సాగర్ శ్రీశైలం బోటు యాత్ర …….
ప్రకృతి రమణీయ దృశ్యాలు చూసి పరవశించండి…….
ఊగే అలలపై ప్రయాణం తాలూకూ అనుభూతులు సొంతం చేసుకోండి …….
కృష్ణమ్మ వొడిలో వోలలాడుతూ నల్లమల కొండల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు చూడాలని ఆశపడే పర్యాటకులకు ఇది శుభవార్త. సాగర్ శ్రీశైలం బోటు యాత్రకు తెలంగాణ పర్యాటక శాఖ సకల ఏర్పాట్లు చేసింది. ఊగే అలలపై ప్రయాణాలు మొదలైనాయి. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాలను ప్రారంభించింది.
ఆరు గంటల పాటు సాగే ఈ లాంచీ ప్రయాణంలో పర్యాటక ప్రియులు ప్రకృతి అందాలను చూసి పరవశిస్తారు. ఒక అద్భుతమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఎత్తైన నల్లమల కొండలు ,చుట్టూరా పరచుకున్న పచ్చదనం ,అడవుల అందాలు, కృష్ణమ్మ పరవళ్లు .. కమనీయ దృశ్యాలు యాత్రీకులకు కనువిందు చేస్తాయి.
ఈ ప్రయాణం ఏలేశ్వరం కొండ,పెందోట ,రామతీర్ధం ,పావురాల ప్లేట్ ,జెర్రీ వాగు,ఆలాటం కోట ,వజ్రాల గుట్ట,కయ్యా మీదుగా సాగుతుంది. పర్యాటక ప్రియులు చిరకాలంగా ఎదురుచూస్తున్న లాంచీ యాత్రకు తెలంగాణ పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి పర్యాటకులతో లాంచీలు శ్రీశైలం వెళుతున్నాయి.
సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 565 అడుగుల కన్నా ఎక్కువ ఉంటె లాంచీ రాకపోకలకు అనుమతి ఉంటుంది. ఈ ఏడాది సాగర్ పై నుంచి వచ్చే నీటితో నిండుకుండలా మారింది. అయితే కరోనా కారణంగా లాంచీ యాత్రకు అనుమతిలేదు. ఇపుడు కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో లాంచీ యాత్ర మొదలైంది. ఇకపై ప్రతి వారం యాత్ర సాగుతుంది.
ఈ యాత్ర కు రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. యాత్రీకులకు లాంచీలోనే భోజనం కూడా అందిస్తారు . హైదరాబాద్ పర్యాటకులను టూరిజం శాఖ వారి బస్ లో సాగర్ వరకు తీసుకొచ్చిఅక్కడ లాంచీ ఎక్కిస్తారు. క్రిష్ణమ్మ గలగలలను ఆస్వాదిస్తూ …నల్లమల అందాలను తిలకించాలనుకుంటున్నారా ? అయితే రెడీ అవండి. తెలంగాణ పర్యాటక శాఖ వెబ్సైటు చూసి మీకు అనువైన ప్యాకేజీ ని ఎంచుకోండి.
Phone: +91-40-23262151, +91-40-23262152, +91-40-23262153, +91-40-23262154, +91-40-23262157 నంబర్లలో సంప్రదించండి.
ఇది కూడా చదవండి >>>>>>>>> అక్కమహాదేవి గుహలను చూసారా ?