చార్ ధామ్ యాత్ర లో ‘కేదారనాథుని దర్శనమే’ కీలకం !

Sharing is Caring...

Trekking in Himalayas………..

మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు. మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి.

ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ కొండల పై భాగంలో ఉంది. కేదారేశ్వరుని ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. కొండలను, గుట్టలను ఎక్కుతూ వెళ్లి ఆ శివుడిని దర్శించుకోవాలి. అలా ప్రయాణించడం ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని భక్తులు చెబుతుంటారు. శైవ క్షేత్రాల్లో ఇది ముఖ్యమైనది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు.

ఈ ఏడాది ఏప్రిల్ 22 ఉదయం 8:00 గంటల నుంచి కేదారనాథుని దర్శనం లభిస్తుంది ఆరోజు ఉదయమే ఆలయం తలుపులు తెరుస్తారు. నవంబర్ వరకు గుడి తెరిచి ఉంటుంది. హిమపాతాలు ఎక్కువ కాబట్టి మిగిలిన సమయంలో ఆలయాన్నిమూసి ఉంచుతారు. ఈ గుడిని ఆదిశంకరాచార్యులు నిర్మించారని చెబుతారు. కేదార్‌నాథ గుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది.యాత్రీకులు ఈ సమాధిని సందర్శించవచ్చు.అక్కడే ఆయన విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.  

కేదారనాథ్ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుంచి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరారు.ఇక్కడే కొన్నాళ్ళు ఉన్నారని అంటారు. కాగా 2013  వరదల సమయంలో  కేదార్ నాథ్ తీవ్రంగా ప్రభావితమైంది.

ఆలయ సముదాయం, చుట్టుపక్కల ప్రాంతాలు, కేదార్‌నాథ్ కొంత మేరకు నష్టపోయాయి.ఎత్తైన పర్వతాల నుండి ప్రవహించిన వరద నీటి కారణంగా  నాలుగు గోడలకు ఒక వైపున కొన్ని పగుళ్లు మినహా ఆలయ నిర్మాణానికి ఎటువంటి పెద్ద నష్టం జరగలేదు. ఒక పెద్ద బండ శిలఅడ్డుగా నిలిచి వరద నుండి ఆలయాన్ని రక్షించింది.

గౌరీ కుండ్ నుంచి కాలినడకన ఆలయానికి చేరుకోవాలి.ఈ మార్గంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు, జలపాతాలు యాత్రీకులకు కనువిందు చేస్తాయి. కేదార్ నాధుని ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది. శిఖరాగ్రాన్ని చేరుకుని  కేదారేశ్వరుడిని దర్శించి కిందకు రావడం మరిచి పోలేని  అనుభూతి గా మిగులుతుందని యాత్రీకులు చెబుతుంటారు.

నడవలేని వారిని గుర్రాలు ,డోలీల ద్వారా కొండపైకి తీసుకెళతారు. గౌరీ కుండ్ నుంచి స్వామి ఆలయానికి 14 కి.మీ దూరం ఉంటుంది. రెగ్యులర్ గా నడక అలవాటు ఉన్నవారికి ఈ దూరం పెద్ద కష్టం కాదు.సునాయాసంగా నడవగలరు.ఆరోగ్య పరిస్థితి బాగున్నవారే యాత్రకు వెళ్లడం మంచిది. మార్గ మధ్యంలో ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే విశ్రాంతి తీసుకోవడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి.

కేదార్నాథ్  వెళ్ళడానికి హరిద్వార్ లో కార్లు అందుబాటులో ఉంటాయి. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్ కు రావాల్సిందే. ఉదయం 8 గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ ఆర్టీసీ స్టేషన్ నుంచి గౌరీకుండ్ కి బస్సులు  దొరుకుతాయి. అక్కడనుంచి కాలినడకన ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

పహల్గామ్ దాడి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు..కేదార్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. యాత్ర సమయంలో జనసమూహ నియంత్రణ,భద్రతను దృష్టిలో ఉంచుకుని,మెరుగైన సౌకర్యాలను సులభతరం చేయడానికి రిజిస్ట్రేషన్ విధానం పెట్టారు.

ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్ ద్వారా లేదా వివిధ ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కేంద్రాలలో.. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.హెలికాప్టర్ లో వెళ్లి కేదార్ నాధుడిని దర్శించే సదుపాయం కూడా ఉంది.కేదార్‌నాథ్ హెలికాప్టర్ టిక్కెట్లను కేవలం అధికారిక IRCTC Heli Yatra పోర్టల్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.

గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ మధ్య దూరాన్ని 16 కి.మీ నుండి కేవలం 5 కి.మీలకు తగ్గించే లక్ష్యంతో 7 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఇది అందుబాటులోకి రావడానికి మరి కొంత సమయం పడుతుంది.

సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే నిర్మాణ బాధ్యతను అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 36 నిమిషాల్లోనే ఆలయానికి చేరుకోవచ్చు, ఇది పూర్తి కావడానికి సమయం పడుతుంది.

ప్రస్తుతానికి యాత్ర చేసేవారు పాత పద్ధతిలోనే గౌరీకుండ్ నుండి 16-18 కి.మీ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది లేదా హెలికాప్టర్ సేవలను వాడుకోవాలి.   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!