శ్రావణ మాసమంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ .. ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు నదీ స్నానాలు,సముద్ర స్నానాలు చేస్తారు. శివాలయం, విష్ణాలయం, లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్లి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకొంటారు.
శ్రావణ పౌర్ణమిని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. వివిధ ప్రాంతాల్లో ఈ పండగను విభిన్న రీతిలో జరుపుకుంటారు.
మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలోని సముద్ర తీర ప్రాంతాల్లోని మత్య్సకారులు శ్రావణ పౌర్ణమి ని నారికేళ పౌర్ణమి పేరిట జరుపుకుంటారు.నారికేళ పూర్ణిమనే నరలి పూర్ణిమ, నారియల్ పూర్ణిమ అని కూడా అంటారు. పౌర్ణమి రోజున మత్య్సకారులు ఈ పండగని జరుపుకుంటారు. ప్రత్యేకంగా సముద్రుడిని,వరుణ దేవుడిని పూజిస్తారు.
సముద్రం నుంచి తమకు, తమ ప్రాంతానికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడాలని సముద్రుడిని, శివుడిని కోరుకుంటారు. కొబ్బరి కాయకు పూజ చేసి కడలిలో వదులుతారు. బతుకుతెరువు కల్పించే ప్రకృతి తల్లికి మొక్కుకునే పండగగా చేసుకుంటారు. మత్య్సకారులు సముద్రం ఒడ్డున సముద్రునికి కొబ్బరికాయలు సమర్పిస్తారు.
పూజ తర్వాత అందంగా అలంకరించిన పడవలపై సముద్రంలోకి వెళ్లి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత మత్యకారులు కుటుంబాలతో కలసి పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఆ రోజంతా కొబ్బరితో తయారుచేసిన వంటకాలను మాత్రమే తింటారు. కొబ్బరి కాయకు కూడా శివుని మాదిరిగానే మూడు కళ్లుంటాయి. అందుకే కొన్నిప్రాంతాల్లో నారికేళ పూర్ణిమ నాడు శివుడిని పూజిస్తారు.
మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రావణ పూర్ణిమనే కజరీ పూర్ణిమ పేరిట జరుపుకొంటారు. దీన్నే కజలి పూర్ణిమ, కజ్లి పూర్ణిమ అని కూడా పిలుస్తుంటారు. కజరీ అంటే గోధుమలు అని అర్థం. పంట దిగుబడి బాగా వచ్చేలా దీవించమని భగవతీ మాతను రైతులు పూజిస్తారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాల వారు పండుగను చేసుకుంటారు.
శ్రావణ శుక్ల నవమి రోజున మహిళలు పొలాలకు వెళ్లి కుండలో ఆకులు, మట్టి నింపి తీసుకు వస్తారు. పూజగదిని ఆవుపేడతో అలికి, గోధుమ పిండితో ముగ్గులు వేసి కుండను ఉంచుతారు. మట్టిలో ఉన్న ఆకులకు పసుపు, కుంకుమ పూసి దీపారాధన చేస్తారు. ఇలా నవమి నుంచి పౌర్ణమి వరకు ఏడు రోజుల పాటు పూజలు చేస్తారు.
చివరి రోజైన శ్రావణ పౌర్ణమి రోజు సాయంత్రం పూజ చేసి… ఆ మట్టికుండను తలపై పెట్టుకొని సమీపంలో ఉన్న నదిలో కానీ, చెరువులో కానీ వదులుతారు. తర్వాత భగవతీ దేవికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల భగవతీ దేవి ఆశీస్సులతో పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారు.
శ్రావణ పౌర్ణిమను గుజరాతీలు పవిత్రోపానగా పిలుచుకుంటారు. శివుడిని పూజించి ఆయన ఆశీస్సులు పొందుతారు. శివాలయాలు, వైష్ణవాలయాలన్నింటినీ వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తారు. మహాదేవునికి పాలు, కొబ్బరి నీరు, పెరుగు, తేనె, నీటిని సమర్పిస్తారు. ఈ పౌర్ణమి రోజు ముక్కంటిని కొలిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. పవిత్ర అమర్నాథ్ యాత్ర కూడా ఈ పొర్ణమి నాడే ముగుస్తుంది.