Subramanyam Dogiparthi ………………..
సామాజిక విప్లవ చిత్రం. కె విశ్వనాథ్ కళా తపస్వి మాత్రమే కాదు. సామాజిక తపస్వి కూడా . Social saint . 1972 లో వచ్చిన ఈ ‘కాలం మారింది’ సినిమా సామాజిక దురాచారమయిన అంటరానితనానికి వ్యతిరేకంగా తీశారు. ఇంత కన్నా గొప్పగా పామరుడికి కూడా అర్ధమయ్యేలా 1981 లో ఆయనే ‘సప్తపది’ సినిమాను అందించారు.
సామాజిక స్పృహలో మన తెలుగు వారు చాలా గొప్పవారు . 1938 లో గూడవల్లి రామబ్రహ్మం గారి ‘మాల పిల్ల’ , 1959 లో పి పుల్లయ్య గారి ‘జయభేరి’ , 1968 లో కె బి తిలక్ ‘పంతాలు పట్టింపులు’ , 1975 లో దాసరి నారాయణరావు ‘బలిపీఠం’ వంటి సినిమాలు ఎన్నో వచ్చాయి.
ఇక ఈ సినిమా విషయం కొస్తే … ఆనాటి దురాచారం అస్పృశ్యతను ఎండగడుతూ మనుషులు అందరూ ఒకటే అనే సందేశాన్ని కె విశ్వనాథ్ చాలా చక్కగా , సున్నితంగా తెర కెక్కించారు.పాలేరు బిడ్డను స్వంత బిడ్డగా పెంచే తండ్రిగా గుమ్మడి పాత్ర , ఆయన నటన హృదయాలను తాకుతుంది. తనకు పూర్తిగా ఇష్టం లేకపోయినా .. భర్తను అనుసరించే ఆదర్శ భార్యగా అంజలీదేవి పాత్ర , నటన అద్భుతం.
ఆ తర్వాత చెప్పుకోవలసింది శారద. శోభన్ బాబు-శారదలు ఇలాంటి సందేశం ఉన్న సినిమా మరొక దాంట్లో కూడా నటించారు. అదే దాసరి వారి ‘బలిపీఠం’.. కాలం మారింది సినిమాలో శారద అంటరాని కులంలో జన్మిస్తే , బలిపీఠంలో ఆ పాత్రలో శోభన్ బాబు నటించారు . ఈ సినిమాలో ప్రతీ పాత్రను ఆచితూచి తీర్చిదిద్దారు విశ్వనాథ్.
యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు కూడా హిట్టయ్యాయి . బాగా హిట్టయిన పాట ‘ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే ‘పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది. ‘ఏ తల్లి పాడేను జోల ఏ తల్లి ఊపేను డోల’ పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది. చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది.మరో సందేశాత్మక పాట . ‘నిజం తెలుసుకోండి ఓ యువకుల్లారా ఓ యువతుల్లారా’ పాట కూడా.
ఛాందసురాలయిన సూర్య కాంతానికి ప్రమాదం జరగటం , రక్తం పోవటం , ఎవరి రక్తమూ సరిపోకపోవటం , ఒక్క శారద రక్తమే సరిపోవటం , సూర్యకాంతంలో పరివర్తన రావటం విశ్వనాథ్ గొప్పగా చూపారు.
సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన పాత్ర గుమ్మడిది.మానవత్వం, ప్రేమ , తాను నమ్మిన సర్వ మానవ సమానత్వ భావం మీద పట్టుదల వంటి సున్నితమైన భావాలను గుమ్మడి బాగా చూపారు. ఇతర పాత్రల్లో సాక్షి రంగారావు , పుష్పకుమారి , చంద్రమోహన్ , గీతాంజలి ,నిర్మలమ్మ ,రావు గోపాలరావు అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు.
దేవదాస్ కనకాల అరంగేట్రం ఈ సినిమా ద్వారానే జరిగింది. 1972 వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా ‘బంగారు నంది’ అవార్డు ను పొందింది ఈ సినిమా.ఇలాంటి సినిమాలను ప్రతీ స్కూల్లో ప్రదర్శించాలి. దురదృష్టం ఏమిటంటే యాభై ఏళ్ళ తర్వాత కూడా కాలం మారకపోవటం . శారీరకంగా అంటరానితనం పోయి ఉండవచ్చు , మానసికంగా ఎక్కువయింది . చట్టాలతో పాటు బుర్రల్ని కూడా రిపేర్ చేయాలంటే చిన్న వయసు నుండే మానసిక పరివర్తన అవసరం.
ఈ గొప్ప సందేశాత్మక చిత్రాన్ని మహాత్మాగాంధీకి అర్పించారు విశ్వనాధ్ .సినిమా టైటిల్లో కూడా మహాత్ముని చిత్రం ఉంటుంది . సినిమాలో చాలా చోట్ల మహాత్ముని సందేశాలను , ఆశయాలను ప్రస్తావిస్తారు. యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి .