ఆర్కే కి ఉద్యోగం ఇస్తానన్న ఎన్టీఆర్ !

Sharing is Caring...

Rk rejected Ntr’s offer……………

మావోయిస్టు నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్‌ ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి స్నేహితులు. గుంటూరు ఏసీ కళాశాలలో ఈ ఇద్దరు కలసి చదువుకున్నారు. అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం మొదలైంది. 

1983లో ఎన్‌టీ.రామా రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో సచ్చిదానందరావును ఆ ఫంక్షన్కి పిలిచారట. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సచ్చిదానందరావు కుటుంబ వివరాలను ఎన్టీరామారావు అడిగి తెలుసుకున్నారు. అపుడే ఆయన కుమారుడు ఆర్కేకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ఎన్టీఆర్ అన్నారట. సచ్చిదానందరావు ఇంటికి వెళ్లి కుమారుడికి విషయం చెప్పగా అయితే ఈ ఆఫర్ ను ఆర్కే నిరాకరించారట.

తాను ప్రజల కోసం పీపుల్స్‌వార్‌లో పని చేస్తానని తేల్చి చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపోయారట. అంతకు ముందు నుంచే ఆర్కే పీపుల్స్‌వార్‌ దళంలో పని చేస్తున్నప్పటికీ ఆయన చెప్పే వరకు తల్లిదండ్రులకు తెలియదు.

తర్వాత కొన్ని రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయి హరగోపాల్‌ నుంచి రామకృష్ణగా, ఆర్కేగా పేరు మార్చుకున్నాడు. పీపుల్స్‌వార్, ఎంసీసీఐ (MCCI) విలీనమై సీపీఐ (మావోయిస్టు) ఏర్పడిన తర్వాత, ఆయన ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (AOB) స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పదోన్నతి పొందారు.

1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్కే పీపుల్స్‌వార్‌ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులు, వడ్డీ వ్యాపారుల అరాచకాలను ధైర్యంగా ఆర్కే ఎదిరించాడు. ఈ క్రమంలో ఆర్కే కొందరిని హతమార్చాడు. దీంతో తప్పుడు పనులు చేయడానికి అప్పుడు జనం భయపడ్డారు.

ఆ రోజుల్లో మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి నేరుగా శిక్షలు కూడా విధించారు. ఈ పరిణామాల క్రమంలోనే జనం పీపుల్స్‌ వార్‌పై ఆసక్తి చూపారు. చాలా మంది ప్రజలు వారి బాధలను నేరుగా పీపుల్స్‌వార్‌ సభ్యులకే చెప్పుకునేవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో హైదరాబాద్‌లో జరిగిన చారిత్రాత్మక శాంతి చర్చలలో మావోయిస్టు పార్టీ తరపున ఆర్కే నేతృత్వం వహించారు. అడవి నుంచి ఆయుధంతో నేరుగా నగరానికి వచ్చి ఆయన చర్చల్లో పాల్గొనడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఉద్యమం ఆ స్థాయికి చేరుకునేలా చేయడంలో ఆర్కే విజయం సాధించాడు. అలా అలా అంచెలంచెలుగా ఎదిగి ఆర్కే జాతీయ నాయకుడయ్యాడు. ఉద్యమంలో ఉండగానే విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావుకు దగ్గరి బంధువు పద్మక్కను ఆర్కే వివాహం చేసుకున్నాడు.

తీవ్రమైన అనారోగ్య సమస్యలు (కిడ్నీ వైఫల్యం, పక్షవాతం, మధుమేహం) కారణంగా 2021 అక్టోబర్ 14న ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ (బీజాపూర్) అటవీ ప్రాంతంలో ఆర్కే కన్నుమూశారు.

(మావోయిస్టు అగ్రనేత ఆర్కే గురించి సాక్షి దినపత్రిక చర్ల ప్రతినిధి అందించిన కథనం ఆధారంగా)

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!