దేశవ్యాప్తంగా పిల్లలు, మహిళలు,పురుషులు మిస్ అవుతున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. 2019తో పోలిస్తే 2020లో మిస్ అయిన వారి సంఖ్య 34,295 మేరకు తగ్గింది. 2020లో దేశం మొత్తం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్నప్పటికీ 6,70,145 మంది తప్పిపోయారు. వీరందరూ ఎటు వెళ్లారు.. ఏమైపోయారో ఎవరికి తెలీదు.
2019 లో భారతదేశం మొత్తం మీద 6,93,003 మంది పిల్లలు, మహిళలు,పురుషులు కనిపించకుండా పోయారు. దేశంలో ప్రతి గంటకు 88 మంది పిల్లలు, మహిళలు, పురుషులు అదృశ్యమైపోతున్నారు. ప్రతిరోజూ 2,130 మంది పిల్లలు, మహిళలు .. పురుషులు కనిపించకుండా పోతున్నారు.
ప్రతి నెల 64,851 మంది పిల్లలు, మహిళలు, పురుషులు మిస్ అవుతున్నారు. ప్రతి గంటకు సగటున 12 మంది, ప్రతిరోజు సగటున 296 మంది, ప్రతి నెలా 9,019 మంది పిల్లలు తప్పిపోతున్నారు. 2019 లో దేశం మొత్తం మీద 1,19,617 మంది పిల్లలు మిస్సయినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) చెబుతోంది. ఈ మొత్తం పిల్లల సంఖ్యలో 69.7% మంది యువతులే ఉన్నారు..అంటే 82617 మంది బాలికలు మిస్ అయ్యారన్నమాట. ఇక మిగిలిన వారు అంతా బాలురు.
2020లో దేశం మొత్తం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న సమయంలో కూడా మిస్సింగ్ కేసులు బాగానే నమోదు అయ్యేయి. NCRB డేటా ప్రకారం, 33,456 మంది బాలికలు .. 15,410 మంది బాలురు మిస్ అయ్యారు. 2020లో 59.7% మంది పిల్లల ఆచూకీ దొరికింది. అలా దొరికిన వారిలో 48,717 మంది బాలికలు ,15,832 మంది బాలురు ఉన్నారు.
ప్రతి ఊళ్ళో .. ప్రతి రోజు .. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకటి లేదా రెండు మిస్సింగ్ కేసులపై ఫిర్యాదులు అందుతున్నాయి. మిస్ అయిన వారిలో ముఖ్యంగా మహిళలు, బాలికలే అధికంగా ఉంటున్నారు. వీరంతా ఎటు పోతున్నారు అనేది మిస్టరీ. కొందరు మాత్రమే వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. మగపిల్లల్లో కొందరిని వేరే రాష్ట్రాలకు తరలించి బలవంతంగా పనుల్లో పెడుతున్నారు. భిక్షాటన చేయిస్తున్నారు. మరి మిగతా వారి మాటేమిటి ? మిస్ అయిన మగవాళ్ళు ఏమైపోతున్నారు ? పోలీస్ శాఖ గట్టి దృష్టి పెడితే కానీ ఈ మిస్సింగ్ మిస్టరీ తేలదు.