Kagil War ……………………..
1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్ (Pervez Musharraf) భారత్ పై ఎందుకో ద్వేషం పెంచుకున్నారు. ఎలాగైనా భారత్ ను దెబ్బతీయాలని కుట్రలు ..కుతంత్రాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ముషారఫ్ కన్ను కార్గిల్ (Kargil)పై పడింది.
కాలం కలిసిరావడంతో 1998 అక్టోబర్ 7వ తేదీన ముషారఫ్ కు నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ సైనిక పగ్గాలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్ కొన్ని గంటల్లోనే కార్గిల్ పై దాడికి ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టారు. కానీ వారి కుట్రల్ని భారత బలగాలు బలంగా తిప్పికొట్టాయి.
ఈ యుద్ధం పాకిస్థాన్ కి అంతర్జాతీయంగా అవమానాన్ని మిగిల్చింది. పాకిస్తాన్ 1998-99 మధ్య కాలంలో LOC నియంత్రణ రేఖను దాటి మనదేశంలోని జమ్మూ, కాశ్మీర్ లో పలుప్రాంతాలను ఆక్రమించింది. కార్గిల్ శ్రీనగర్ ను కలిపే జాతీయ రహదారి తోపాటు లడక్ ప్రాంతాన్ని కొంతమేరకు ఆక్రమించింది.
భారత్-పాకిస్తాన్ విభజన జరగక ముందు కార్గిల్ లడక్ ప్రాంతం లోని బల్టిస్తాన్ జిల్లాలో భాగంగా ఉండేది. మొదటి కాశ్మీర్ యుద్ధం (1947–48) తర్వాత నియంత్రణ రేఖ బల్టిస్తాన్ జిల్లాగుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం జమ్మూ-కాశ్మీర్ లో భాగమైంది.
1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు. కానీ పాక్ దాన్ని ఉల్లంఘించింది. ఆప్రాంతాలపై పాకిస్తాన్ సైనికులు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు.
పాక్ చొరబాటుని గమనించిన ఇండియా ఆప్రాంతాల నుంచి పాక్ సేనలను తరిమికొట్టేందుకు ‘ఆపరేషన్ విజయ్’ ను ప్రారంభించింది.యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా ప్రకటించింది.
యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువైంది.
నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం వాయు సేన సహకారంతో మళ్ళీ స్వాధీనపరచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది ఒక ఉదాహరణ.
నాడు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం రెండు నెలలపాటు కొనసాగింది. యుద్ధాన్ని నివారించడానికి నాటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ రంగంలోకి దిగారు .క్లింటన్ సూచన మేరకు పాకిస్తాన్ దళాలు వెనక్కి వెళ్లాయి.
ఈ క్రమంలోనే నియంత్రణ రేఖ (ఎల్ఓసి)లోకి చొరబడిన పాకిస్తాన్ దళాలను ఉపసంహరించుకోవాలని బిల్ క్లింటన్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ను నేరుగా కోరారు.పాకిస్తాన్ ప్రాక్సీ ఫోర్స్గా ఉపయోగిస్తున్న ఉగ్రవాదులను నియంత్రించాలని క్లింటన్ షరీఫ్కు సూచించారు.
దీంతో కార్గిల్ యుద్ధం జూలై 26న ముగిసింది. నాటి యుద్ధంలో మన సైనికులు కొదమ సింహాల్లాగా పోరాడారు.కొందరు ప్రాణాలు కోల్పోయారు.మన సేనల ధాటికి పాక్ సేనకు చుక్కలు కనిపించాయి.మరికొంత కాలం యుద్ధం సాగినట్లయితే పాక్ పూర్తి గా చేతులు ఎత్తేసేది.