Everything is according to strategy………………………
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం ఆగిపోయింది. రాయబరేలీ నుంచి రాహులే నామినేషన్ వేశారు. ప్రియాంక పోటీ చేసి గెలిస్తే .. వారసత్వం .. కుటుంబ రాజకీయాలు .. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పార్లమెంట్ లో ఉన్నారనే విమర్శలు బీజేపీ నుంచి వస్తాయని … ఆ పార్టీ కి ఆ అవకాశం ఇవ్వకూడదు అని భావించే ఆమెను బరిలోకి దింపలేదని అంటున్నారు.
మరో కథనం ప్రకారం .. అసలు యూపీ లో పోటీ చేయకూడదని రాహుల్ భావించారు. అయితే కీలకమైన హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు తప్పనిసరిగా పోటీ చేయాలనీ వ్యూహ కర్తలు సలహా ఇచ్చారట. ప్రియాంక కంటే రాహుల్ పోటీ చేయడం ఉత్తమం అని సూచించారట. ఆమేరకు రాహుల్ స్వయంగా బరిలోకి దిగారు.
కొన్నాళ్ల క్రితమే ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ ఎన్నికల బరిలోకి ఆమెను దింపాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే చివరి నిమిషంలో వెనుకడుగు వేశారు.
ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. భారీ కసరత్తు చేసి సర్వశక్తులు ఒడ్డేందుకు సమాయత్తమౌతోంది. రాయబరేలీ లో ఎన్నికల ప్రచారం .. పోల్ మేనేజ్మెంట్ నిర్వహణ కోసం ఒక స్పెషల్ టీమ్ ను పార్టీ ఏర్పాటు చేసింది. వ్యూహకర్తలు .. రాజకీయ ప్రముఖులు. స్థానిక నేతలతో మరి కొన్ని బృందాలు పనిచేస్తాయి. ఎలాగైనా రాయబరేలీ ని మళ్ళీ గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఈ టీమ్ ను ప్రియాంక లీడ్ చేస్తుంది. తాను కూడా ప్రచారం చేస్తుంది.
రాయ్బరేలీ, అమేథీ కాంగ్రెస్ కు పట్టున్న స్థానాలు. అయితే 2019లో అమేథీలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ అక్కడ ఓటమి పాలయ్యారు. 2019 లోకసభ ఎన్నికల్లో రాయ్బరేలీ ప్రజలు సోనియా గాంధీ వైపే మొగ్గు చూపారు.ప్రియాంక నాయనమ్మ ఇందిరా గాంధీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆమె భర్త ఫిరోజ్ గాంధీ కూడా ఇక్కడ నుంచే ఎంపీ అయ్యారు. సోనియా గాంధీ 2004 నుంచి వరుసగా పోటీ చేసి గెలిచారు.
అంతకుముందు ఇందిరా గాంధీ బంధువులు కూడా ఇక్కడ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి గెలిచారు .. రెండో సారి కూడా అక్కడ నుంచి పోటీ చేశారు. అక్కడ పోలింగ్ కూడా ముగిసింది. ఇక రాయబరేలీ లో మే 20 న పోలింగ్ జరుగుతుంది. బీజేపీ నుంచి ఇక్కడ దినేష్ ప్రతాప్ పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఆయన ఇక్కడనుంచి పోటీ చేశారు.