Glorious lake …………………..
మానస సరోవరం.. టిబెట్ లో కైలాస పర్వతం దగ్గర ఉన్న ఒక పవిత్రమైన సరస్సు. హిందూ, బౌద్ధ, జైన, బాన్ మతాల వారు దీన్ని మహిమాన్వితమైన సరస్సుగా భావిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచినీటి సరస్సు. ఈ సరస్సులో నీరు చాలా స్వచ్ఛమైనదని నమ్ముతారు. ఈ సరస్సులో స్నానం చేసినా .. నీరు త్రాగినా సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
పురాణాల్లో పాండవులు మానస సరోవరం వెళ్లినట్లు ప్రస్తావన కూడా ఉంది. తన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, సీత మానస సరోవరం ద్వారా స్వర్గానికి చేరుకుందని కూడా నమ్ముతారు. కైలాస మానస సరోవరం శివుని ప్రత్యక్షంగా చూసే పవిత్ర ప్రదేశమని భక్తులు నమ్ముతారు. శివుడిని ఎక్కువగా శివలింగ రూపంలో పూజిస్తారు.
మానస సరోవరంలో అయితే పర్వత రూపంలో పూజిస్తారు. సరోవరం నీటిలో కైలాస్ పర్వతం కనిపిస్తుంది. ఆ ఆకృతిని చూస్తూ శివుడిని మనసులో తలచుకుని పూజిస్తారు.శివుని అనుగ్రహం వల్ల సరస్సు నీటిమట్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని కూడా నమ్ముతారు. ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.33 కోట్ల మంది దేవతలు, దేవతలు ఈ సరస్సు లో స్నానం చేస్తారని నమ్ముతారు. అందుకనే సరస్సులోని నీరు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అంతేకాదు ప్రతి గంటకు సరస్సు లోని నీటి రంగు మారుతుంది.
జైన తీర్థం కరుడైన వృషభ దేవుడు ఈ సరోవరం పరిసరాలలో నిర్యాణం చెందాడని చెబుతారు. ప్రపంచ దేశాల నుంచి ప్రతి సంవత్సరం వేల మంది యాత్రికులు పర్యాటకులు కైలాస మానస సరోవర సందర్శనకు వస్తూ ఉంటారు. ఈ మానస సరోవరానికి పడమట దిక్కున రాక్షస తాల్ ఉంటుంది. అంటే ఇది ఉప్పునీటి సరస్సు. ఈ రాక్షస సరస్సు ను రావణాసురుడు సృష్టించాడని అంటారు.
శివుని ఆత్మలింగాన్ని పొందడం కోసం రావణాసురుడు తపస్సు చేసి తన పది తలలను ఖండించుకోగా ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ప్రసాదించాడని పురాణ కథనం. ఆ ప్రదేశమే ఈ రాక్షస తాల్. మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14,900 అడుగుల ఎత్తులో ఉంది.
ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 55 మైళ్ళు ఉంటుంది. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.కొంతమంది భక్తులు ఈ సరోవరంలో స్నానమాచరించి కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు.
ముందుగా మానస సరోవరం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. ఇదివరకైతే కాలినడకన ప్రదక్షిణ చేసేవారు. ఇపుడు ఏసీ బస్సుల్లో కూర్చొని ప్రదక్షిణ చేయవచ్చు. సుమారు మూడు గంటలు పడుతుంది. ఈ ప్రదక్షిణ తర్వాత కైలాష్ పరిక్రమ మొదలవుతుంది.
రాత్రిపూట, బ్రహ్మ ముహూర్తం సమయంలో మానసరోవర్ సరస్సు దగ్గర ఉండటానికి అనుమతి ఉంది.తాత్కాలిక శిబిరాల్లో ఉండొచ్చు. ఇక్కడి వాతావరణం పగటిపూట కంటే రాత్రివేళ కొంచెం చల్లగా ఉంటుంది. వేగంగా గాలులు వీస్తుంటాయి.
వేడిని అందించే దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. అక్కడ రాత్రివేళలో ఒంటరిగా తిరగడం క్షేమం కాదు. ఆరోగ్యం అనుమతిస్తే మానసరోవర్ సరస్సులో స్నానం చేయవచ్చు. ట్రావెల్ ఏజెన్సీ గైడ్ చెప్పిన ప్రకారం నడుచుకోవడం మంచిది.