వాణిశ్రీ జైత్రయాత్రలో మరో మైలురాయి !

Sharing is Caring...

Subramanyam Dogiparthi……………………This generation must see it. 

కవయిత్రి మొల్లమాంబలో కధానాయిక మొల్లను తెలుగు వారికి పరిచయ చేసిన సినిమా ఇది .   పద్మనాభం స్వీయదర్శకత్వంలో 1970 లో వచ్చిన చాలా మంచి సినిమా. కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది. వాణిశ్రీ తనకొచ్చిన మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. నటుడు పద్మనాభం తీసిన సినిమాల్లో ఇదొక మంచి సినిమా.  

సామాజిక రుగ్మతల మీద తిరగబడే యువతిగా , ఆత్మాభిమానం కల వ్యక్తిగా , కవయిత్రి అయ్యాక అద్భుతమైన ఉదాత్త వ్యక్తిగా గొప్పగా నటించింది .బద్వేలు వద్ద ఉన్న గోపవరం గ్రామంలో జన్మించిన మొల్ల శ్రీకృష్ణదేవరాయలు , తెనాలి రామలింగడు సమకాలీనురాలని చెపుతారు . తెలుగు సినిమా జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు గారు వ్రాసిన మొల్ల జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా ను తీశారు. 

ఈ సినిమాలో వాణిశ్రీ తర్వాత మెచ్చుకోవలసింది దేవదాసి పాత్రలో గీతాంజలి. నటన , నృత్యం అన్నీ చాలా గొప్పగా ఉంటాయి . రామలింగడుగా పద్మనాభం , దేవుడిగా హరనాథ్ , శ్రీకృష్ణదేవరాయలుగా సత్యనారాయణ , మొల్ల తండ్రిగా గుమ్మడి చక్కగా నటించారు . విలన్ & కోగా నాగభూషణం , అల్లు రామలింగయ్య , మిక్కిలినేని , విలన్ నాగభూషణం భార్యగా హేమలత , రాజబాబు బాగా నటించారు. 

యస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో పాటలు ఈనాటికీ పాపులరే . ‘జగమే రామమయం మనసే అగణిత తారక నామ మయం ‘, ‘మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా’ పాటలు బాగా హిట్టయ్యాయి. మరో గొప్ప పాట , నృత్యం రాయల వారి సభలో జ్యోతిలక్ష్మి నృత్యం . అయిదు భాషల్లో పాట , ఆయా ప్రాంతాల నృత్య దుస్తుల్లో జ్యోతిలక్ష్మి నాట్యం తప్పక చూడాల్సిందే.

అలాగే గీతాంజలి నృత్యం ‘తనువూ నీదే మనసూ నీదే’ కూడా చాలా గొప్పగా ఉంటుంది .‌వాణిశ్రీ ‘అమ్మనురా పెద్దమ్మనురా’ అంటూ జంతుబలిని నిరసిస్తూ పాడే పాట , ‘దొరవో ఎవరివో నా కొరకే దిగిన దేవరవో’ పాట బాగుంటాయి. 

1970 సంవత్సరానికి గానుఈ సినిమా బంగారు నంది అవార్డును పొందింది . వాణిశ్రీ ప్రస్థానంలో ఆమెకు పేరు తెచ్చిన సినిమాలలో ఒకటి. ఈ చారిత్రక , ఆధ్యాత్మిక సినిమా . గోదా కల్యాణం , విష్ణువు నవ అవతారాల చిత్రీకరణ ప్రస్తావన , తదితర పద్యాలు తప్పక చూడవలసినవి . యూట్యూబులో ఉంది . తప్పక చూడండి .

నేను మా నరసరావుపేటలోనే చూసా . టి విలో కూడా చూసా .ఈ సినిమాలో మొల్ల శ్రీరాముడిలో ఐక్యం ఆయినట్లు చూపారు . ఆమె జీవిత చరిత్రలో శ్రీశైలంలో చివరి రోజులు గడిపిందని చెప్పబడింది . ఇవన్నీ ఎలా ఉన్నా రంగనాధ , భాస్కర రామాయణాల తర్వాత మొల్ల రామాయణం తెలుగు వారి సాహిత్య సంపద . మన సాహిత్య , ఆధ్యాత్మిక , సామాజిక సంపద గురించి , వారసత్వం గురించి తెలుసుకోవటానికి  ఈ తరం వారు తప్పక చూడాలి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!