Underground city……………………………
ఇదొక పురాతన అధోలోక నగరం. ప్రస్తుత టర్కీలోని కప్పడోసియా ప్రాంతంలో ఈ నగరం ఉంది. భూమి లోపల 285 అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఉన్న ఈ నగరాన్ని తొలి పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించి ఉంటారని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు.
దీనిని క్రీస్తుపూర్వం 550 ప్రాంతంలో నిర్మించి ఉండొచ్చని పురాతత్త్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందులో ఇరవైవేల మంది జనం నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఈ భూగృహాల్లో వంటశాలలు, బెడ్ రూములు, బాత్రూములు,నూనె గానుగలు, మద్యం పీపాలను భద్రపరచుకునే గదులు, తిండి గింజలు దాచు కునే గదులు,ప్రార్థన మందిరాలు, పాఠశాలలు, సమాధులు వంటివి ఉన్నాయి. దీని లోపలికి గాలి, వెలుతురు ప్రసరించేందుకు వీలుగా 180 అడుగుల పొడవైన మార్గం ఉండటం విశేషం.
ఈ ప్రాంతానికి విహార యాత్రకు వచ్చిన ఒక కుటుంబం 1963లో ఈ భూగృహాన్ని గుర్తించింది.అపుడే ఈ నగరం గురించి ప్రపంచానికి తెలిసింది. టర్కీ లో దీనిని ‘డెరింకుయు’ అని పిలుస్తారు.అంటే నేలమాళిగ నగరం అని అర్థమట. ప్రజలు పూర్తిగా స్వయం సమృద్ధిగా ఉండాలని ప్రణాళిక తో ఈ నగరాన్ని నిర్మించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. పై నుండి గాలిని కిందికి తీసుకువచ్చిన యాభైకి పైగా వెంటిలేషన్ షాఫ్ట్లు, వేలాది చిన్న నాళాలు ఆ గాలిని నగరం అంతటికీ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి.
కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు డెరింకుయు నుంచి కైమక్లిలోని మరొక అద్భుతమైన భూగర్భ నగరాన్ని అనుసంధానించే 8 కిలోమీటర్ల పొడవైన మార్గం ఉందని అంటారు. కప్పడోసియా ప్రాంతంలోని వివిధ నాగరికతలకు చెందిన ప్రజల మధ్య కొంతవరకు సహకారం ఉందని కూడా అంటున్నారు.
ఈ ‘డెరింకుయు’ ను ఎన్నేళ్ల క్రితం ..ఎవరు నిర్మించారు అనేది ఖచ్చితంగా తెలియడం లేదు. హిట్టైట్లు 1600 BCE నుండి సుమారు 1200 BCE వరకు అనటోలియా ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించారని చరిత్ర చెబుతోంది. తదనంతర కాలంలో హిట్టైట్ సామ్రాజ్యం చిన్న సమూహాలుగా చీలిపోయింది. బహుశా బహుళ దండయాత్రలు, యుద్ధాల కారణంగా ఫ్రిజియన్లు బాల్కన్ల నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చారని భావిస్తున్నారు.
హిట్టైట్లు ఈ నగరాన్ని నిర్మించినట్లయితే అది 1200 BCE కంటే ముందే జరిగి ఉండవచ్చు.ఇక్కడ ఇళ్ళు భూగర్భంలో ఉన్నాయి, భూమి ఉపరితలంపై బావి లాంటి నోరు ఉంది, కానీ కింద విశాలంగా ఉంది. జంతువులను మోసుకెళ్లడానికి ప్రవేశ ద్వారాలుగా సొరంగాలు తవ్వారు. మనుష్యులు నిచ్చెన ద్వారా కిందకు దిగే అవకాశాలున్నట్టు గుర్తించారు.
టర్కీలోని కప్పడోసియా ప్రాంతంలో డెరింకుయు,ఇతర భూగర్భ నగరాల్లో పరిశోధన, తవ్వకం పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. డెరింకుయు ను పాక్షికంగా మాత్రమే తవ్వారు.ప్రస్తుతం ప్రజల కోసం తెరిచి ఉంచారు. సారాయిని వంటి అనేక ఇతర భూగర్భ నగరాలు ఇప్పటికీ అన్వేషణలో ఉన్నాయి. సారాయిని వద్ద తవ్వకం పనులు గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నాయి.
టర్కీలోని అనేక పురాతన భూగర్భ నగరాలు ఇటీవలి సంవత్సరాలలో మాత్రమే బయట పడ్డాయి.కప్పడోసియాలోని డెరింకుయు భూగర్భ నగరాన్ని సందర్శించడానికి నెవ్సెహిర్ సెంట్రల్ బస్ స్టేషన్ నుండి బస్సులో వెళ్ళవచ్చు. లేదా కారును అద్దెకు తీసుకుని నెవ్సెహిర్-నిగ్డే హైవే మీదుగా చేరుకోవచ్చు. అక్కడ గైడ్స్ అందుబాటులో ఉంటారు.