అద్భుత బాణీలు ..అలరించే పాటలు ఆయనకే సాధ్యమా ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ……………………….

దక్షిణ భారత సంగీత శిఖరం ఎమ్మెస్ విశ్వనాథన్ .. మూడు తరాల ప్రేక్షకులను తన బాణీలతో మురిపించారు..మైమరిపించారు. ఎమ్మెస్వీ పుట్టింది కేరళ పాలక్కాడులో. చిన్నతనంలోనే మేనమామల ఊర్లో ఉన్న నీలకంఠ భాగవతార్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు.

ఆ తర్వాత సినీపరిశ్రమలోకి నటుడుగా ఎంట్రీ ఇద్దామనుకున్నారు.జూపిటర్ మూవీస్ వారి కణ్ణగి సినిమాలో బాలకోవలన్ పాత్రకు సెలక్ట్ అయి ఆ తర్వాత రిజక్ట్ అయ్యారు.అక్కడ నుంచీ సేలం సాయిగాన వినోదిని సభ అనే డ్రామా కంపెనీలో హార్మోనిస్టుగా జీవితం ప్రారంభించారు.

ఆ తర్మాత మామ మహదేవన్ సహకారంతో సినీ సంగీత దర్శకుడు ఎస్.ఎమ్. సుబ్బయ్యనాయుడు ట్రూపులో హార్మోనిస్టుగా తెరంగేట్రం జరిగింది. సుబ్బయ్య నాయుడు దగ్గర నుంచీ సి.ఆర్.సుబ్బురామన్ కాంపౌండ్ కు మారారు.

అక్కడ హార్మోనిస్ట్ గా చేరిన ఎమ్మెస్వీకి  వయోలినిస్ట్ రామ్మూర్తితో స్నేహం కలసింది. గురువు అకాల మృత్యువాత పడడంతో ఆగిపోయిన చిత్రాల సంగీత బాధ్యత భుజానేసుకున్నారు.అప్పటికి దేవదాసు సెట్స్ మీద ఉంది. అందులో రెండు పాటలు మాత్రం మిగిలి ఉన్నాయి. వాటిని విశ్వనాథనే స్వరపరచేశారు.

వాటిలో ఒకటి జగమే మాయ. ఎమ్మెస్వీ స్వరపరచిన జగమే మాయ పాట చాలా పెద్దహిట్టు. శాస్త్రీయ రాగాలను సినిమా సంగీతానికి వాడుకోవడంలో ఎమ్మెస్వీది ప్రత్యేక ప్రతిభ. అదే ఆయనతో కొత్త తరహా పాటలు కంపోజ్ చేయించింది. పోలీస్ కారన్ మగన్ అనే తమిళ సినిమాలో పొన్ ఇన్బన్ పాట ను దర్బారీ కానడ రాగంలో స్వరపరచారు ఎమ్మెస్వీ .

అదే పాట ఆ తర్వాత రోజుల్లో కానిస్టేబుల్ కూతురు సినిమాలో పూవు వలే గా వచ్చింది… తెలుగు వర్షన్ కు ఆర్. గోవర్ధన్ సంగీతం అందించారు. బేస్ వాయిస్ లో పీబి శ్రీనివాస్ పూవు వలే అంటున్నప్పుడు వింటున్నప్పుడు భలే ఉంటుంది. neerada neram nalla neram పాట … వైర నింజమ్ సినిమా కోసం పురియ ధన్యశ్రీ రాగంలో స్వరపరచారు.

అలాగే Marupadiyum – Nallathor Veenai Seithen కోసం తిల్లాంగ్ రాగం వాడారు.ఎన్టీఆర్ నటించిన రాము సినిమాలో మంటలు రేపే పాట భాగేశ్రీలోస్వరపరచారు విశ్వనాథన్. ఈ సినిమాకూ తెలుగు లో ఆర్.గోవర్దనమే సంగీత దర్శకుడు. రాము సినిమా తమిళ వర్షన్ కు ఎమ్మెస్వీ ఇచ్చిన పాటలనే యథాతధంగా తెలుగు సినిమాకు వాడుకున్నారు.

Aandavan Kattalai మూవీ కోసం హరికాంభోజిలో స్వరం కట్టిన గీతం … Amaithiyana Nathiyinile – శివాజీ, దేవిక నటించిన ఈ పాటను సౌందర్ రాజన్ పాడారు.శివాజీ అభినయానికీ సౌందర్ రాజన్ గాత్రానికి అద్భుతమైన సమన్వయం ఉంటుంది. ఆ మేజిక్ ఈ పాటలో కనిపిస్తుంది. తమిళం నుంచీ తెలుగుకు డబ్బైన కర్ణ సినిమాలో భువిలో దేహంబు అంటూ షీర్గాలి గోవిందరాజన్ పాడిన పాట ఒకటి వినిపిస్తుంది.

కర్ణుడు మరణ యాతన పడుతుండగా మారు వేషంలో వస్తూ కృష్ణుడు పాడే పాట అది. సందర్భాన్ని బట్టి ఆ గీతాన్ని ఆహిర్ భైరవ్ … చక్రవాకం రాగాల్లో కంపోజ్ చేశారు. అదే కర్ణ సినిమాలోనే బాలమురళి, సుశీల పాడిన నీవూ నేనూ వలచితిమీ … సారంగ తరంగిణీ లో స్వరపరచారు. అలాగే రక్త సంబంధం సినిమాలో వినిపించే బంగారు బొమ్మ రావే పాట సింధుబైరవి లో వినిపిస్తుంది. ఇది తమిళం నుంచీ తీసుకున్న ట్యూనే.

తెలుగు వర్షనుకు ఘంటసాల సంగీతం అందించారు. ఘంటసాలను బలవంతం పెట్టి మరీ డూండీ గారు తమిళ పాటలనే కొట్టించుకునేవారట. అది వేరు సంగతి. బాలచందర్ సినిమాలకు రెగ్యులర్ గా విశ్వనాథనే సంగీతం చేసేవారు. అంతులేని కథ నుంచీ కోకిలమ్మ వరకు ఆయన చేసిన పాటలెన్నో … తెలుగు శ్రోతల మనసులను ఆనందపరవశులను చేశాయి.తెలుగు,తమిళ భాషల్లో విశ్వనాథన్ బాణీలు జనాన్ని ఓ ఊపు  ఊపేశాయనడంలో సందేహం లేదు.   

విశ్వనాథన్ అద్భుతమైన గాయకుడు కూడా … అందమైన అనుభవంలో రజనీకాంత్ పాడే శంభో శివశంభో పాట తమిళ్ లో ఎమ్మెస్వీనే పాడారు. ఆయన 1976లోవచ్చిన పయనం తమిళ చిత్రం కోసం కూడా ఒక పాట పాడారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!