పాక్ లో ‘చైనా’ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కథేమిటి ?

Sharing is Caring...

China project in Pakistan …………………………

‘గ్వాదర్ పోర్ట్’ నైరుతి పాకిస్థాన్‌లో, అరేబియా సముద్రం ఒడ్డున, ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్‌లో ఉంది. ఈ ఓడరేవును చైనా ఆధునిక సదుపాయాలతో నిర్మించింది.పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు చైనాకు ఈ ఓడరేవు ఎంతో కీలకమైనది.

ఇక్కడ నుంచి చైనా భూభాగంలోకి ప్రవేశించే China-Pakistan Economic Corridor (CPEC) నిర్మాణం జరుగుతోంది. ఈ కారిడార్ లో భాగంగా రోడ్ ,రైల్ మార్గాలను కూడా నిర్మిస్తున్నారు.  చైనా ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్ కంపెనీ (COPHC) ఈ ఓడరేవు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.

అంతకు ముందు ఈ పోర్ట్‌ను పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ నిర్వహించేది.గ్వాదర్ పోర్టు ద్వారా వచ్చే ఆదాయంలో చైనా వాటా 91% కాగా, పాకిస్తాన్ వాటా 9% ఉంటుంది.పాకిస్థాన్ లోని  మొట్టమొదటి లోతైన ఓడరేవు ఇది. చైనా మే 16, 2013 న గ్వాదర్ పోర్టు నియంత్రణను తన చేతుల్లోకి తీసుకుంది.

మొదట్లో ఈ ప్రాజెక్టు విలువ $46 బిలియన్లు, CPEC ప్రాజెక్టుల విలువ 2020 నాటికి $62 బిలియన్లు.2022 నాటికి పాకిస్తాన్‌లో చైనా పెట్టుబడి $65 బిలియన్లకుపెరిగింది.ప్రస్తుతం $100 బిలియన్లకు చేరువలో ఉంది. చైనా వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. గ్వాదర్ ఓడరేవు 2016 నవంబర్ 14 నుంచి  అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. 

నాటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ నవాజ్ షరీఫ్ దీన్ని ప్రారంభించారు. 174 సంవత్సరాల ఒమానీ పాలన తర్వాత, గ్వాదర్ అధికారికంగా 8 డిసెంబర్ 1958న పాకిస్తాన్‌లో భాగమైంది.అదేసమయంలో ఈ పోర్ట్ ను ఇండియాకు ఇస్తామని ఒమానీ అనగా నాడు ప్రధాని నెహ్రు వద్దని అన్నారట.

పాకిస్తాన్ చేతిలోకి వచ్చినా పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. అరేబియా సముద్రంలో, హోర్ముజ్ జలసంధికి  దగ్గరలో ఉన్న ఈ పోర్ట్ ద్వారా ప్రపంచ చమురు వాణిజ్యం 20 శాతం వరకు జరుగుతుంది. ప్రపంచ సముద్ర వాణిజ్య మార్గాలకు ఈ పోర్ట్ కనెక్ట్ అయి ఉండటం విశేషం.

ఎగుమతులు, దిగుమతులకు కరాచీపోర్ట్, పోర్ట్ ఖాసిమ్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మధ్య ఆసియా, మధ్య ప్రాచ్య వాణిజ్యానికి గేట్ వే గా పనిచేస్తుంది. ఇక గ్వాదర్ విమానాశ్రయం UAE, యూరప్, ఫార్ ఈస్ట్, మధ్య ఆసియా, ఆఫ్రికా వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలతో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

తద్వారా వాణిజ్యం, పర్యాటకంపెరుగుతాయి. స్థానిక వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందిస్తాయి. ఓడరేవుకి సమీపంలోనే విమానాశ్రయం ఉండటం విశేషం. విమానాశ్రయ నిర్మాణానికి చైనా $230 మిలియన్ల గ్రాంట్‌తో నిధులు సమకూరుస్తోంది.చైనా ఇపుడు దీన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నది.

గ్వాదర్ ఫ్రీ జోన్‌ పూర్తిగా కార్యాచరణలోకి వచ్చిన తర్వాత గ్వాదర్ పోర్టు వార్షికంగా  $10 బిలియన్లను ఆర్జించగలదని అంచనా. ఈప్రాజెక్టు తమకు ఇచ్చినందుకు గాను చైనా పాకిస్తాన్ కి రుణ సహాయం చేసినట్టు చెబుతారు.

ఇక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కనుక ఈ ఓడరేవును ఆధీనంలోకి తీసుకుంటే  పాకిస్తాన్ తో సహా చైనాకు కూడా ఎదురు దెబ్బ తగలడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. అయితే  చైనా బలూచిస్తాన్ వాసులకు ఉద్యోగ హామీలిచ్చి మేనేజ్ చేయగలదని కూడా అంటున్నారు.

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాక్ పై దాడులు చేస్తున్నపుడు  చైనా అధ్యక్షుడు  జిన్ పింగ్  ప్రధాని మోడీ కి ఫోన్ చేసి తమ ప్రాజెక్టు జోలికి రావద్దని అభ్యర్ధించారని అంటారు. ఇందులో నిజమెంతో తెలీదు. 

——-KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!