పాక్ లో అంత పెద్ద సంఖ్యలో హిందువులున్నారా ?

Sharing is Caring...

Sai Vamshi ……………….

కశ్మీర్‌లో ఉగ్రదాడి అనంతరం అటు పాకిస్థాన్, ఇటు భారత్ రెండు దేశాలూ గట్టి పట్టు మీద ఉన్నాయి. ముఖ్యంగా పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలు భారత్‌లో ఇంకా కోపాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయ సమాజం సైతం పాక్‌ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది.

పాకిస్థాన్, భారత్‌ల మధ్య యుద్ధం తప్పదా ?అనే వార్తలు వెలువడుతున్న వేళ, పాకిస్థాన్‌లో హిందువులు ఎలా ఉన్నారనేది చర్చలోకి రాకపోవడం విచిత్రం. ప్రస్తుతం వాళ్ల మానసిక స్థితి ఏమిటి, వాళ్ల ఇబ్బందులేమిటి, వాళ్లు భద్రంగా ఉన్నారా అనేది చర్చించాల్సిన విషయం.

పాకిస్థాన్ అనగానే అందరూ ముస్లింలే ఉంటారన్న భ్రమ చాలామందిలో ఉంది. కానీ, 2023 లెక్కల ప్రకారం, పాకిస్థాన్‌లో 52 లక్షల మంది హిందువులు ఉన్నారని అంచనా. ఇది ఆ దేశ జనాభాలో 2.17 శాతం. ఆ దేశంలోని మైనారిటీల్లో హిందువులదే ప్రధాన భాగం. వారంతా ఆ దేశంలోనే తరతరాలుగా ఉంటున్న ఆ దేశ పౌరులు. దేశ విభజన సమయంలో అక్కడే స్థిరపడ్డారు.

వీళ్లల్లో సింధీ హిందువులు, తమిళ్ హిందువులు, కలశులు, నానక్‌పంతులు, బాల్మీకి హిందువులు, పష్టూన్ హిందువులు, పంజాబీ హిందువులు.. ఇలా ఉంటారు. వీళ్లు ఎక్కువగా సింధు ప్రాంతంలో ఉన్నారు. ఉమెర్‌కోట్, తర్పార్కర్ జిల్లాల్లో 50 శాతానికి పైగా ఉన్నది హిందువులే.

పాకిస్థాన్‌లో హిందువులతోపాటు క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు కూడా నివసిస్తున్నారు. విచిత్రమేమిటంటే, పాకిస్థాన్‌లోని హిందువుల్లోనూ చాలామంది అక్కడి దళితులను వివక్షతో చూస్తున్నారు. ఈ విషయాన్ని ‘Information on Caste Based Discrimination in South Asia, Long Behind Schedule, a Study on the Plight of Scheduled Caste Hindus in Pakistan’ బయటపెట్టింది.

అక్కడ జాతీయ విద్యాశాతం దాదాపు 60 శాతం కాగా, హిందువుల విద్యాశాతం 40 వరకూ ఉంది. అందులో దళితుల విద్యాశాతం దాదాపు 20. అంటే 100 మంది దళితుల్లో 20 మందికే చదువు ఉన్నట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌లో హిందువులతోపాటు ఇతర మైనార్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి మతమార్పిడి. ఒత్తిడి చేయడం, సహాయ నిరాకరణ, ఉద్యోగాలు, ఉపాధిలో వివక్ష వంటి అంశాల ద్వారా కొందరు ముస్లింలు అక్కడి మైనార్టీలను మతం మారేలా చేస్తున్నారు. అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లి మతం మార్చడం, బలవంతపు పెళ్లిళ్లు కూడా హిందువుల మతమార్పిడికి కారణమవుతున్నాయి.

ఈ అకృత్యాలను ఆపడానికి 2005లో పాకిస్థాన్‌లో రమేశ్ కుమార్ వంక్వానీ ‘పాకిస్థాన్ హిందూ కౌన్సిల్’ ప్రారంభించారు.హిందూ జనాభా అధికంగా ఉన్న చోట స్కూళ్లు నడపడం, పేద హిందూ అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించడం వంటివి చేయిస్తున్నారు. పాకిస్థాన్‌లోని మైనార్టీలంతా కలిసికట్టుగా ఉండాలని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

వీటితోపాటు పాకిస్థాన్ హిందూ పంచాయత్, పాకిస్థాన్ హిందూ యూత్ కౌన్సిల్, పాకిస్థానీ హిందూ సంక్షేమ సమితి వంటివి హిందువుల హక్కులు, పరిరక్షణ, రాజకీయ లబ్ధి వంటి అంశాల కోసం పోరాడుతున్నాయి.మైనార్టీ మతాలను మేం గౌరవిస్తాం అని పాక్ ప్రభుత్వం పైకి చెప్పుకున్నా, లోపల మాత్రం స్థానికంగా హిందూ దేవాలయాలను కట్టనీయకుండా చేస్తోందన్న వాదన ఉంది.

2020లో దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో మొదటి హిందూ దేవాలయం కట్టాలని భావించి గోడ నిర్మించగా, దాన్ని మతవాదులు కూల్చేశారు. గతంలో ఉన్న గుళ్లు కొన్ని చోట్ల కూల్చేశారు. మరికొన్నిచోట్ల మాత్రం గుళ్లు యథాతథంగా ఉన్నాయి.రాజకీయంగా, ఇతర సౌకర్యాలపరంగా కూడా హిందువులు అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఉద్యోగాలు ఉన్న హిందువులు, పదవుల్లో ఉన్న నేతలు సైతం చాలాసార్లు ద్వితీయశ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి రావడం దారుణం.  సంఖ్య స్పష్టత లేకపోయినా కొందరు హిందూ యువకులు సైతం పాక్ ఆర్మీలో ఉన్నారని సమాచారం. 2013లో ‘అశోక్‌కుమార్’ అనే వ్యక్తి పాక్ ఆర్మీలో జవానుగా పనిచేస్తూ కాల్పుల్లో మరణించాడు.

అయితే పాకిస్థాన్‌లోని చాలాచోట్ల హిందువులు, ముస్లింలకు మధ్య మైత్రి బంధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బలూచిస్థాన్ ప్రాంతంలో ఈ విషయం ఎక్కువగా గమనించొచ్చు. అక్కడున్న గుళ్లను ముస్లింలు భద్రంగా చూసుకుంటారని, తమను మతం మారమని ఏ రోజూ అడగలేదని అక్కడి హిందువులు పలుమార్లు వివరించారు.

అయితే కుజ్దర్, కలత్ వంటి జిల్లాల్లో మాత్రం హిందువుల మీద వివక్ష ఉందనేది వాస్తవం.
ప్రస్తుతానికి పాకిస్థాన్‌లోని హిందువులు భద్రంగా ఉన్నా, ఈ ఉగ్రదాడి అనంతర పరిణామాల మధ్య పాక్ వారిని ఇబ్బందులు పెట్టకుండా ఉండేలా ఐకరాజ్య సమితి, భారత్ కలిసి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!