ఏడు రోజులుగా రష్యా చేస్తోన్న భీకర దాడులకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. రష్యా దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో సైనికులు, పౌరులు,పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు నివాసాలు వదిలి బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షల మంది కీవ్ నగరాన్ని వదిలి పొరుగు దేశాలకు వెళ్తున్నారు.
ఎటూ వెళ్ళని వారు బంకర్లు, కమ్యూనిటీ షెల్టర్లలో ఉండిపోయారు. వీరికి నీరు, ఆహారం లభించక రెండు మూడు రోజులు గా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.బయటికి వెళ్తే బాంబులు పడతాయని భయ పడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు చెందిన సాథియా రెస్టారెంట్ టీమ్ అక్కడి వారికి ఉచితంగా ఆహారం అందించి ఆదుకుంది. మానవతను చాటుకుంది.
ఈ రెస్టారెంట్ గుజరాత్కు చెందిన మనీష్ దవే ది . భారత విద్యార్థులతోపాటు ఉక్రెయిన్ ప్రజలకు ఉచిత ఆహారం, షెల్టర్ కల్పిస్తూ ఆపద వేళ అండగా నిలిచాడు. మనీష్ దవే.. కీవ్ నగరంలోని ఛొకొలివ్స్కీ కూడలిలో కొన్ని నెలలుగా ‘సాథియా’ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. సాథియా’ చోకోలివ్స్కీ బౌలేవార్డ్ నేలమాళిగలో ఉంది. ఆ ప్రాంతంలో బాంబులు పేలడం మొదలు కాగానే వందల మంది ఆశ్రయం కోసం రెస్టారెంట్కు తరలివచ్చారు.
మనీష్ అప్పటినుంచి ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.వారికి రోజూ భోజనం కూడా అందిస్తున్నాడు.వందల సంఖ్యలో ప్రజలను సాథియా టీమ్ ఆదుకుంది. దాడులు మరింత ఉదృతం కావడంతో వసతి, భోజనం అవసరమైనవారు తమ రెస్టారెంట్కు రావాలని మనీష్ దవే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను ఆహ్వానిస్తున్నారు.
అలా వచ్చినవారందరికీ ఉచితంగా ఆహారం షెల్టర్ అందిస్తున్నారు. ఆపద వేళ ఆపన్న హస్తం అందించిన మనీష్ దవే ఇపుడు అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించాడు. ఇండియా ప్రతిష్టను మరింత పెంచాడు. శభాష్ మనీష్!