ఇలాంటి మాస్టర్ పీస్ మరొకటి రాదేమో ?

Sharing is Caring...

The story of a revolutionary hero……………………….

అల్లూరి సీతారామరాజు’ లాంటి మాస్టర్ పీస్ సినిమా ఇంకొకటి రాదేమో. సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం ఈ సినిమా విడుదలైంది. ఇన్ని సంవత్సరాలు గడచినా ఆస్థాయిలో మరో సినిమా రాలేదు. అందుకే సీతారామరాజు  ఎవర్ గ్రీన్  మాస్టర్ పీస్ గా మిగిలి పోయింది. నటుడు కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క “అల్లూరి సీతారామరాజు” ఒక ఎత్తు. ఈ విషయాన్ని ఇతర హీరోల అభిమానులు కూడా కాదనలేరు.

ఆ సినిమా కు కథ, మాటలు,పాటలు  బ్రహ్మాండంగా సమకూరాయి. అలాగే పాత్రల్లో నటీనటులు ఒదిగిపోయారు. కృష్ణ ఆ సినిమా ఎలా అయితే ఉండాలని కోరుకున్నారో  అదేవిధంగా దర్శకుడు రామచంద్రరావు కథను తెరపైకి ఎక్కించారు. అంతకుముందు రామచంద్రరావు కృష్ణ కాంబినేషన్ లో కొన్ని హిట్ సినిమాలు వచ్చాయి. ఆయన దర్శకత్వంలోనే ‘అసాధ్యుడు’ సినిమాలో ఒక నాటకంలో కృష్ణ ‘సీతారామరాజు’ క్యారెక్టర్ వేశారు. అప్పటినుంచే కృష్ణకు ఆ పాత్ర చేయాలని కోరిక కల్గింది. అందుకే రామచంద్రరావునే దర్శకుడిగా పెట్టుకున్నారు.

సీతారామరాజు కి ముందు ‘దేవుడు చేసిన మసుష్యులు’వంటి సూపర్ హిట్ సినిమా కూడా రామచంద్రరావే చేశారు. సినిమా షూటింగ్ క్లయిమాక్స్ కొచ్చిన దశలో రామచంద్రరావు అనారోగ్యంతో కన్ను మూశారు. అక్కడనుంచి కృష్ణ పర్యవేక్షణలో దర్శకుడు  కేఎస్ ఆర్ దాస్ సినిమాను పూర్తి చేశారు.అసలు సీతారామరాజు కథ మొదట ఎన్టీఆర్ కోసం తయారు చేశారు రచయిత మహారథి. ఆయనకు వినిపించారు.

బ్రిటిష్ సైనికుల వేధింపుల తాళలేక పోతున్న మన్య ప్రజల క్షేమం కోసం రామరాజు తాను చేపట్టిన ఉద్యమానికి కొంత కాలం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అదే సినిమా ముగింపు. అది ఎన్టీఆర్ కి నచ్చలేదు. దాంతో సినిమా ప్రతిపాదన  ఆగిపోయింది. ఒకసారి కృష్ణ సోదరుడు హనుమంతరావు మహారథి కలిసినపుడు ఈ సినిమా ప్రస్తావన వచ్చింది. సినిమా చర్చల దగ్గరే ఆగిపోయినట్టు మహారథి చెప్పారు. ఆ వెంటనే కృష్ణ ను, డైరెక్టర్ రామచంద్రరావు ను మహారథి కలవడం.. కథపై చర్చలు జరగడం చకచకా జరిగిపోయాయి.

కృష్ణ కు జగ్గయ్య మొదటినుంచి శ్రేయోభిలాషి. దాదాపుగా కృష్ణ సొంత చిత్రాల్లో జగ్గయ్య ఉంటారు. దీనికో కారణముంది. కృష్ణ తొలి దశలో జగ్గయ్య తన సొంత సినిమా “పదండి ముందుకు”కృష్ణ కో చిన్న రోల్ ఇచ్చారు. అక్కడ నుంచి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడాయి.  సాహిత్యం పై మంచి పట్టు ఉన్న జగ్గయ్య సీతారామరాజు కథా చర్చల్లో పాల్గొన్నారు. ముగింపు కూడా ఆయనే సూచించారని అంటారు.

