Crimes against children ……………………………………
దేశంలో బాలలపై అత్యాచారాలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. National Crime Records Bureau గణాంకాల ప్రకారం బాలలపై జరుగుతున్న ప్రతి మూడు నేరాల్లో ఒకటి లైంగిక నేరమే కావడం శోచనీయం. NCRB తాజా గణాంకాల మేరకు 2021వ సంవత్సరంలో పోక్సో(లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ) చట్టం కింద దేశంలో 53,874 కేసులు నమోదయ్యాయి.
2020లో దేశవ్యాప్తంగా పిల్లలపై జరిగిన వివిధ నేరాలకు సంబంధించి మొత్తం 1,28,531 కేసులు నమోదు కాగా .. 2021లో ఆ సంఖ్య 1,49,404కు (16.2శాతం) పెరిగింది. 2021 సంవత్సరంలో పోక్సో చట్టంలోని సెక్షన్లు 4(లైంగిక దాడి), 6(తీవ్రమైన లైంగిక దాడి) కింద 33,348 కేసులు నమోదు అయ్యాయి. అందులో బాలికలపై జరిగిన ఘోరాలు 33,036, బాలురపై జరిగిన ఘోరాలు 312 ఉన్నాయి.
అలాగే బాలల కిడ్నాప్ కు సంబంధించి గత ఏడాది 67,245 కేసులు నమోదయ్యాయి. మరో 29, 364 మంది పిల్లలు కనిపించడం లేదని కేసులు నమోదు అయ్యాయి. వారంతా కూడా కిడ్నాప్ కు గురైనట్టు భావిస్తున్నారు. అలాగే 1,046 మంది పిల్లలు గతేడాది అక్రమ రవాణాకు గురయ్యారు. మొత్తం నేరాల్లో పిల్లలపై జరుగుతున్న నేరాల రేటు 2020లో 28.9 శాతం ఉండగా, అది 2021లో 33.6 శాతానికి పెరిగిపోయింది.
2021లో 140 మంది చిన్నారులను అత్యాచారం చేసి చంపేశారు. మరో 1,402 మంది చిన్నారులను హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 7,783 కేసులు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. భ్రూణహత్యల్లో మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 121 కేసులు, గుజరాత్ లో 23, ఛత్తీస్ గఢ్ లో 21, రాజస్థాన్లో 13 కేసులు నమోదయ్యాయి.
పిల్లలను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలకు సంబంధించి గతేడాది 359 కేసులు నమోదయ్యాయి. ఇక బాలల అపహరణకు సంబంధించి 49,535 కేసులు నమోదవగా, వాటిలో మహారాష్ట్రలో అత్యధికంగా 9,415, మధ్యప్రదేశ్ లో 8,224, ఢిల్లీలో 5,345, ఒడిసాలో 5, 135, పశ్చిమబెంగాల్ లో 4,026 కేసులు ఉన్నాయి.
ఇవన్నీ నమోదు అయిన కేసులు కాగా పరువు పోతుందని,పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉంటుందని భయపడి కేసు నమోదు చేయని వారెందరో ఉంటారు.