The oldest temple ……………………….
చ్చోట్టా నిక్కరా భగవతీ ఆలయం… ఈ భగవతీ ఆలయంలో కొలువైన అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం మహాకాళిగా అలంకరించి పూజలు చేస్తారు. భగవతీదేవి ఇక్కడ మహావిష్ణువు సమేత మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది.
చ్చోట్టా నిక్కరా అనే ఊరిలో ఉన్న కారణంగా ‘చ్చోట్టానిక్కరా భగవతీ’ గా పిలుస్తారు. చ్చోట్టా నిక్కరమ్మ అని కూడా స్థానికులు అంటారు. విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంది. ఇది పురాతన ఆలయమని చెబుతారు.కాలక్రమేణా మార్పులకు గురవుతోంది. కేరళలోని కొచ్చి కి సమీపం లో ఈ ఆలయం ఉంది.
ఈ ఆలయం తలుపులు తెరిచిన తర్వాతనే కర్ణాటకలోని మూకాంబిక ఆలయ ద్వారాలు తెరుస్తారని అంటారు. మూకాంబికా దేవి ఉదయం వేళ ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తుంది. మధ్యాహ్నం కర్ణాటకలో దర్శనమిస్తుందని చెబుతారు.
ఒత్తిడితో బాధపడేవారూ .. మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు సాయంకాలం ఇక్కడ మహాకాళికి చేసే గురుతి పూజలో పాల్గొంటే సమస్యలనుంచి బయటపడతారని భక్తుల నమ్మకం. అలాగే ఈ అమ్మవారిని దర్శించుకునే వారికి వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.
అమ్మవారి దర్శనం తరువాత శివుడు, వినాయకుడు, అయ్యప్ప, విష్ణుమూర్తి తదితర దేవతామూర్తుల్ని దర్శిస్తారు.ఈ ఆలయంలో ప్రతియేటా ఏడు రోజులు పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఒక రోజు అమ్మవారిని బంగారం, వజ్ర వైఢూర్యాలతో అలంకరిస్తారు.
ఆ రోజు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల్లోగా అమ్మవారిని దర్శించుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి కుదురుతుంది అని కూడా అంటారు.. నవరాత్రుల సందర్భంగా ఏనుగుల ఊరేగింపూ, ఇతర కళా ప్రదర్శనలూ జరుగుతాయి. వీటిని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు.
నవరాత్రి సంబరాలు వైభవంగా జరుగుతాయి. విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరిస్తారు. అమ్మవారి జన్మదినం సందర్భంగా వెలిగించే దీపాలు యాత్రీకులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయానికి సంబంధించి స్థలపురాణాలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ ప్రాంతంలో సరస్వతి అమ్మవారికి గుడిలేదని గమనించి ఆదిశంకరాచార్యులు… ఓ ఆలయాన్ని కట్టించాలనుకున్నారు. అమ్మవారి అనుమతి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు కరుణించి దర్శనమివ్వగా .. తనతో కలిసి కేరళకు వచ్చి అక్కడ కొలువుదీరమని దేవిని అర్థించాడు.
అమ్మ వారు అందుకు అంగీకరించి శంకరాచార్యుల వెనకే వస్తాననీ చెప్పింది.. అయితే మార్గమధ్యంలో వెనక్కి తిరిగి చూస్తే మాత్రం అక్కడే ఆగిపోతాననీ షరతు పెట్టిందట. ఆమేరకు నడుచుకుంటూ వస్తుండగా కర్ణాటకలోని కొడచాద్రి పర్వతాల దగ్గరకు వచ్చేసరికి అమ్మవారి కాలిగజ్జెల చప్పుడు శంకరాచార్యుల వారికి వినిపించలేదట.
దాంతో అమ్మవారు పెట్టిన షరతును మర్చిపోయి ఆయన వెనక్కి తిరగడంతో దేవి అక్కడే ఆగిపోయి మూకాంబికగా అక్కడే కొలువు దీరిందట.తప్పు తెలుసుకున్న శంకరాచార్యులు అమ్మవారిని క్షమించమని వేడుకున్నారు. తనతో కేరళకు రమ్మని అభ్యర్థించారు.అమ్మ కనికరించి ఇక్కడకు వచ్చి భగవతీదేవిగా కొలువు దీరిందని చెబుతారు.
అదేవిధంగా మరో కథ కూడా ప్రచారం లో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కన్నప్పన్ అనే గిరిజనుడు నివసించేవాడు. కాళి భక్తుడైన కన్నప్పన్ దూడలను అమ్మకి బలిచ్చే వాడట. ఓసారి అలా దూడను బలిస్తున్నప్పుడే అతని కూతురు అడ్డుపడింది. దాంతో దాన్ని ఆమెకి కానుకగా ఇచ్చేశాడు. కొన్నాళ్ల తర్వాత బలి ఇచ్చేందుకు ఒక్క దూడ కూడా దొరకలేదు.
దీంతో తన కూతురు పెంచుకుంటున్న దాన్ని తీసుకెళ్లేందుకు సిద్దమయ్యాడు.ఆ సమయంలో దూడ మాయమై అక్కడ రెండు శిలలు కనిపించాయి.అటుగా వచ్చిన ఓ పూజారి ఆ దూడ మహాలక్ష్మి, విష్ణుమూర్తి స్వరూపమని చెప్పాడు. తన తప్పును తెలుసుకుని నాటి నుంచి బలి ఇవ్వడం మానేశాడని కథనం.
చ్చోట్టానిక్కరా కు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ త్రిపునితుర. ఇది 4 కి.మీ దూరంలో ఉంది. ఈ స్టేషన్లో దిగేవారు టాక్సీలు లేదా ఆటో రిక్షాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయానికి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ఎర్నాకుళం జంక్షన్.
ఇది చ్చోట్టా నిక్కరా నుండి 16 కి.మీ దూరంలో ఉంది. ఎర్నాకుళం జంక్షన్ స్టేషన్ పేరు అయినప్పటికీ, ఇది కొచ్చి నగరంలోనే ఉంది. ఇక్కడ నుంచి కూడా రవాణా సదుపాయాలున్నాయి. ప్లాన్ చేసుకుని వెళితే .. కొచ్చి చుట్టుపక్కల దర్శనీయ ప్రదేశాలు చాలానే ఉన్నాయి.అన్నింటిని చూసి రావచ్చు.