కృష్ణ, రామచంద్రరావు, జగ్గయ్య, విజయనిర్మల  సూచనల మేరకు సీత పాత్ర ను సినిమా కథలో యాడ్ చేశారు. రూథర్ ఫర్డ్ పాత్రను సాఫ్ట్ గా తీర్చిదిద్దారు. క్లయిమాక్స్ కూడా అద్భుతంగా కుదిరింది. ఈ సినిమా కోసం మహారథి ఒకటి రెండు సినిమాలు వదులుకున్నారు. సినిమా పూర్తి అయ్యేవరకు చింతపల్లి అడవుల్లో యూనిట్ తోనే  ఉన్నారు. క్లయిమాక్స్ మన్యంలో నే రాశారట. అందుకుగాను రెండు సినిమాలకిచ్చిన పారితోషకం మహారధికి ఇచ్చారట.  ఆరోజుల్లో మహారథి ఎన్టీఆర్, కృష్ణ సినిమాలకు ఎక్కువగా పని చేశారు.

ఇక్కడే రూథర్ ఫర్డ్ పాత్ర గురించి  నాలుగు మాటలు చెప్పుకోవాలి.  కలెక్టరు రూథర్‌ఫర్డ్‌ని కొంత సౌమ్యుడిగా చూపారు.రూథర్ ఫర్డ్ కి అన్ని వ్యవహారాలపై అవగాహన వున్నట్టు, సీతారామరాజంటే గౌరవం కూడా వున్నట్టు డైలాగ్స్ ద్వారా చెప్పించారు. అలాగే ఆ ఇద్దరు కలసినప్పుడు రామరాజును రూథర్ ఫర్డ్ మెచ్చుకున్నట్టు  చూపించారు. అయినా ప్రభుత్వం మాట వినని  రామరాజును చంపించినట్టు సినిమాలో చూపించారు.అసలు “రూదర్ ఫర్డ్” ఎలాఉంటాడో చాలా మందికి తెలీదు. ఆ పాత్ర మరీ కఠినంగా ఉంటే బాగుండదని జగ్గయ్య నిర్మొహమాటంగా చెప్పారట.

అందుకే కొంత సౌమ్యంగా ఉన్నట్టు మార్చారట.కథా చర్చల్లో జగ్గయ్య ఉండటం మూలాన .. ఆయన పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా ఉంటుందని భావించి మార్పులు చేశారు. సీతారామరాజు చిత్రంలోఆ పాత్రకు నటుడు జగ్గయ్య ప్రాణ ప్రతిష్ట చేసారు. తన కంచుకంఠం తో  డైలాగులు చెబుతుంటే జనం సినిమాలో మమేకమైనారు. జగ్గయ్య వేషదారణ కోసం మేకప్‌ మ్యాన్‌ మాధవరావు చాలా కృషి చేశారు.  నీలిరంగు కాంటాక్ట్‌ లెన్సులను అమర్చి బ్రిటిషు అధికారి రూపాన్ని తీర్చిదిద్దారు.జగ్గయ్య రూథర్ ఫర్డ్ ను మన కళ్ళముందు ఉంచారు.  అందుకే సినిమా సూపర్ హిట్ అయింది. క్లైమాక్స్ లోని  రామరాజు … రూథర్ ఫర్డ్ సంవాద దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి.

ఇక రూథర్ ఫర్డ్  ఉద్యమాల అణచివేతలో ఆరితేరిన వాడు. పల్నాడులో  పుల్లరి వ్యతిరేక ఉద్యమాన్ని కఠినంగా తొక్కేసాడు. దానికి నాయకత్వం వహించిన కన్నెగంటి హనుమంతు కాల్చివేతలో తెరవెనుక పాత్ర రూథర్ ఫర్డ్ దే అని ఒక కథనం ప్రచారం లో ఉంది. అతను అంత కఠినుడు కాదని పాత తరం గుంటూరు వాసులు అంటారు. ఆ తర్వాత రూథర్ ఫర్డ్ మన్యం కు వచ్చాడు. అప్పటికే అక్కడ విప్లవం ఆఖరి దశలో ఉంది.రామరాజు అనుచరగణం తగ్గిపోయాక, గ్రామాలను బూడిద చేసి, ప్రజలను భయభ్రాంతులను చేసాడని అంటారు.

గిరిజనులను  కష్టాలపాలు చేసి వారికోసం రామరాజు తనంతట తానే లొంగిపోయేలా వ్యవహరించారని  చెబుతారు. అదలా ఉంటే రూథర్‌ఫర్డ్‌, రామరాజు ఎన్నడూ ఎదురుపడలేదు. సినిమాలో మాత్రం రూథర్‌ఫర్డ్‌ మన్యానికి వచ్చి లంచగొండితనమే, వెట్టిచాకిరియే విప్లవానికి మూలకారణమని గ్రహించినట్టు చూపించారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ సరిగ్గా లేదు. టెలిఫోన్‌ తీగలు పెట్టించాడని చూపించారు.సంస్థానాధీశుల నుండి సైనికులకు ఆహార పదార్థాలు తెప్పించాడని కథ అల్లారు.

