ఆ ఇద్దరు తొలిసారి ఎక్కడ కలిశారంటే ?

Sharing is Caring...

Krishna meets NTR for the first time ……………

ఎన్టీఆర్ అంటే సూపర్ స్టార్ కృష్ణకు విపరీతమైన అభిమానం. ఒక విధంగా ఆయన ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఈ విషయం కృష్ణ కూడా పలు మార్లు చెప్పుకున్నారు. కృష్ణ ఎన్టీఆర్ సినిమాలను రెగ్యులర్ గా థియేటర్ కెళ్ళి చూసేవారు. ‘పాతాళ భైరవి’ చూసిన నాటి నుంచి ఆ అభిమానం మూడింతలైంది.

తాను కూడా సినీ హీరో కావాలని కృష్ణ 19 ఏళ్ళ వయసులోనే నిర్ణయించుకున్నారు. అప్పట్లోనే ఆయన మద్రాస్ వెళ్లారు. తన తండ్రి వీర రాఘవయ్యకు స్నేహతుడైన విజయా చక్రపాణిని కలిశారు. చక్రపాణి కృష్ణను ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్లారు.

అపుడు ఎన్టీఆర్ భట్టి విక్రమార్క షూటింగ్లో ఉన్నారు. బ్రేక్ టైమ్ లో ఆయన చక్రపాణి వద్దకు వచ్చారు. విక్రమార్కుని గెటప్ లో చిరునవ్వులు చిందిస్తూ రాచఠీవి ఉట్టిపడుతున్న గెటప్ లో ఎన్టీఆర్ ను తొలిసారి ప్రత్యక్షంగా చూసి మహదానంద పడిపోయారు కృష్ణ. 

చక్రపాణి ఎన్టీఆర్ కి కృష్ణను పరిచయం చేసి వచ్చిన విషయం వివరించారు. కృష్ణ వంక పరిశీలనగా చూసిన ఎన్టీఆర్ “బాగున్నారు బ్రదర్… కానీ మీది మరీ లేత వయసు. మీకు సూట్ అయ్యే పాత్రలు ఇప్పుడు దొరకడం కష్టం. ఇంకో రెండు మూడేళ్లు ఆగండి..ఈ లోపు నాటకాల్లో నటించండి.. అనుభవం వస్తుంది. అది భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది.” అంటూ సలహా ఇచ్చారు.

ఆయనకు నమస్కారం చేసి వచ్చేసారు. తర్వాత తెనాలి వారైన గుమ్మడి వెంకటేశ్వరరావు, కొంగర జగ్గయ్యలను కూడా కృష్ణ కలిశారు. కొన్నాళ్ళు గడిచాక కృష్ణ ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో ‘ఛైర్మన్‌’ వంటి అనేక నాటికల్లో, నాటకాల్లో పాల్గొని నటనపై అవగాహన పెంచుకున్నారు.

కొన్నాళ్ల తర్వాత ప్రముఖ దర్శక నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ ని కలిశారు. ప్రసాద్‌ అదే సమయంలో  ‘కొడుకులు – కోడళ్ళు’ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. కృష్ణని ఆ సినిమాలో ఒక పాత్రకు ఎంపికజేసి, కొంత రిహార్సల్సు కూడా నిర్వహించారు. కారణాంతరాల వలన ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది.

మద్రాసులో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే  శోభన్‌బాబుతో కలిసి “చేసిన పాపం కాశీకి వెళ్లినా… ‘ వంటి నాటకాల్లో నటించారు. జగ్గయ్య నిర్మించిన ‘పదండి ముందుకు’ సినిమాలో కృష్ణ చిన్నపాత్ర పోషించారు.తర్వాత కృష్ణ ‘కులగోత్రాలు’, ‘పరువు-ప్రతిష్ట’ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. 

ఒకసారి పాండీ బజార్లో వున్న కృష్ణను, కొత్తనటుల అన్వేషణలో వున్న దర్శక నిర్మాత శ్రీధర్‌ చూసి, ‘కాదలిక్కనేరమిల్లై’ (తెలుగులో ‘ప్రేమించిచూడు’)లో ఒక హీరోగా పరిచయం చేద్దామనుకున్నారు.అయితే తమిళ భాష రానికారణంగా ఆ అవకాశం చేజారి రవిచంద్రన్‌కి దక్కింది.

దీంతో విసుగుపుట్టి కృష్ణ తిరిగి తెనాలి వెళ్లారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీనటులతో సినిమా నిర్మిస్తున్నట్టు పత్రికా ప్రకటన వచ్చింది. కృష్ణ ఫోటోలు పంపారు. స్క్రీన్‌ టెస్ట్‌ కి రమ్మన్నారు. ఆ టెస్ట్ లో ఒకే అనుకున్నాక  ఆదుర్తి కృష్ణను హీరోగా ఎంపిక చేశారు.

కృష్ణంరాజు, జయలలిత, హేమామాలిని ఆ టెస్ట్ కి వెళ్లినా వారెవరూ ఎంపిక కాలేదు. హీరోగా కృష్ణ నటించిన మొదటి సినిమా ‘తేనెమనసులు’ మంచి విజయం సాధించింది. ఇక హీరో అయ్యాక  స్త్రీ జన్మ, నిలువు దోపిడీ, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు వగలమారి భర్తలు వంటి చిత్రాలలో ఎన్టీఆర్ తో కలసి నటించారు. ఆ తర్వాత కథ తెల్సిందే.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!