Paresh Turlapati……………..
భారత దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన ప్రధానులుగా ఇందిరా గాంధీ.. నరేంద్ర మోడీ లు చరిత్ర సృష్టించారు ! అయితే ఈ చరిత్ర సృష్టించడం వెనుక ఇద్దరిలో కొన్ని వైరుధ్య, వ్యత్యాసాలు ఉన్నాయి.
ఇందిరా గాంధీ రాజకీయ ప్రయాణం ముళ్ళ బాట లో సాగితే, మోడీ రాజకీయ ప్రయాణం దాదాపు పూల బాటలో కొనసాగింది..అవేమిటో తెలుసుకునే ప్రయత్నమే ఈ విశ్లేషణ..
ఇందిరా గాంధి భారత ప్రధానిగా నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేస్తే మోడీ ఇప్పటికే మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు..అయితే మహిళా ప్రధానిగా ఇందిర రికార్డ్ ఇంతవరకు బద్దలు కాలేదు..ఇందిరా గాంధీ నేరుగా ప్రధాని కాలేదు.
లాల్ బహదూర్ శాస్త్రి గారి కేబినెట్ లో సమాచార ప్రసార మంత్రిగా తొలిసారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు..మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు చేసిన తర్వాతనే ప్రధాని అయ్యారు.అయితే ఇందిర ప్రధాని కావడానికి పార్టీలోనే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు..
ముఖ్యంగా అసమ్మతి నాయకుడిగా పేరు పడ్డ మొరార్జీ దేశాయ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఆఖరికి మొరార్జీ దేశాయ్ కి ఉప ప్రధాని పదవి ఇచ్చి రాజీ చేసుకోవాల్సి వచ్చింది.అయినా పార్టీలో అసమ్మతులు పెరిగి కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చి ఇందిరమ్మ ఇందిరా కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది.
మోడీకి ఈ కష్టాలు ఏవీ లేవు..ఈ విషయంలో మోడీ అదృష్టవంతుడు అనే చెప్పాలి…నిజానికి 2009 లో బీజేపీ తరఫున అద్వానీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించబడ్డాడు.మోడీని రాజకీయంగా పైకి తీసుకు రావడంలో అద్వానీ పాత్ర చాలా ఉంది..గుజరాత్ లో మోడీకి కీలక బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో మోడీని ఎన్నికల ఇన్చార్జి గా నియమించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చింది అద్వానీనే.
ఇందులో అద్వానీ స్వార్థం కూడా ఉంది..గుజరాత్ లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో మోడీ పాత్రను గుర్తించిన అద్వానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోడీని ఉపయోగించుకుని బీజేపీ కి ఎక్కువ స్థానాలు సంపాదించుకుని తద్వారా ప్రధాని కావాలని అద్వానీ ఆలోచన.
కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది.. దేశ రాజకీయాల్లో కూడా మోడీ దూసుకుపోయి బీజేపీ పెద్దల దృష్టిలో పడి అనూహ్యంగా ప్రధాని అభ్యర్థి అయ్యాడు..ఈ మార్పును అద్వానీ మనః స్ఫూర్తిగా అంగీకరించలేకపోయాడు..అయితే పార్టీ గెలుపు దృష్ట్యా తప్పదని సహచరులు నచ్చచెప్పడంతో అద్వానీ మౌనం వహించాల్సి వచ్చింది.
ఆ తర్వాత మోడీకి ఎదురు లేకపోయింది..మోడీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కూడా పార్టీలో ఎక్కడా అసమ్మతి లేకుండా మేనేజ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు..పార్టీకి మోడీ తప్ప మరో ఆల్టర్నేటివ్ లేదనే మోడీ మేనియా బీజెపీ లో క్రియేట్ అయ్యింది.అందుకు అనుగుణంగానే ఒంటి చేత్తో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా మూడు సార్లు ప్రధాని పదవి కూడా చేపట్టాడు.
