ఆమె మరణంపై తొలగని అనుమానాలు .. మళ్ళీ విచారణ ?

Sharing is Caring...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేసే అంశాన్నిపార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని  డీఎంకే అధ్యక్షుడు  స్టాలిన్‌ ప్రకటించారు. జయ మృతి పై అనుమానాలున్నాయని ఆమె సమాధి సాక్షిగా ప్రకటించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో విలీనమైన తర్వాత ఆ విషయంపై నోరు మెదపటం లేదని విమర్శించారు. స్టాలిన్ మాటలతో జయలలిత మృతి అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. స్టాలిన్ మాటల్లో నిజాలున్నాయి. ప్రభుత్వం లో చేరాక పన్నీర్ సెల్వం జయ మృతిపై మాట్లాడలేదు. విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రక్రియ సుప్రీం స్టే తో ఆగిపోయింది. విచారణ అటకెక్కింది.
అంతకు ముందు ఏమిజరిగిందంటే ……..
జయలలిత 2016 డిసెంబర్ 5న చనిపోయారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు కొనసాగింది.  ప్రభుత్వం  2017 సెప్టెంబరులో  విచారణ కోసం జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ను నియమించింది . ఈ కమీషన్  75 మంది సాక్ష్యులను కొంతమంది ఇతరులను ప్రశ్నించింది.  75 మందిలో  ప్రభుత్వ, అపోలో ఆసుపత్రికి చెందిన 12 మందికి పైగా వైద్యులు, రిటైర్డ్, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులు ఉన్నారు. ఈ క్రమంలోనే జయలలిత ట్రీట్‌మెంట్‌కు చెందిన రికార్డులను ఇవ్వాల్సిందిగా కమిషన్ కోరడంతో, అందుకు అపోలో హాస్పిటల్ యాజమాన్యం నిరాకరించింది. అంతటితో ఆగకుండా కమిషన్‌కు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది అపోలో యాజమాన్యం. అయితే హాస్పిటల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విచారణ కొనసాగించమని  కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్రాస్ కోర్టు తీర్పుపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.

ఈ అపీల్ పై విచారించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అపోలోకు ఊరట కలిగిస్తూ తీర్పు ఇచ్చింది.   అర్ముగస్వామి కమీషన్ విచారణపై స్టే విధించింది. దీంతో జయ మృతిపై ఉన్న అనుమానాలు అలాగే ఉండిపోయాయి. ఒక దశలో అపోలో యాజమాన్యం కోర్టుకు  వెళ్ళక ముందు  జయకు అందించిన చికిత్స రికార్డులను పరిశీలించడానికి 21 మంది డాక్టర్లు లేదా వైద్య నిపుణులతో కూడిన ఒక బోర్డును ఏర్పాటు చేయాలని  డిమాండ్‌ చేసింది. జయ మృతికి దారితీసిన పరిణామాలపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్‌ అర్ముగస్వామి కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ విషయం స్పష్టం చేసింది. అయితే కమీషన్ ఇది సాధ్యం కాదని చెప్పింది. దీంతో అపోలో కోర్టును ఆశ్రయించింది. ఆ దరిమిలా వచ్చిన తీర్పుతో విచారణ అటకెక్కింది.   కాగా 75 రోజులపాటు జయకు చికిత్స అందించినందుకు అపోలో సుమారు రూ.7 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.1.17 కోట్లు ఆహార ఖర్చులు కింద చూపింది. కాగా ఇపుడు స్టాలిన్ తాము అధికారంలోకి వస్తే మళ్ళీ విచారణ జరిపిస్తామంటున్నారు. ఆయన ఎంతవరకు తన మాటపై నిలబడతారో చూడాలి. రెడ్డొచ్చె మొదలెట్టు అన్నట్టు విచారణ మళ్ళీ మొదటినుంచి సాగాలి.  చూద్దాం ఏమి జరుగుతుందో ? 

—————–KNM 

 ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>>>>>హిమాలయాల్లో ఓ సాధకుని అరుదైన అనుభవం !

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!