హిట్ ఫార్ములాతో.. రేసులో మాయావతి !

Sharing is Caring...

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా 2007 నాటి హిట్ ఫార్ములాను అనుసరిస్తున్నారు.  బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి మద్దతు పొందే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.

ప్రతి జిల్లాలో బ్రాహ్మణులను సమైక్య పరిచేందుకు ప్రబుద్ధ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 62 జిల్లాల్లో ఈ సమ్మేళనాలు నిర్వహించారు. లక్నోలో సెప్టెంబరు 7న జరిగే చివరి సమ్మేళనానికి మాయావతి కూడా హాజరవుతారు. ఆరోజు నుంచే పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మాయావతి ప్రారంభించే అవకాశాలున్నాయి.

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో బ్రాహ్మణులు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారని బీఎస్పీ ఆరోపిస్తున్నది. యోగి హయాంలో తీవ్రంగా వేధింపులకు గురైన వర్గం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ సమాజమేనని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ పరిపాలనలో బ్రాహ్మణులకు జరిగినట్లుగానే యోగి ప్రభుత్వంలో కూడా జరుగుతోందని అంటున్నారు.

ఈ ప్రబుద్ధ సమ్మేళనాలకు స్పందన బాగానే ఉంది. ఏ ప్రభుత్వం ఏంచేసింది అనే విషయాన్నీ బ్రాహ్మణ సామాజిక వర్గం అంచనా వేసుకుంటున్నది. ఈ క్రమంలో మాయావతి పార్టీకి బ్రాహ్మణ కమ్యూనిటీ మద్దతు లభిస్తే విజయావకాశాలు మెరుగు పడతాయని పార్టీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఉత్తర ప్రదేశ్ జనాభాలో బ్రాహ్మణులు 13 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు, దళితుల ఓట్లకు ఇతర వర్గాల ఓట్లు జతకూడితే, ఓట్ల శాతం 45 నుంచి 50 శాతానికి పెరుగుతుందని పార్టీ విశ్లేషిస్తోంది. అదే జరిగితే 2007లో పరిస్థితులు పునరావృతం కావచ్చని భావిస్తున్నారు.

2007 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి ఇదే ఫార్ములాను అనుసరించి లబ్ధిపొందారు ఇప్పుడు కూడా బ్రాహ్మణ సమ్మేళనాల ద్వారా చురుకైన నేతలను కనుగొని వారికి టిక్కెట్లు ఇవ్వబోతున్నారు. అప్పట్లో అధిక సంఖ్యలో బ్రాహ్మణులకు  మాయావతి  టిక్కెట్లు ఇచ్చి సంచలనం సృష్టించారు.  భిన్నధృవాలైన  బ్రాహ్మణ .. దళిత ..  ముస్లిం లను ఏక తాటిపై నడిపే ప్రయోగం చేసి విజయం సాధించారు.

403  సీట్లకు గాను 206 సీట్లు  గెలుచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అదే ఫార్ములాతో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని మాయావతి వ్యూహరచన చేశారు.  న్యాయవాది,మాజీ మంత్రి  సతీష్ చంద్ర మిశ్రా ప్రస్తుతం బీఎస్పీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన మాయావతి పార్టీ  గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. హిట్ ఫార్ములా ఆయన ఐడియానే అని అంటారు. పార్టీలో ఆయన కీలక సభ్యుడు. ఆయన సూచనల మేరకే  మాయావతి అడుగులు వేస్తుంటారని అంటారు. పంజాబ్ లో 2022 లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలలో శిరోమణి అకాలీదళ్ [SAD] బహుజన సమాజ్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేయబోతున్నాయి. 

————–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!