Failure Political story …………………………
తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, ఎంజీఆర్ ల హవా కొనసాగుతున్న సమయం లోనే సుప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో తన సత్తా చూపాలని ప్రయత్నించారు. అయితే విజయం సాధించలేకపోయారు.
శివాజీగణేశన్ కూడా తమిళ నాట మంచి గుర్తింపు గల నటుడు .. ఈయన తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నటించాడు. నడిగర్ తిలకంగా ఖ్యాతి గాంచిన శివాజీగణేశన్ కాలం కలసి రాక రాజకీయాల్లో డబ్బు కూడా పోగొట్టుకున్నారు.మొదట్లో శివాజీగణేశన్ కూడా డి.ఎమ్.కె. పార్టీలోనే ఉండేవాడు. ఆయన తొలి చిత్రం ‘పరాశక్తి’ రచయిత కరుణానిధి.. . డీఎంకే పార్టీ భావాలకు అనుగుణంగా సినిమాలకు కరుణానిధి డైలాగులు రాసేవారు.
సినిమారంగంలో శివాజీ, ఎంజీఆర్ పోటీ పడేవారు. ఎమ్.జి.ఆర్. సూపర్ స్టార్ గా ఎదిగిన తరువాత మాస్ లో ఆయనకున్న ఫాలోయింగ్ ను చూసి కరుణానిధి ఎంజీఆర్ ను కూడా పార్టీ లోకి ఆహ్వానించారు. ఇది నచ్చని శివాజీగణేశన్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఆ తరువాత ఎంజీఆర్ కూడా 1972 లో డి.ఎమ్.కె. నుండి బయటకొచ్చి సొంతంగా ‘అన్నా డి.ఎమ్.కె. పార్టీ’ పెట్టారు.
1977 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంజీఆర్ తో శివాజీగణేశన్ సారధ్యంలోని కాంగ్రెస్ పోటీపడింది. అయితే ఎంజీఆర్ విజేతగా నిలిచారు. రాజ్యసభ ఎంపి నర్గిస్ దత్ 1981 లో కన్నుమూసారు. ఆ సీటు శివాజీకి దక్కింది. రాజ్యసభ సభ్యులు అయ్యారు.1988 లో ఎఐఎడిఎంకె అంతర్గత గొడవల్లో జయలలిత .. జానకి రామచంద్రన్లలో ఎవరికి మద్దతు ఇవ్వాలా అనే అంశంపై తమిళ కాంగ్రెస్ రెండు ముక్కలైంది.
దాంతో శివాజీ బయటికొచ్చారు. ‘తమిళగ మున్నేట్ర మున్నని’ పేరిట కొత్త పార్టీ పెట్టారు. తమిళనాట అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిన ఆయన పార్టీ పరాజయం పాలైంది. తిరువయ్యారులో బరిలో నిలిచిన శివాజీ గణేశన్ 10,643 ఓట్ల తేడాతో డిఎంకె అభ్యర్థి చంద్రశేఖరన్ దురై చేతిలో ఓడిపోయారు.
ఆనాటి ఎన్నికల్లో శివాజీ ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ కి మద్దతు పలికారు. ఫలితాలు వ్యతిరేకంగా రావడం తో శివాజీ పార్టీని వీపీ సింగ్ ఆధ్వర్యంలోని జనతాదళ్లో విలీనం చేసి కొన్నాళ్ళు తమిళనాడు జనతాదళ్ శాఖ అధ్యక్షులుగా చేశారు. ఆ తర్వాత రాజకీయాలను విడిచిపెట్టారు. కరుణానిధిని. ఎంజీఆర్ ను, జయలలితను రాజకీయంగా ఎదుర్కోలేకపోయారు. నటుడిగా ఆయనకు బ్రహ్మరధం పట్టిన ప్రజలు రాజకీయంగా ఆదరించలేదు.
———KNM