Investigations…………………………..
స్పెయిన్లోని ఓ గుహలో 6 వేల ఏళ్ల క్రితం నాటి పాదరక్షలు లభ్యమైనాయి. గడ్డి, తోలు, నిమ్మ, జనపనార ఉపయోగించి వీటిని తయారు చేసినట్టుగా నిర్ధారించారు. ఇవి సహజ పదార్థాలతో తయారు చేయబడినవని శాస్త్రవేత్తలు గుర్తించారు.
సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో అధ్యయన నివేదిక లో ఈ సమాచారం ప్రచురితమైంది. 19వ శతాబ్దంలో మైనింగ్ ద్వారా ఏర్పడిన అండలూసియాలోని ఒక గుహలో వీటిని గుర్తించారు. బార్సిలోనాలోని అటానమస్ యూనివర్శిటీ, స్పెయిన్లోని అల్కాలా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆ గుహలో ఒక బుట్ట, మరి కొన్ని ఉపకరణాలను కనుగొన్నారు.
దక్షిణ ఐరోపాలో ఇప్పటివరకు గుర్తించిన పురాతన వస్తువులు ఇవేనని అధ్యయన నివేదిక రచయిత మరియా హెర్రెరో ఓటల్ చెబుతున్నారు . ఇందులో పొందుపరిచిన సాంకేతిక వైవిధ్యం, ముడిపదార్థాలు మన పూర్వీకుల నైపుణ్యాలను తెలియజేస్తున్నాయని వివరించారు. ఈ వస్తువులు దక్షిణ ఐరోపాలో అత్యంత పురాతనమైనవని అంటున్నారు.
వారి అధ్యయనం ప్రకారం, ఈ పురాతన పాదరక్షలు మొదటిసారిగా 1857లో స్పానిష్ మైనర్లు గుహను దోచుకున్నప్పుడు కనుగొన్నారు. గుహలోని తక్కువ తేమ, చల్లని గాలులు ఇలాంటి కళాఖండాలను అసాధారణంగా సంరక్షించాయని పరిశోధకులు అంటున్నారు. కొన్ని కళాఖండాలు 9,000 సంవత్సరాల నాటివని చెబుతున్నారు.
పరిశోధకులు కనుగొన్నబుట్టలు, ఇతర చెక్క కళాఖండాలను కూడా అధ్యయనం చేశారు. ఈ వస్తువులు “ఐరోపాలోని ప్రారంభ-మధ్య హోలోసిన్ ఆలోచన, సృజనాత్మకతను తెలియజేస్తున్నాయని చెబుతున్నారు. బుట్టలు, చెప్పులు వంటివి తయారు చేసిన పూర్వీకులు మొక్కల వనరులకు సంబంధించి విస్తృతమైన జ్ఞానంతో పాటు నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని పరిశోధకులు గుర్తించారు.