ఆ ద్వీపానికి వెళితే ..వెనక్కి రాలేమా ?

Sharing is Caring...

Dangerous island ………………………

ఆ ద్వీపానికి వెళ్లడాన్ని నిషేధించారు..ఎవరి కంటపడకుండా వెళ్లినా వెనక్కి తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు.ఆ ద్వీపం పేరు ‘నార్త్‌ సెంటినెల్’ ద్వీపం..అండమాన్ దీవుల సమూహంలో ఇది ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలో ఉంటుంది. ఈ ద్వీపాన్ని ఎవరూ సందర్శించక పోవడానికి కారణం.

ఈ తెగలవారు ఎవరితో కలవరు. ఎవరిని వాళ్ళ ద్వీపంలోకి రానివ్వరు. బాహ్య ప్రపంచంతో ఇక్కడి ప్రజలకు ఎలాంటి సంబంధాలు లేవు. ఈ ద్వీపం చాలా చిన్నది. దాదాపు 60 చదరపు కిలోమీటర్ల భూభాగం, ఇది ఉష్ణమండల వర్షారణ్యాలతో దట్టంగా కప్పబడి ఉంటుంది. చుట్టూ నిస్సారమైన దిబ్బలు, తెల్లటి ఇసుక బీచ్‌లు ఉన్నాయి.

ఈ ద్వీపంలో నివసించేవారిని సెంటినెలీస్ అంటారు.ఆఫ్రికాను విడిచిపెట్టిన మొదటి మానవుల ప్రత్యక్ష వారసులుగా భావిస్తున్న సెంటినెలీస్ చాలాకాలంగా ఇక్కడే ఒంటరిగా ఉన్నారు.సెంటినెలీస్ జనాభా 50 నుండి 200 వరకు ఉంటుందని అంచనా.

వారు ఒంటరిగా ఉండటం..బయటి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడానికి నిరాకరించడం వల్ల ఖచ్చితమైన సంఖ్యను నిర్ణయించడం కష్టం.సెంటినెలీస్ జనాభా తగ్గుతున్నట్లు భావిస్తున్నారు.వారు ఏ భాష మాట్లాడతారో, ఎంతమంది ఉన్నారో? వారు తమను తాము ఎలా వ్యవస్థీకరించుకుంటారో తెలియదు.

సెంటినెలీస్  తీసుకునే ఆహారం, వారి జీవనం ప్రపంచానికి ఈనాటికి మిస్టరీగానే ఉన్నాయి. ఈ ద్వీపం అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటి వరకు సెంటినెలీస్ ఇతరుల నుంచి ఎటువంటి దాడిని ఎదుర్కోలేదు.

వీరు తక్కువ ఎత్తులో ఉంటారని అంచనా.కార్బన్ డేటింగ్ పరిశోధన ద్వారా ఈ తెగ రెండు వేల ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.సెంటినెలీస్ ప్రజలు గుడిసెలలో నివసిస్తారు. పురుషులు, మహిళలు ఇద్దరూ బట్టలు ధరించరు.

విల్లు, బాణాలను ఉపయోగించి అడవి పందులను వేటాడతారు. బాణాలతో చేపలు పట్టుకుంటారు. పండ్లు, వేర్లను, తేనెను సేకరిస్తారు. చేపలు, తాబేళ్లు. పీతలు కొబ్బరికాయలు,ద్వీపంలో పెరిగే కొన్ని మొక్కలను తింటారు.

ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు.. నార్త్ సెంటినెల్ ద్వీపాన్ని బయటి వ్యక్తులు సందర్శించేందుకు వీలు లేకుండా భారత ప్రభుత్వం అండమాన్,నికోబార్ దీవుల నియంత్రణ 1956 చట్టాన్ని తీసుకొచ్చింది. నార్త్ సెంటినెల్ ద్వీపంలో నివసించే గిరిజనులు బయటి ప్రపంచం నుండి ఎవరైనా తమ ప్రాంతానికి రావడాన్ని ఇష్టపడరు.  

బ్రిటీష్ వారి కాలంలోనే .. సెంటినలీస్ తెగకు బయటి వ్యక్తులతో చేదు అనుభవాలున్నాయి. 1880లో బ్రిటిష్ నావికాదళ అధికారి మారిస్ విడాల్ పోర్ట్‌మన్ ఆరుగురు ద్వీపవాసులను కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్‌కు తీసుకువెళ్ళాడు. 

అక్కడి వాతావరణానికి తట్టుకోలేక.. వారు అనారోగ్యం పాలయ్యారు.ఇద్దరు మరణించారు. మిగిలిన నలుగురికి బహుమతులు ఇచ్చి వెనక్కి పంపించారు.నాటి నుంచి సెంటినెలీస్‌ బయటి వారంటే భయపడతారనే కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి.  

నాటి నుంచే ఇతర ప్రాంతాలవారు వస్తే అక్కడి గిరిజనులు వారిని హింసించి, చంపేస్తారని  చెబుతుంటారు. 2004 సునామీ తర్వాత భారత ప్రభుత్వ హెలికాప్టర్లు ఈ ద్వీపం మీదుగా ఎగరగా బాణాలతో దాడి చేశారు.2006లో ఈ ద్వీపంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు.

2018 నవంబరులో అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ అనే వ్యక్తి  ఈ ద్వీపానికి వెళ్లి, అక్కడి గిరిజనుల చేతిలో హత్యకు గురయ్యాడని చెబుతారు.అంతకుముందు 1896లో సముద్రంలో కొట్టుకుపోయి తప్పించుకుని అక్కడకు చేరిన ఒక భారతీయ ఖైదీని ఈ తెగ వారు హత్య చేశారు. 1974లో నేషనల్ జియోగ్రాఫిక్ బృందం ఒక డాక్యుమెంటరీని తీయడానికి ప్రయత్నించగా బాణాలతో దాడి చేశారు. 

90 వ దశకం ప్రారంభంలో మన శాస్త్రవేత్తలు త్రిలోక్‌నాథ్ పండిట్, మధుమాల చటోపాధ్యాయ సెంటినెలీస్ తో చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేసి పురోగతి సాధించారని అంటారు. వారు సెంటినెలీస్ కు కొబ్బరికాయలు బహుకరించారని చెబుతారు. ఆ తర్వాత మళ్లీ చర్చలు జరగలేదు. బ్రెజిల్, ఈక్వెడార్,పెరూలలో కూడా ఇలాంటి ఒంటరి తెగల వారున్నారని సమాచారం.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!