Pudota Showreelu ……………………………
ఇదొక మంచి సినిమా.. పేరు ‘ottal [the trap] ఉచ్చు. మలయాళం సినిమా. తల్లిదండ్రులను కోల్పోయిన తొమ్మిదేళ్ళ మనవడు కుట్టప్పాయ్[మాస్టర్ అక్షాంత్] తాత వల్లప్పచాయ్[వసుదేవన్]దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఒక ఇరుకు గదిలో ఒకరి మీద ఒకరు పడి నిద్రపోతున్న సమయంలో కుట్టప్పాయ్ తాతకు కన్నీటితో రాస్తున్న ఉత్తరంతో సినిమా మొదలవుతుంది.
”తాతా ఈ క్రిస్మస్ పండుగ నీకు అనేక ఆనందాలు ఇవ్వాలని కోరుతున్నాను.నాకు మాత్రం క్రిస్మస్ పండుగ లేదు”అని రాస్తుంటాడు.తాత వల్లప్పచాయ్ బాతులను పెంచుతుంటాడు. మనవడు గూడా తాత వెంట తిరుగుతూ,బాతుల పెంపకంలో మెళకువలు నేర్చుకుంటూ ఉంటాడు.
బాతుల్ని లారీలో నుండి దించటం,నీళ్ళలోకి వదలటం,నీటిలో పడవలో తిరుగుతూ,వాటిని మందగా మలెయ్యటం,వాటి గుడ్లు ఏరటం,కోడి కింద బాతుగుడ్లను పొద గేయ్యటం, చేపలు పట్టటం,పక్షి గూళ్ళను పరిశీలించటం,ఒక వీధి కుక్కను పెంచుకోవటం,..ఇలా తాత వెంట తిరుగుతూ,ప్రకృతిని పరిశీలిస్తూ పెరుగుతుంటాడు.
ఒకరోజు తాత, మనవడు ఆర్ధికంగా ఉన్నతంగా వున్న ఒక ఇంటికి బాతు గుడ్లు ఇవ్వటానికి వెళ్తారు.ఆ ఇంటి పిల్లాడు టింకు[మాస్టర్ హఫీస్ మహమద్]తో కుట్టప్పాయ్ కి స్నేహం కుదురుతుంది.టింకు తల్లి కుట్టప్పాయ్ ని ఆదరిస్తుంది. ఇది తండ్రికి ఇష్టం వుండదు.
టింకు బడి ఎగ్గొట్టి కుట్టప్పాయ్ తో కలిసి బాతుల వెంట,చెట్లు పుట్ల వెంట తిరుగుతూ,ప్రకృతిలోని వింతలూ,విశేషాలు కుట్టప్పాయ్ చెబుతూ వుంటే తెలుసుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు.జిల్లాస్తాయి పోటిల కోసం టింకు కి మట్టితో గాలం వేస్తున్న జాలరి బొమ్మ అందంగా చేసి ఇస్తాడు కుట్టప్పాయ్.
ఒకరోజు టింకు కోసం చేపలు పట్టి,తాతతో కూర వండించి ఎదురు చూస్తూ ఉంటాడు.టింకు తండ్రి ఆంక్షలతో రాలేడు.తాత గొప్పవాళ్ళ మనస్తత్వాన్ని మనవడికి వివరంగా చెబుతాడు కుట్టప్పాయ్, టింకు కి ఎంతో శ్రద్దగా,ప్రేమతో క్రిస్మస్ స్టార్,క్రిస్మస్ క్రిబ్[ఏసు పుట్టిన పశువుల కొట్టం],తయారు చేసి ఇస్తాడు.
టింకు,కుట్టప్పాయ్ కి తనతో పాటు కూర్చో బెట్టుకుని చదువు నేర్పిస్తాడు.దీనికి టింకు తల్లి ఎంతగానో సహకరిస్తుంది. టింకు జపాన్ దేశపు కురయనోగి రాసిన రైలుబడి పుస్తకాన్నికుట్టప్పాయ్ కి కానుకగా ఇస్తాడు.కుట్టప్పాయ్ కి చదువుకోవాలనే కోరిక పెరుగుతుంది.[రైలుబడి అనే ఈ పుస్తకాన్ని,నేను ఇప్పటికీ వంద మందికి బహుమతిగా ఇచ్చాను.త్వరలో మీకు పరిచయం చేస్తాను]
ఈలోగా పిల్లల్ని ఎత్తుకుపోయి బాలకార్మికులుగా తయారు చేసి,అమ్ముకునే వ్యక్తి కళ్ళు కుట్టప్పాయ్ మీద పడతాయి.తాత ఆరోగ్యం రోజురోజు కి తగ్గిపోతుంది.జబ్బున పడతాడు.మనవడిని చదివించాలనే తపనతో పోయిపోయి ఆ మోసగాడికే మనవడిని అప్పగిస్తాడు.
అతడు కుట్టప్పాయ్ ని తీసుకెళ్ళి ఏమి చేస్తాడు..?తాత ఏమవుతాడు.?జిల్లా స్థాయిలో జాలరి బొమ్మకు వచ్చిన అవార్డు తీసుకుంటూ టింకు ఎందుకు స్టేజ్ మీదనే ఏడుస్తాడు.?ఇవన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
కేరళ లోని కుట్టనాడు బ్యాక్ వాటర్స్ లో ఈ సినిమా అంతా నడుస్తుంది. వెనిస్ నగరంలోలా కేరళలో ఇళ్ళముందే వుండే కాలువల్లో పడవ ప్రయాణాలు,ఉభయ సంధ్యల్లో కుట్టనాడు బ్యాక్ వాటర్స్ అందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
మనుషులు కాళ్ళతో నడిపే నీటి చక్రం,పడవలకు దారి చూపే దీపస్తంభం,పాత పద్దతుల్లో చేపలు పట్టటం,రోజంతా కష్టపడ్డ,కష్టజీవులు,జాలరులు చీకటి పడే వేళకు కల్లుపాకలో చేరి తాగి,ఆడుతూ,పాడుతూ చిందులేయటం,కేరళ ప్రకృతి అందాలతో ఈ సినిమా ఒక సుందర కావ్యంగా రూపుదిద్దుకుంది.
తాత నిజజీవితంలో జాలరి కాబట్టి అతను పాత్రలో నటించలేదు,జీవించాడు.కుట్టప్పాయ్ అమాయకమైన మొహంతో,అందమైన కళ్ళతో హావభావాలు చక్కగా చూపించాడు.ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు.
అంటోన్ చెకోవ్ రాసిన వంక అనే రష్యా కథ ఆధారంగా ఈ సినిమా తీసారు.జయరాజ్ దర్శకత్వం,రాదా కృష్ణన్ సినిమాటోగ్రఫీ..2015 లో వచ్చిన ఈ సినిమా కి అనేక అవార్డులు వచ్చాయి.
ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ వున్నాయి కాబట్టి సినిమా చక్కగా అర్ధం అవుతుంది..ఈ సినిమా యు ట్యూబ్ లో వుంది..ప్రకృతి ప్రేమికులకు ఈ సినిమా కనువిందు చేస్తుంది.తప్పక చూడండి.