An innovative invention………
ఒక మహిళా రైతు పూల రేకుల నుండి ఎనర్జీ డ్రింక్ని తయారు చేసి ప్రశంసలు పొందుతోంది. అంతే కాకుండా చిన్న పరిశ్రమ ఏర్పాటుచేసి పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన మధు థాకర్ అనే రైతు తన కుమార్తె అర్చన ను ఉన్నత చదువులు చదివించాడు. కామర్స్ లో గ్రాడ్యుయేషన్, పాలిటిక్స్ లో మాస్టర్స్ చేసిన అర్చన మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తుందని భావించాడు.
అయితే అర్చన మాత్రం తండ్రి బాటనే ఎంచుకుంది. వ్యవసాయంలోనే అద్భుతాలు చేయాలని సంకల్పించుకుంది.అయితే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక వ్యవసాయం చేపట్టింది. ఆమె తల్లి నిర్మలకు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండటంతో కూతురికి సహాయ పడింది.ఆ ఇద్దరి కృషి ఫలితంగా బిటియా రోసెల్లె పువ్వుల నుంచి వచ్చే రసం ఎనర్జీ డ్రింక్ గా తయారైంది.
దేశంలో పూలను ఉపయోగించి తయారు చేసిన తొలి ఎనర్జీ డ్రింక్ (Energy Drink from Flowers) గా గుర్తింపు పొందింది. అర్చన మొదలు పెట్టిన స్టార్టప్ ను మధ్య ప్రదేశ్ సర్కార్ కూడా గుర్తించింది. వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణల అంశం పై ఇండోర్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ కి అర్చన కూడా హాజరయ్యారు.
కాగా 7 ఏళ్ళ క్రితం ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ ప్రతినిధులు హర్దాకి వచ్చారు. బిటియా రోసెల్లె పువ్వు గురించి వివరించి ఆ పువ్వులను పండించండి అని చెప్పి వాటి విత్తనాలను ఇచ్చి వెళ్లారు. అయితే ఆ విదేశీ పువ్వులు హర్దాలో పెరగలేదు. రెండేళ్లు నష్టాలు వచ్చాయి. అయినా అర్చన నిరాశ పడలేదు. ఇంటర్నెట్ లో శోధించి వివిధ టెక్నిక్స్లో పొలాల్లో పనిచేయడం మొదలు పెట్టింది.
మూడో సంవత్సరంలో, పొలాలన్నీ ఎర్రటి పువ్వులతో నిండిపోయాయి. అంతలో కరోనా వచ్చి లాక్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు పూలు పంపలేకపోయారు . ఆ పువ్వులతో ఇంకా ఏమి చేయవచ్చో పరిశోధించడంలోనే అర్చన ఎక్కువ సమయం గడిపింది. ఆ పూల రసం ఎనర్జీ డ్రింక్ లా కూడా పని చేస్తుందని తెలుసుకుంది.


కార్పొరేట్ ఆఫీస్ ఇండోర్ (Indore) నగరంలో ఉంది.ఈ జ్యూస్ ని ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా విక్రయిస్తున్నారు. సేజ్ జ్యూస్ (Sage Juice) ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది.కేవలం ఆరు నెలల్లో రూ.7 లక్షలు సంపాదించానని అర్చన మీడియాకు వివరించారు.
2025 నాటికి అర్చన కంపెనీ ₹70 నుండి ₹80 లక్షల వార్షిక విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోంది. అంతకుముందు ఏడాది టర్నోవర్ సుమారు ₹30 లక్షలుగా ఉంది. వ్యాపారం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ఆమె సుమారు ₹7 నుండి ₹8 లక్షల అమ్మకాలను నమోదు చేశారు.ఆమె కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా, తన ఉత్పత్తులను అమెరికా (USA) వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
post updated on 26-12-25.

