విశ్వనాధ్ సందేశాత్మక చిత్రం !

Sharing is Caring...

Subramanyam Dogiparthi ………………..

సామాజిక విప్లవ చిత్రం.  కె విశ్వనాథ్ కళా తపస్వి మాత్రమే కాదు . సామాజిక తపస్వి కూడా . Social saint . 1972 లో వచ్చిన ఈ కాలం మారింది సినిమా సామాజిక దురాచారమయిన అంటరానితనానికి వ్యతిరేకంగా తీశారు. ఇంత కన్నా గొప్పగా పామరుడికి కూడా అర్ధమయ్యేలా 1981 లో ఆయనే సప్తపది సినిమాను అందించారు. 

సామాజిక స్పృహలో మన తెలుగు వారు చాలా గొప్పవారు . 1938 లో గూడవల్లి రామబ్రహ్మం గారి మాల పిల్ల , 1959 లో పి పుల్లయ్య గారి జయభేరి , 1968 లో కె బి తిలక్ పంతాలు పట్టింపులు , 1975 లో దాసరి నారాయణరావు బలిపీఠం వంటి సినిమాలు ఎన్నో వచ్చాయి.

ఇక ఈ సినిమా విషయం కొస్తే … ఆనాటి దురాచారం అస్పృశ్యతను ఎండగడుతూ మనుషులు అందరూ ఒకటే అనే సందేశాన్ని కె విశ్వనాథ్ చాలా చక్కగా , సున్నితంగా, సునిశితంగా తెర కెక్కించారు. పాలేరు బిడ్డను స్వంత బిడ్డగా పెంచే తండ్రిగా గుమ్మడి పాత్ర , ఆయన నటన హృదయాలను తాకుతుంది . తనకు పూర్తిగా ఇష్టం లేకపోయినా .. భర్తను అనుసరించే ఆదర్శ భార్యగా అంజలీదేవి పాత్ర , నటన అద్భుతం. 

ఆ తర్వాత చెప్పుకోవలసింది శారద. శోభన్ బాబు-శారదలు ఇలాంటి సందేశం ఉన్న సినిమా మరొక దాంట్లో కూడా నటించారు. అదే దాసరి వారి బలిపీఠం.. కాలం మారింది సినిమాలో శారద అంటరాని కులంలో జన్మిస్తే , బలిపీఠంలో ఆ పాత్రలో శోభన్ బాబు నటించారు . ఈ సినిమాలో ప్రతీ పాత్రను ఆచితూచి తీర్చిదిద్దారు విశ్వనాథ్.  

యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు కూడా హిట్టయ్యాయి . బాగా హిట్టయిన పాట ‘ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే ‘పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఏ తల్లి పాడేను జోల ఏ తల్లి ఊపేను డోల పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది . చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది . మరో సందేశాత్మక పాట . నిజం తెలుసుకోండి ఓ యువకుల్లారా ఓ యువతుల్లారా పాట కూడా. 

ఛాందసురాలయిన సూర్య కాంతానికి ప్రమాదం జరగటం , రక్తం పోవటం , ఎవరి రక్తమూ సరిపోకపోవటం , ఒక్క శారద రక్తమే సరిపోవటం , సూర్యకాంతంలో పరివర్తన రావటం విశ్వనాథ్ గొప్పగా చూపారు . సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన పాత్ర గుమ్మడిది . మానవత్వం , ప్రేమ , తాను నమ్మిన సర్వ మానవ సమానత్వ భావం మీద పట్టుదల వంటి సున్నితమైన భావాలను గుమ్మడి బాగా చూపుతారు.  

ఇతర పాత్రల్లో సాక్షి రంగారావు , పుష్పకుమారి , చంద్రమోహన్ , గీతాంజలి ,నిర్మలమ్మ ,రావు గోపాలరావు అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు . దేవదాస్ కనకాల అరంగేట్రం ఈ సినిమా ద్వారానే . 1972 వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు ను పొందింది ఈ సినిమా .

ఎంత సందేశాత్మక చిత్రం అంటే ఇలాంటి సినిమాలను ప్రతీ స్కూల్లో ప్రదర్శించాలి . దురదృష్టం ఏమిటంటే యాభై ఏళ్ళ తర్వాత కూడా కాలం మారకపోవటం . శారీరకంగా అంటరానితనం పోయి ఉండవచ్చు , మానసికంగా ఎక్కువయింది . చట్టాలతో పాటు బుర్రల్ని కూడా రిపేర్ చేయాలంటే చిన్న వయసు నుండే మానసిక పరివర్తన అవసరం. 

ఈ గొప్ప సందేశాత్మక చిత్రాన్ని మహాత్మాగాంధీకి అర్పించారు విశ్వనాధ్ .సినిమా టైటిల్లో కూడా మహాత్ముని చిత్రం ఉంటుంది . సినిమాలో చాలా చోట్ల మహాత్ముని సందేశాలను , ఆశయాలను ప్రస్తావిస్తారు . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . టి విలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!