Can jithin show his strength …………………………బీజేపీ లో చేరిన జితిన్ ప్రసాద యూపీ క్యాబినెట్లో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు 2022 మార్చిలో జరుగుతాయి. ఈలోగా అటు పార్టీని .. ఇటు ప్రభుత్వాన్ని బలోపేతం చేసి వివిధ సామాజిక వర్గాల మద్దతు పొందాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రి వర్గం లో మార్పులు చేర్పులు చేయవచ్చనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం లో అందరికి తెలిసిన సీనియర్ నేత క్యాబినెట్లో ఉంటే బాగుంటుందనే యోచనతో జితిన్ ప్రసాద ను తీసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే యోగి క్యాబినెట్ లో బ్రాహ్మణ నేతలు ఉన్నారు. అయితే వారికి యోగి అంత ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆరోపణలు ఉన్నాయి.
కాంగ్రెస్ అధిష్టానం వైఖరితో విసిగి పోయిన నాయకుల్లో జితిన్ ప్రసాద్ కూడా ఒకరు. జితిన్ రాహుల్ టీమ్ లో ఆయనకు సన్నిహితంగా మసలిన నాయకుడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న జ్యోతిరాదిత్య జితిన్ డెహ్రాడూన్ స్కూల్ లో కలసి చదువుకున్నారు. ఒకే పార్టీ లో కలసి పనిచేశారు. జ్యోతిరాదిత్య గత సంవత్సరం కాంగ్రెస్ ను వీడగా, జితిన్ కొద్దీ రోజుల క్రితమే బీజీపీలో చేరారు. 2001 నుంచి జితిన్ యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు. 2004 లో యూపీ లోని షాజహాన్ పూర్ లోకసభ నియోజక వర్గంనుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లక్కీగా యూపీఏ మంత్రివర్గంలో మంత్రి కూడా అయ్యారు. 2009 లో ‘దావూరహ్ర’ నుంచి గెలిచి మళ్ళీ మంత్రి అయ్యారు. జితిన్ తండ్రి జితేంద్ర ప్రసాద్ కూడా కాంగ్రెస్ నాయకులే. ఆయన కూడా ఏంపీ గా పనిచేశారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ కు ఆ ప్రాంతంలో గట్టి పట్టు ఉందని అంటారు . అయినప్పటికీ 2014,19 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. 2017 లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన ప్రభావాన్ని చూపలేకపోయారు. అయినప్పటికీ బీజీపీ జితిన్ కు ప్రాధాన్యత నిచ్చి పార్టీలో చేర్చుకున్నదంటే తెర వెనుక ఏదో వ్యూహం ఉండొచ్చు అంటున్నారు. త్వరలోనే జితిన్ ను ఎమ్మెల్సీ గా నామినేట్ చేసే అవకాశాలున్నాయి. జులై లో అయిదు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక జరగబోతోంది. ఆ వెంటనే మంత్రి గా క్యాబినెట్లోకి తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదంతా అధిష్టానం ఆలోచన కాబట్టి యోగి దాన్ని అమలు చేయక తప్పదు.
యూపీ లో దాదాపు 13 శాతం మేరకు బ్రాహ్మిణ్ ఓటు బ్యాంక్ ఉన్నది. దీన్ని పదిలంగా ఉంచుకోవాలంటే ఆ వర్గాన్ని ఆకర్షించాలన్నదే బీజేపీ అధిష్టానం ఆలోచన. ప్రధాని మోడీ , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి కూడా జితిన్ రాక వల్ల పార్టీ లబ్ది పొందుతుందని అంటున్నారు.కాగా కాన్పూర్-డాన్ వికాస్ దుబే ఎన్కౌంటర్ సంఘటన తర్వాత యోగి సర్కార్ బ్రాహ్మణ సామాజికవర్గం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దాన్ని తగ్గించుకోవాలనుకునే వ్యూహంలో భాగంగానే జితిన్ ను చేర్చుకున్నారని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్లో రీటా బహుగుణ జోషి తర్వాత బిజెపిలో చేరిన రెండవ పెద్ద బ్రాహ్మణ, కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద ఒక్కరే.
—————-KNM