాథ్ ఎప్పుడూ సెన్సుబుల్ మూవీసే చేశారు పాపం . తన సినిమాల గురించి ఆయనే ఓ సందర్భంలో ఓ మాట చెప్పారు.
నా సినిమాలు పది మందిలో ముగ్గురు గ్యారంటీగా చూస్తారయ్యా … ఆ సంఖ్య ఒక్కోసారి ఆరుదాకా వెళ్తుంది.. అలా వెళ్లిన సినిమాలను మీ భాషలో హిట్టు సినిమాలంటారు అన్నారాయన. నేను జర్నలిస్టునని తెల్సి వెటకారంలో .. ఆ ముగ్గురూ ఇప్పుడు విశ్వనాథ్ సినిమా థియేటర్లలో వేసినా వెళ్లి కూర్చుంటారంతే .. విత్ ఫామ్లీస్ మళ్లీ … అదీ ఆయన ముద్ర.
కాకపోతే చిన్నప్పుడు కాలేజీ రోజుల్లో ఎన్ కౌంటర్ పింగళి దశరథ రామ్… అన్న మాట నాకు చాలా ఇష్టం..శివాలయంలో పూజారిగా ఉండాల్సిన విశ్వనాథ్ ను … రామాలయంలో పూజారిగా ఉండాల్సిన బాపూనీ దర్శకుల్ని చేశారేమిట్రా బాబో అని.