In detention for a long time ………………..
మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. డిసెంబర్ 30, 2022న, ఆమె పై ఉన్న కేసుల తాలూకు విచారణలు ముగిశాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులనే ఆరోపణలు లేకపోలేదు.
తన క్యాబినెట్ మెంబర్ హెలికాఫ్టర్ కొనుగోలు చేసే విషయంలో.. అద్దె చెల్లించే అంశంలో అంగ్ సాన్ సూకీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగం.ఇలా వివిధ కేసుల్లో మొత్తం మీద 33 సంవత్సరాల జైలు శిక్ష, విధించారు. తరువాత దానిని 27 సంవత్సరాలకు తగ్గించారు.
ప్రస్తుతం అంగ్ సాన్ సూకీ వయసు 80 సంవత్సరాలు. కొంత చురుగ్గా కనబడుతున్నప్పటికీ యాక్టీవ్ గా రాజకీయాల్లో పాల్గొనడం కష్టమే. సూకీ కోర్టు శిక్ష అనుభవించి బయటకు వచ్చేసరికి ఆమె వయసు 100 దాటుతుంది.సూకీ అంతకుముందు కూడా 2010 వరకు 15 ఏళ్లపాటు గృహనిర్బంధంలో ఉన్నారు.
మయన్మార్లో 2021 .లో సైనికులు తిరుగుబాటు ప్రకటించారు. ఈ పరిణామంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. అంగ్సాన్ సూకీని సైనికులు అదుపులోకి తీసుకుని … నిర్బంధంలో పెట్టారు. మయన్మార్ మిలటరీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది.
మయన్మార్లో ఎన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వానికి, మిలటరీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.2020 నవంబర్ లో జరిగిన ఎన్నికలలో అంగ్ సాన్ సూకీ పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ మొత్తం 476 సీట్లలో 396 స్థానాలను కైవసం చేసుకుంది. ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత సాధించింది.
సైనిక మద్దతు ఉన్న ‘యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ’ కేవలం 33 సీట్లను మాత్రమే గెలుచుకుని దారుణంగా పరాజయం పాలైంది. అప్పటినుంచే కుట్రలు మొదలైనాయి. సూకీ పార్టీ 2015 లో జరిగిన ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించింది. ఆమె వరుస విజయాలను ఓర్వలేని మిలిటరీ లో కొన్ని శక్తులు తిరుగుబాటు కు నాయకత్వం వహించాయి.
ఈ నేపథ్యంలో అంగ్సాన్ సూకీతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలను సైనికులు అదుపులోకి తీసుకున్నారు.సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా అప్పట్లో సూకీ బహిరంగ నిరసనలకు పిలుపునిచ్చారు. అల్లర్లు జరగకుండా మిలటరీ జాగ్రత్తలు తీసుకుంది.
అప్పట్లో మయన్మార్ మిలటరీ కుట్రపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాల ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో తాము జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ తర్వాత సైలెంట్ అయిపొయింది.
సూకీ పాలక పార్టీ మోసాలతో ఘన విజయం సాధించిందని మిలటరీ చేసిన ఆరోపణలను మయన్మార్ ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.మొత్తం మీద మిలిటరీ కి తిరుగులేకుండా పోయింది.
మయన్మార్లో మొన్నటి డిసెంబర్ లో సాధారణ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. 2021లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత దేశంలో ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి.ఈ ఎన్నికల్లో సైనిక మద్దతు ఉన్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (USDP) భారీ విజయాన్ని సాధించింది.
ఏప్రిల్ 3, 2026న జరిగిన పరోక్ష అధ్యక్ష ఎన్నికల్లో సైనిక పాలకుడు మిన్ ఆంగ్ హ్లైంగ్ (Min Aung Hlaing) మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఏప్రిల్ 10, 2026న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికలను ఐక్యరాజ్యసమితి అనేక పాశ్చాత్య దేశాలు “బూటకపు ఎన్నికలు” గా అభివర్ణించాయి.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ సూకీకి చెందిన ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (NLD) ని ముందే రద్దు చేయడం, అనేక ప్రాంతాల్లో అంతర్యుద్ధం కారణంగా ఓటింగ్ జరగకపోవడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత లేదని విమర్శకులు భావిస్తున్నారు

