దుర్భిణీ వేసి గాలించినా..ఇలాంటి నేతలు కనిపించరు !

Sharing is Caring...
श्रीनिवास कृष्ण (Srinivasa Krishna Patil) …………………………………

అది 1907 వ సంవత్సరం. కలకత్తానగరం. రెవెన్యూ ఆఫీసు. ఆ ఆఫీసులోోనికి కలకత్తా నగరంలో పేరుమోసిన వకీలు చిత్తరంజన్ దాస్ ప్రవేశించారు.
“నమస్తే రెవెన్యూ ఆఫీసరు గారూ, ముప్పై ఏండ్ల క్రితం ఈ జాబితాలో ఉన్న మనుషులు గాని, వారి వారసులు గాని ఇపుడు ఎక్కడ ఉన్నారో దయచేసి వివరాలు ఇవ్వగలరా?”

“నమస్తే చిత్తరంజన్ దాస్ గారూ, తప్పకుండా. మీరు కూర్చోండి. ఏమయ్యా దీనదాసూ, ఇలా రా, ఈ జాబితా తీసుకుని, వీరడిగిన వివరాలు ఇవ్వండి.”
“ధన్యవాదాలు రెవెన్యూ ఆఫీసరుగారూ. ఎంతసేపు పడుతుంది?”
“వెదికి ఇవ్వడానికి ఒకరోజైనా పడుతుంది. రేపు ఇదే సమయానికి రాగలరా?”
“తప్పకుండా. ధన్యవాదాలు.”
———
“రండి చిత్తరంజన్ దాస్ గారూ, మీరడిగిన వివరాలు దొరికాయి. ఇవిగోండి.”
“ఆహా, ధన్యవాదాలు ఆఫీసర్ గారూ, మీ ఋణం తీర్చుకోలేనిది.”
“సరే, చిత్తరంజన్ గారూ, మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అడుగవచ్చా?”
“అయ్యో, ఎంతమాట! తప్పకుండా అడగండి.”

“మీరు ఇచ్చిన ఈ జాబితాలోోని మనుషులందరూ ఎవరండీ? ఎందుకు వారి వివరాలను మీరు కోరారు?”
“ఆఫీసర్ గారూ, వీరందరూ మా తండ్రిగారి ఋణదాతలు. మా నాన్నగారు అప్పట్లో బ్రహ్మో పబ్లిక్ ఒపీనియన్ అనే పత్రికను నడిపేవారు. దానిని నడిపేందుకు గాను వీరి దగ్గర ఋణం తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆ పత్రికకు నష్టాలు వచ్చాయి.

మా నాన్నగారు మా ఆస్తినంతటినీ అమ్మినప్పటికీ వీరి దగ్గర తీసుకున్న అప్పులను పూర్తిగా తీర్చలేకపోయారు. దివాలా తీశారు. నేను అప్పట్లో చిన్నవాడిని. అయితే ఇప్పుడు నేను హైకోర్టు లాయరును. కావలసినంత ధనం సంపాదించాను. అందువల్ల అప్పట్లో మా నాన్నగారి మీద నమ్మకంతో అప్పు ఇచ్చిన వారి ఋణం వడ్డీతో సహా కలిపి, అప్పట్లోనే ఇవ్వలేకపోయినందుకు నష్టపరిహారంగా రెండు రెట్లుగా ఇద్దామని సంకల్పించాను.

లెక్క చూస్తే దాదాపు పదిలక్షలైంది. ఆ మొత్తాన్ని వారికి గాని, వారి వారసులకు గాని అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే వారి వివరాలనడిగాను.”
“చిత్తరంజన్ దాస్ గారూ, మీవంటివారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. మీ పూర్వికులందరికీ మీరు శాశ్వతపుణ్యలోకాలను సంపాదించబోతున్నారు.”
“కుమారునిగా అది నా బాధ్యత కదా ఆఫీసర్ గారూ. లేకుంటే ఆ వంశంలో పుట్టాను అని నేను చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనమేమిటి?”

“అవును దాస్ గారూ, మీవంటి వ్యక్తులకు సమకాలికుడను కావడం నా భాగ్యం.”
“ఎంతమాట ఆఫీసర్ గారూ, నేను అడిగిన వెంటనే వివరాలను వెదికించి ఇప్పించారు. మీ సహకారం లేకుంటే నేను కూడా వారి ఋణం తీర్చలేకపోయానే అన్న బాధతోనే జీవితం చాలించి ఉండేవాడిని. వారి వివరాలు ఇచ్చి నన్ను ఎంతో సంతోషపెట్టారు.” “ధన్యవాదాలు మహోదయా. సెలవు ఇప్పించండి. మరలా పని ఉన్నపుడు వచ్చి కలుస్తాను.”
“అలాగే వెళ్లిరండి దాస్ గారూ, మీలాంటి సత్పురుషులు ఈ దేశంలో మళ్లీ మళ్లీ పుట్టాలి.”
——————–
దేశ బంధుగా ప్రసిద్ధి గాంచిన చిత్తరంజన్ దాస్ బెంగాల్ కు చెందిన ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్యోద్యమ నేత. ఇంగ్లాండులో చదువుకున్నారు. 1909లో అలీపూరు బాంబు కేసులో అభియోగాలున్న అరబిందో ఘోష్  తరపున వాదించి గెలిచిన లాయర్.

అదే ఆయన తొలి కేసు. అప్పట్లో ఆ కేసు సంచలనం సృష్టించింది.ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయ నిరాకరణోద్యములో బెంగాల్ లో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ దుస్తులను బహిష్కరించడానికి నాంది పలికి ఐరోపా దేశ వస్త్రాలను తగుల బెట్టి స్వదేశ ఖాదీని కట్టి అందరికి ఆదర్శంగా నిలిచారు.

మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్ పార్టీ స్థాపించాడు. బ్రిటిష్ వారితో పోరాడేందుకు ఆయన “ఫార్వర్డ్” అనే పత్రికను పెట్టారు.తర్వాత దాని పేరును “లిబర్టీ”గా మార్చారు. కలకత్తా కార్పొరేషన్ కి  తొలి మేయర్ గా పనిచేశారు.

 (నేతాజీ సుభాాస్ చంద్రబోసు కు రాజకీయ గురువు దేశబంధు చిత్తరంజన్ దాస్ గారి జీవిత కథలో ఒక సంఘటనను చిన్న సంభాషణరూపంలో తెలియజేసేందుకు ఇలా ప్రయత్నం చేశాను.ఈ సంఘటనను ప్రేరణగా తీసుకుని తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది. కాని, ప్రేరణగా నిలిచిన చిత్తరంజన్ దాసు పేరును కూడా ఆ దర్శకుడు తలచినట్టు లేదు. చిత్తరంజన్ గారికి శాశ్వతంగా అతడు ఋణపడే ఉంటాడు. )

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!