Biopic……………………………
ఏపీ సీఎం జగన్ బయోపిక్ తీస్తున్నట్టు ఏడాది క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఎందుకో పట్టాలెక్కలేదు. జగన్ జీవితం లోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ బయోపిక్ రూపొందబోతోందని అప్పట్లో ప్రచారం జరిగింది.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ జగన్ బయోపిక్ ను పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నారని బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్ర ను పోషిస్తారని అప్పట్లో పత్రికలు రాసుకొచ్చాయి.
వైఎస్ మరణించక ముందు నెలకొన్న పరిస్థితులు .. ఆయన మరణం అనంతర రాజకీయ పరిణామాలు … ఓదార్పు యాత్ర .. జగన్ పార్టీ స్థాపించడం … 2014 ఎన్నికలు … పాదయాత్ర 2019 ఎన్నికలు … సీఎం అవడం వరకు కొన్ని కీలక ఘట్టాలతో కథ తయారు చేసినట్టు ప్రచారం జరిగింది.
అంతకుముందు కూడా జగన్ బయోపిక్ గురించి వార్తలు వచ్చేయి. కాగా మహీ ప్రతిపాదనకు జగన్ అంత సుముఖత చూపలేదని … ఎన్నికలకు ముందు చేస్తే బాగుంటుందని సూచించినట్టు తెలుస్తోంది.
ఇక యాత్ర బయోపిక్ లో వైఎస్ పాత్రలో మలయాళ హీరో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారు. ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం సాధించింది.
‘యాత్ర’ సినిమాకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు.జగన్ బయోపిక్ లో మొదట హీరో సూర్య, ఆ తర్వాత అజ్మల్, ఆ పిదప ప్రతీక్ గాంధీ నటిస్తారనే వార్తలూ వచ్చాయి.ప్రతీక్ గాంధీ హిందీ, గుజరాతీ ఇంగ్లిష్ చిత్రాల్లో నటించారు. స్కాం 1992 వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా పరిచయమైనారు.
ప్రతీక్ ఆహార్యం, హావభావాలు జగన్కి దగ్గరగా ఉంటాయని భావించి, ఆయన్ను ఎంపిక చేశారని కూడా కథనాలు వెలువడ్డాయి.
మొత్తానికి ఈ ప్రాజెక్టుని తాత్కాలికంగా పక్కన బెట్టినా ఎప్పటికైనా తెరకెక్కించే అవకాశాలైతే ఉన్నాయి. బహుశా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కావచ్చు.