ఉక్రెయిన్ కి ఏమార్గం నుంచి కూడా ఆయుధాలు అందకుండా చేయాలనే లక్ష్యంతో పుతిన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా విమానాశ్రయాలపై క్షిపణి దాడులు చేస్తున్నారు. మరోవైపు నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
ఆదివారం క్షిపణుల దాడితో సెంట్రల్ ఉక్రెయిన్లోని విన్నిట్సియాలోని విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ విషయాన్ని ధృవీకరించారు. “ఉక్రెయిన్ కి చెందిన ఎనిమిది రాకెట్లు.. విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైనాయి..
రష్యా తన దాడిని ప్రారంభించినప్పటి నుండి ఉక్రెయిన్లోని కీలక నగరాలు , వైమానిక స్థావరాలపై బాంబు దాడులు చేస్తోంది.విన్నిట్సియా విమానాశ్రయం బెలారస్ సరిహద్దులకు దూరంగా సెంట్రల్ ఉక్రెయిన్ లోని పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఈ క్రమంలోనే రష్యా మరిన్నిదాడులు చేయకుండా ఆపడానికి ఉక్రెయిన్పై నో-ఫ్లై జోన్ను అమలు చేయాలని జెలెన్స్కీ మరోమారు డిమాండ్ చేశారు.
రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలను అందించాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా చట్టసభ్యులను కూడా కోరారు.రష్యా చమురు దిగుమతులపై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు.అమెరికా చట్టసభ్యులతో ఆయన వీడియో కాల్లో మాట్లాడారు. తనను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావచ్చని కూడా జెలెన్స్కీ అన్నారు.
ఇవే తన చివరి మాటలు కావొచ్చంటూ జెలెన్స్కీ భావోద్వేగపూరితంగా మాట్లాడారు.300 మంది అమెరికా చట్టసభ సభ్యులతో జెలెన్స్కీ దాదాపు గంట సేపు మాట్లాడారు.జెలెన్స్కీ అభ్యర్థనపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాను రాజధాని కీవ్లోనే ఉన్నానని ప్రజలు రష్యన్ ఆక్రమణదారుల నుంచి మాతృభూమిని కాపాడుకుంటామని ప్రతినబూని ప్రాణాలకు తెగిస్తున్నారని జెలెన్స్కీ వివరించారు.ఇతర దేశాలనుంచి ఆయుధాలు ఉక్రెయిన్ కి అందకుండా చేయాలనే లక్ష్యం తో పుతిన్ విమానాశ్రయాలను, రేవు పట్టణాలను టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు.
రష్యా కీవ్ సరిహద్దుల్లో తన సేనలను ఉంచి అజోవ్ సముద్రంలోని కీలక నౌకాశ్రయమైన మారియుపోల్పై దాడులను తీవ్రం చేసింది. ఈ నగరం స్వాధీనం చేసుకొంటే అజోవ్ సముద్రంతో ఉక్రెయిన్కు సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని భావిస్తోంది.
కాగా ఖెర్సాన్ నగరాన్ని ఇప్పటికే రష్యా స్వాధీనం చేసుకొంది. నల్ల సముద్రంలో కీలకమైన ఒడెస్సా రేవును స్వాధీనంపై దృష్టిపెట్టింది. ఈ రేవును స్వాధీనం చేసుకుంటే నల్ల సముద్రంలో ఉక్రెయిన్ పూర్తిగా పట్టుకోల్పోతుంది. పశ్చిమ దేశాల నుంచి ఇటుగా ఆయుధాలు వచ్చే అవకాశం లేదు. మొత్తం మీద ఎటువైపు నుంచి ఆయుధాలు అందకుండా అన్ని దారులు మూసి వేయాలనే పుతిన్ వ్యూహ రచన చేశారు.