Operation Sindhoor……………………..
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల స్థావరాల విషయాలను పరిశీలిస్తే చాలా విశేషాలే ఉన్నాయి. పాకిస్తాన్ లోను,ఆక్రమిత కాశ్మీర్ లోను ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారని అర్థమౌతోంది.భారత్ ను అస్థిరపరిచే లక్ష్యం తో పాక్ ఉగ్రవాదులు శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ శిక్షణా కేంద్రాలు అన్ని ఇండియా సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషం. వందల ఎకరాల్లో ఈ శిక్షణా కేంద్రాలు ఉన్నాయంటే ఆశర్యమేస్తుంది.
వీటి సమాచారం సేకరించి పక్కా ప్రణాళికతో ఉగ్రవాదుల స్థావరాలు పై త్రివిధ దళ సభ్యులు సమన్వయం తో దాడులు చేశారు. కేవలం ఇరవై అయిదు నిమిషాల వ్యవధిలోనే ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించడడం గొప్పవిషయం. పూర్తిగా మన గగన తలం నుంచే అత్యాధునిక టెక్నాలజీ తో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేయడం.. పాక్ కలలో కూడా ఊహించని విషయం.
తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. నియామక కేంద్రాలు, బోధనా కేంద్రాలు, లాంచ్ ప్యాడ్లు వంటి ఉగ్రవాద మౌలిక సదుపాయాలు పాకిస్తాన్, పిఓకెలో ఉన్నాయి.ఈ దాడుల్లో అన్నిధ్వంసమైనాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదుల స్థావరాలు……..
1. ముజఫరాబాద్లోని సవాయి నాలా శిబిరం- ఇది లష్కరే తోయిబాకు శిక్షణా కేంద్రం. అక్టోబర్ 20, 2024న సోన్మార్గ్లో దాడి, అక్టోబర్ 24, 2024న గుల్మార్గ్లో దాడి, ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లో దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరూ ఇక్కడ శిక్షణ పొందారు.
2. ముజఫరాబాద్లోని సయ్యద్నా బిలాల్ శిబిరం- ఇది జైష్-ఎ-మొహమ్మద్ స్టేజింగ్ ప్రాంతం. ఇది ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అడవి మనుగడ శిక్షణా కేంద్రం కూడా.
3. కోట్లీలోని గుల్పూర్ శిబిరం – ఇది జమ్మూలోని రాజౌరి, పూంచ్ ప్రాంతాలలో చురుకుగా ఉన్న లష్కరే తోయిబా బేస్ క్యాంప్. ఏప్రిల్ 20, 2023, జూన్ 9, 2024న పూంచ్లో దాడులు చేసిన ఉగ్ర వాదులు ఇక్కడ శిక్షణ పొందారు
4.భీంబర్లోని బర్నాలా శిబిరం- ఇది ఆయుధాల నిర్వహణ,పేలుడు పదార్థాలు, అడవి మనుగడ శిక్షణా కేంద్రం కూడా.
5. కోట్లిలోని అబ్బాస్ శిబిరం- లష్కర్ తోయిబా కి చెందిన శిక్షణా కేంద్రం. 15 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలు………
1.సియాల్కోట్లోని సర్జల్ క్యాంప్ – మార్చి 2025లో నలుగురు జమ్మూ & కాశ్మీర్ పోలీసు సిబ్బందిని చంపిన ఉగ్రవాదులు ఈ క్యాంప్లో శిక్షణ పొందారు.
2.సియాల్కోట్లోని మెహమూనా జోయా క్యాంప్ – పఠాన్కోట్ వైమానిక దళ బేస్ క్యాంప్ దాడికి ప్రణాళిక వేసి ఈ ఉగ్రవాద శిబిరం నుండే అమలు చేశారు.
3. మురిడ్కేలోని మర్కజ్ తైబా క్యాంప్ – 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ ఇక్కడ శిక్షణ పొందారు.
4. బహవల్పూర్లోని మర్కజ్ సుభానల్లా- ఇది జైష్-ఎ-ముహమ్మద్ ప్రధాన కార్యాలయం. ఇక్కడ నియామకాలు, శిక్షణ, బోధనలు జరుగుతాయి. మసూద్ అజర్ స్థావరం కూడా ఇదే. ఇక్కడ అతనికి రెండు ఇండ్లు ఉన్నాయి.ఈ దాడుల్లో తప్పించుకున్నాడు. పౌర మౌలిక సదుపాయాలకు నష్టం జరగకుండా, పౌర ప్రాణనష్టం జరగకుండా ఉండటానికి ఈ ప్రదేశాలను ఎంపిక చేశారు.
2016 సర్జికల్ స్ట్రైక్స్,2019 బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్,పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం చేసిన మూడవ వైమానిక దాడులు ఇవి.జెఎం ఉగ్రవాదులు 19 మంది సైనికులను బలిగొన్న ఉరి ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి.
పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ ప్రతీకారంగా జరిగింది.ఈ దాడులతో ఉగ్రవాదం పూర్తిగా అంతమైందని అనుకోలేం. పాకిస్తాన్ నేతల, ప్రభుత్వ సహకారం ఉన్నంతవరకు అది కొనసాగవచ్చు.