ఇక మోడీని ధీటుగా ఎదుర్కొనే సరైన ప్రతిపక్షం.. నాయకత్వం లేకపోవడం కూడా మోడీకి కలిసొచ్చిన అంశం.ఇందిర మాత్రం పదవి చేపట్టిన తర్వాత ఇటు స్వపక్షంలోనూ అటు ప్రతిపక్షంలోనూ అనేక తలపొట్లు ఎదుర్కొంది.ఇరు పక్షాల కుట్రల వల్ల అధికారం కోల్పోవడమే కాదు జైలు పాలు కూడా అయ్యింది.
మోడీకి కూడా చిన్న ఇబ్బంది ఎదురైంది కానీ దాన్నుంచి విజయవంతంగా బయట పడ్డాడు.. గోద్రా అల్లర్ల వల్ల గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.. తిరిగి ప్రజా క్షేత్రం లో నిలబడి ముఖ్యమంత్రి కాగలిగాడు. మోడీ పై పెట్టిన కేసు కూడా వీగిపోయింది.
కేసు బూచి వల్ల ప్రధాని పదవి చేపట్టలేకపోయిన దురదృష్టవంతుడు అద్వానీ మాత్రమే..
ఇక ఇందిరా గాంధీ కి ఫ్యామిలీ పోరు కూడా ఇబ్బందులు పెట్టింది.. ఇటు కొడుకు సంజయ్ గాంధీ తోనూ అటు కోడలు మేనకా గాంధీతోనూ రాజకీయంగా ఇబ్బందులు పడింది..
అన్నిటికన్నా భర్త ఫిరోజ్ గాంధీ తో గొడవలు ఇందిరమ్మ ప్రతిష్టని దిగజార్చాయి.. ఆఖరికి భర్త ఫిరోజ్ గాంధీ తన తండ్రి నెహ్రూ పైనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగడంతో ఇందిర భర్తను ఎదిరించి తండ్రికే మద్దతు ఇచ్చింది.
మోడీకి ఈ గొడవలు లేవు… తల్లి.. భార్య..ముగ్గురు సోదరులు..ఒక సోదరి ఉన్నారు కానీ ఎవరి జీవితాలు వాళ్లవే ( తల్లి 2022 లో మరణించింది)మొండి తనంలోనూ.. నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడంలోనూ ఇందిర మోడీ కంటే రెండాకులు ఎక్కువే చదివింది.. ఆ మొండి తనమే ఇందిరకు అనేక సందర్భాలలో తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
ఈ విషయంలో మోడీ కొంచెం కూల్ గా ఉంటారు.. ఒకప్పుడు ఇండియా అంటే ఇందిర.. ఇందిర అంటే ఇండియా అని కాంగ్రెస్ నాయకులు స్లోగన్లు ఇచ్చారు.. ఇప్పుడు బీజేపీ అంటే మోడీ… మోడీ అంటే బీజేపీ అని ఆఫ్ ది రికార్డు లో బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు..
ఇందిరమ్మ.. మోడీలు ఇద్దరూ పార్టీలో శక్తివంతమైన నాయకత్వ పాత్ర పోషించారు.. కాకపోతే ఇందిర కష్టాలు మోడీకి లేవు.
బ్యాంకుల జాతీయకరణ.. జమిందారీ వ్యవస్థ రద్దు వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పార్టీలోనూ బయటా రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు ఇందిరమ్మ..పెద్దనోట్ల రద్దు మినహా సంచలనాత్మకమైన నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు కాబట్టి పెద్దగా వివాదాస్పదం కాకుండానే నెట్టుకొస్తున్నాడు మోడీ..
ఒకటి మాత్రం నిజం .. నాయకత్వ సామర్థ్యంతోనే మోడీ మూడు సార్లు ప్రధాని పదవి చెప్పట్టగలిగారు.. ఇంకోటి కూడా నిజం.. సరైన ప్రతిపక్షం.. సరైన నాయకత్వం లేకపోవడం మోడీకి కలిసొచ్చిన అంశం.