చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం… చైనా, రష్యా సన్నాహాలు!!

Sharing is Caring...

Ravi Vanarasi ……………………

China, Russia take lead in space exploration ……………..

చైనా, రష్యా అంతరిక్ష రంగంలో, ముఖ్యంగా చంద్రుడి అన్వేషణలో ముందడుగు వేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ రెండు దేశాలు కలిసి చంద్రుడిపై ఒక లూనార్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే యత్నాల్లో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో లూనార్ స్టేషన్‌కు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరాయే కీలకం.  

ఈ సవాలును అధిగమించడానికి, చైనా, రష్యా చంద్రుడి ఉపరితలంపై ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం అంతర్జాతీయం గా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

చంద్రుడిపై మానవ ఉనికిని లేదా రోబోటిక్ కార్యకలాపాలను దీర్ఘకాలం పాటు కొనసాగించడంలో ప్రధాన అడ్డంకులలో ఒకటి శక్తి సరఫరా. చంద్రుడిపై పగలు సుమారు 14 భూమి రోజులు, రాత్రి కూడా సుమారు 14 భూమి రోజులు ఉంటుంది. సౌరశక్తి (సోలార్ పవర్) పగటిపూట ఎంతగానో ఉపయోగపడుతుంది, కానీ సుదీర్ఘమైన చంద్రుడి రాత్రులలో ఇది పనికిరాదు.

ఈ సమయంలో స్టేషన్ కార్యకలాపాలకు, పరిశోధనలకు నిరంతర విద్యుత్ అవసరం. అణు విద్యుత్ కేంద్రం ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపుతుంది. ఇది చంద్రుడి రాత్రులలో కూడా నిరంతరాయంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది.లూనార్ స్టేషన్‌కు అవసరమైన వెచ్చదనాన్ని, శక్తిని అందిస్తుంది. ఇది కేవలం బేస్ యొక్క మనుగడకే కాకుండా, అక్కడ జరిపే శాస్త్రీయ ప్రయోగాలు,వనరుల వెలికితీత,ఇతర కీలక కార్యకలాపాలకు కూడా అత్యంత ఆవశ్యకం.

ఈ లూనార్ రీసెర్చ్ స్టేషన్” (International Lunar Research Station – ILRS) ను చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం మంచు నీటి నిల్వలకు ప్రసిద్ధి చెందింది, ఇది భవిష్యత్ లూనార్ స్థావరాలకు అత్యంత విలువైన వనరు.

ILRS కేవలం ఈ రెండు దేశాల ప్రాజెక్టు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలను కూడా ఇందులో భాగస్వాములను  చేయాలని చైనా, రష్యా ఆకాంక్షిస్తున్నాయి. చైనా ఇప్పటికే “555 ప్రాజెక్టు” పేరుతో 50 దేశాలు, 500 అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధనా సంస్థలు,  5,000 మంది విదేశీ పరిశోధకులను ILRS లో చేరడానికి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే ఆలోచన రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉన్నప్పటికీ, ఇటీవల ఈ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు మరింత స్పష్టంగా వెలువడుతున్నాయి. రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ గతంలో 2035 నాటికి చంద్రుడి ఉపరితలంపై అణు రియాక్టర్‌ను నిర్మించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది.

చైనా ఇటీవల తన చాంగే-8 మిషన్ (Chang’e-8) ప్రణాళికలకు సంబంధించిన ఒక ప్రెజెంటేషన్‌లో ఈ అణు విద్యుత్ యూనిట్ ప్రస్తావన తీసుకువచ్చింది. చైనా ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.చైనా తన లూనార్ అన్వేషణ కార్యక్రమంలో భాగంగా 2030 నాటికి  చంద్రుడిపైకి  వ్యోమగాములను పంపాలని.,  శాశ్వత మానవ సహిత లూనార్ బేస్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2028 లో ప్రణాళిక చేయబడిన చాంగే-8 మిషన్ ఈ లూనార్ బేస్ నిర్మాణానికి పునాదులు వేస్తుందని భావిస్తున్నారు. ILRS  “బేసిక్ మోడల్” 2035 నాటికి సిద్ధం అవుతుందని చైనా, రష్యా భావిస్తున్నాయి. అణు విద్యుత్ కేంద్రం కూడా నిర్ణీత కాలంలో సిద్ధం కావచ్చని అంచనా వేస్తున్నారు. 

చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం అంటే మాటలు కాదు .. అనేక సంక్లిష్టమైన సాంకేతిక సవాళ్లు ఎదురవుతాయి. వాటి పరిష్కారానికి కూడా శాస్త్రజ్ఞులు సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలో అమెరికా ఏం చేయబోతున్నది మరో ఆర్టికల్ లో తెలుసుకుందాం

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!