నిజానికి ఇవన్నీపాత కలెక్టర్ ఉన్నపుడు జరిగాయని అంటారు .1924 మే 7 న రామరాజు  ఏటి  ఒడ్డున కూర్చుని ఒక కోయవాడి ద్వారా పోలీసులకు కబురంపాడు. వాళ్లు వచ్చి కొయ్యూరుకు తీసుకెళ్లారు. అక్కడ గుడాల్‌కు, అల్లూరికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది.దాంతో గుడాల్‌ గొలుసులతో చెట్టుకు కట్టించి, రివాల్వర్‌తో కాల్చి రామరాజు ను చంపారని  అంటారు.  తర్వాత తమకు చెప్పకుండా రామరాజును కాల్చి చంపడం తో రూథర్‌ఫర్డ్‌ గుడాల్‌ పై మండి పడ్డారని చెబుతారు.

ఇలా చంపినట్టు బయటకు వస్తే బ్రిటిష్‌ సర్కారుకి అవమానమని, పారిపోతూ వుంటే కాల్చామని స్టేటుమెంటు ఇప్పించారు. అయితే సినిమాలో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ అత్యంత నాటకీయంగా .. ఒళ్ళు గగుర్పొడిచేలా చిత్రీకరించారు. అయితే ఎక్కడా రామరాజు పాత్ర ఔన్నత్యం  దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కథలో మార్పులు చేర్పులు సహజమే.  దీంతో సినిమా సూపర్ హిట్ అయింది. హీరో కృష్ణ కు మంచి పేరు తెచ్చి పెట్టింది.

మన్య ప్రాంతంలో జరిగిన వాస్తవాలు కాబట్టి కృష్ణ రాజీ పడకుండా యూనిట్ మొత్తాన్ని అక్కడికే తరలించి సినిమా తీశారు. అల్లూరి సీతారామరాజు ఈ మన్య ప్రాంతంలోనే గిరిజన ప్రజలతో కలసి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడారు.గిరిజన హక్కులను,అటవీ సంపదను దోచుకుంటున్న బ్రిటిష్ సర్కార్ ను  రెండేళ్ల పాటు గడగడ లాడించారు. చింతపల్లి…. మరికొన్ని పోలీసు స్టేషన్లను ‌ దోచుకున్నారు. ఆయుధాలు తీసుకుపోయారు.

సీతారామరాజు గురించి అనేక పుస్తకాలు, నాటకాలు, బుర్రకథలు వచ్చాయి.ఆయన అసలు పేరు శ్రీరామరాజు అంటారు. సీత పాత్ర కల్పితమని చెబుతారు. రామరాజు ఇమేజ్ మరింత పెంచేందుకు సినిమా కథలో మార్పులు చేర్పులు చోటు చేసు కున్నాయి. సీతారామరాజు షూటింగ్ చింతపల్లి కి దగ్గరలోవున్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోశనపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల ప్రాంతాల్లో జరిగింది. సినిమా యూనిట్ మొత్తం చింతపల్లి లోనే  బస చేసింది. 

‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం’’.

ఈ డైలాగులు ఇప్పటికి అక్కడక్కడా వినబడుతుంటాయి. అప్పట్లో తూటాల్లా పేలాయి ఈ డైలాగులు. ఇప్పటికి ఆ సినిమా చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందుకే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా కోసం మహారథి చాలా కష్టపడ్డారు. ఫలితం కూడా దక్కింది.

ఇక పాటలు గురించి చెప్పనక్కర్లేదు. ఆదినారాయణరావు సంగీతం అద్భుతం.  “రగిలింది విప్లవాగ్ని ఈ రోజు” అంటూ ఆరుద్ర రాసిన గీతం, “వస్తాడు నారాజు .. ఈరోజు “అంటూ సినారె రాసిన పాట , “తెలుగువీర లేవరా” అన్న శ్రీశ్రీ గీతం ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్. కెమెరామెన్ వి.ఎస్. ఆర్ స్వామి ఈ చిత్రాన్ని అద్భుత కావ్యంగా మలిచారు. 

———- K.N.Murthy  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!