చైనా వందలాది విమానాలను రద్దు చేసింది. పాఠశాలలను మూసివేసింది. అధికారులు పెద్ద ఎత్తున మళ్ళీ కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో చైనా అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తర .. వాయువ్య ప్రాంతాలలో కేసులు వరుసగా ఐదో రోజు రావడంతో అధికారులు కరోనావైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు.
ఒక పక్క ఇతర దేశాలు క్రమంగా కరోనా ఆంక్షలు సడలిస్తుంటే .. చైనా మాత్రం సరిహద్దులను మూసివేత … లాక్ డౌన్ విధింపు వంటి ఆంక్షల నుంచి బయట పడలేక పోతున్నది. కొత్త కేసులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏమాత్రం కనికరం లేకుండా కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. వాయువ్య చైనాలోని దాదాపు నాలుగు మిలియన్ల మంది జనాభా కలిగిన నగరం లంఝౌ తో సహా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మరీ అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.
దేశంలో చాలావరకు కరోనా అదుపులో కొచ్చింది. ఇటీవల నమోదైన కేసులు పర్యాటకుల మూలంగా వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఒక పర్యాటక బృందంలోని వృద్ధ జంట కారణంగానే కొత్త కేసులు వ్యాప్తి చెందినట్టు అధికారులు భావిస్తున్నారు. గన్షు ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాలోని జియాన్కు వెళ్లడానికి ముందు ఆ పర్యాటక బృందం షాంఘైలో బయలుదేరినట్టు గుర్తించారు.
వెలుగు చూసిన కేసుల్లో కొత్త రకం కరోనా వైరస్ ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు భయపడి నియంత్రణ చర్యలు మొదలు పెట్టారు. తాజా కేసుల క్రమంలో ప్రధాన విమానాశ్రయాలైన జియాన్, లంఝౌ విమానాశ్రయం నుంచి దాదాపు 60 శాతం విమానాలు రద్దయ్యాయి.