The by-election is going to be crucial…………………….
కేరళ లోని వయనాడు లోక్సభ స్థానానికి నవంబర్ 13 న ఉప ఎన్నిక జరగనుంది. వయనాడు నుంచి ప్రియాంక గాంధీ మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇటు వయనాడ్ అటు రాయబరేలీ స్థానాలనుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఆయన రాయబరేలీ ఎంపీ గా కొనసాగడానికి నిర్ణయించుకోవడంతో వయనాడు కి ఉప ఎన్నిక అనివార్యమైంది.వయనాడు ఎంపీగా రాజీనామా చేసిన సందర్భంలో రాహుల్ గాంధీ.. తన స్థానంలో వయనాడు నుంచి పోటీ చేయబోయేది ఎవరనే అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో వయనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరు మూడు నెలల కిందటే ఖరారు అయింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథితో పాటు వయనాడు నుంచి పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో అమేథి నుంచి ఓడిన రాహుల్ గాంధీ.. వయనాడులో మాత్రం 4,31,770 ఓట్ల ఆధిక్యతతో సీపీఐ అభ్యర్థి సునీర్ పై ఘన విజయం సాధించారు.. 24 మే వరకు వయనాడు ఎంపీగానే కొనసాగారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలీతో పాటు .. మళ్లీ వయనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు .. తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి అన్నీరాజా పై 3 లక్షల 64 వేల 422 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేంద్రన్కు లక్షా 41 వేల ఓట్లు రావడం విశేషం.
2014 లో ఇక్కడ పోటీ చేసి 80 వేల ఓట్లు సాధించిన బీజేపీ 2019 లో ఎందుకో పోటీ చేయలేదు. ఈ సారి ఉప ఎన్నికలో పరిస్థితి ఎలా ఉంటుందో .. వేచి చూడాలి. పోటీ చేసేది ప్రియాంక గాంధీ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
2009,2014ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కి మంచి పట్టు ఉన్న లోకసభ స్థానం కాబట్టే రాహుల్ ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. కాకపోతే 2019 లో వచ్చిన మెజారిటీ తో పోలిస్తే 2024 లో రాహుల్ మెజారిటీ 67 వేల ఓట్ల మేరకు తగ్గింది.
కొన్నాళ్ల క్రితమే ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ ఎన్నికల బరిలోకి ఆమెను దింపాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే చివరి నిమిషంలో పార్టీ వెనుకడుగు వేసింది. ఇక వయనాడు ఉపఎన్నిక ఫలితం నవంబర్ 23న వెలువడుతుంది.