Enjoy the trekking experience…………………………
నల్లమల అడవుల అందాలు తిలకించేందుకు ఎందరో పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పటికే జంగిల్ సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న అటవీ శాఖ.. ఇపుడు తుమ్మలబైలు వద్ద పర్వతారోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది.
తుమ్మలబైలు వద్దనున్న వీర్లకొండ ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశంగా ప్రభుత్వం గుర్తించింది. అటవీ శాఖ ఇప్పటికే కొండ శిఖరంపై వాచ్ టవర్ ఏర్పాటు చేసింది. ట్రెక్కింగ్ చేయడం పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం వీర్లకొండ వద్ద ట్రెక్కింగ్ పాయింట్ ఏర్పాటు చేసింది. టెక్కింగ్ చేసే పర్యాటకుల కోసం స్థానిక గిరిజనులను గైడ్లుగా నియమించ బోతున్నారు.
దీనివలన గిరిజనులకు కొంత ఉపాధి లభిస్తుంది. వీర్లకొండ పరిసర ప్రాంతాలను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. అక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు, వన్యప్రాణుల సంచారం, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన దరిమిలా అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రెక్కింగ్ కు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
పర్వతారోహణకి అనువుగా వీర్లకొండ పైకి నడిచి వెళ్లేందుకు కాలి బాట మార్గాన్ని ఏర్పాటు చేయటంలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. నడక దారిలో అడ్డంగా ఉన్న చెట్లకు ఏమాత్రం నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయటంతో పాటు, దట్టంగా ఉన్న గడ్డి పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో తుమ్మలబైలు గిరిజన గూడేనికి 2 కిలోమీటర్లు ముందుగానే వీర్లకొండ వస్తుంది. శ్రీశైలం ప్రధాన రహదారిలోనే వీర్లకొండ ఉండటం వల్ల యాత్రికులు, పర్యాటకులు నడవాల్సిన అవసరం లేకుండా వారి వాహనాలను అక్కడే పార్కింగ్ చేసుకోవటానికి వీలుంటుంది.
ప్రధాన రహదారి నుంచి కొండపైకి ఎక్కేందుకు 500 మీటర్లు, కొండ దిగేందుకు 500 మీటర్లు మొత్తంగా ఒక 1 కిలో మీటరు మేర ట్రెక్కింగ్ చేయాలి.. ట్రెక్కింగ్ కు సంబంధించి ఒక్కొక్కరికి రూ.300 మేర రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
కొంత మంది గిరిజన యువకులకు శిక్షణ ఇచ్చి వారిని గైడ్లు గా నియమించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రెక్కింగ్ కు వెళ్లే ఒక్కో పర్యాటకుడితో పాటు ఒక్కో గైడు వారి వెంట ఉంటారు. ట్రెక్కింగ్ కు వెళ్లే వారిని జాగ్రత్తగా తీసుకెళ్లటంతో పాటు, నల్లమల అడవుల విశిష్టతను తెలియజేయటం, వారి రక్షణ పట్ల జాగ్రత్తలు తీసుకుని వారిని మళ్లీ తిరిగి కిందికి తీసుకురావటం గైడ్లు చూసుకుంటారు.
అటవీశాఖ వసూలు చేసే రూ. 300 రుసుములో రూ.200 గైడ్లకే ఇస్తారు. ప్రతి యువకుడికి రోజుకు రెండు పర్యాయాలు మాత్రమే అవకాశం కల్పిస్తారు. దీని వల్ల ఎక్కువ మంది యువకులకు గైడ్ గా వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆహార, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తే మరొక సందర్శనీయ ప్రాంతంగా వీర్లకొండ మారుతుంది. త్వరలో ఈ ట్రెక్కింగ్ కార్యక్రమం అధికారికంగా మొదలు కానుంది.