Subramanyam Dogiparthi …………………….
‘ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు’ అంటూ పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట ద్వారా పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమా రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత విశ్వేశ్వరరావు వ్రాసారట.
సి యస్ రావు దర్శకత్వంలో NTR మొదటి పూర్తి రంగుల సాంఘిక చిత్రం 1973 లో రిలీజయిన ఈ దేశోధ్ధారకులు సినిమా. సినిమా సూపర్ హిట్. 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. కడపలో 210 రోజులు ఆడింది . ఇలాంటి కధాంశంతో NTR చాలా సినిమాలే చేసారు.
దేశద్రోహులు , కధానాయకుడు , వగైరా . అయితే ఈ సినిమా కలర్ సినిమా కావటం, కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో హిట్ సాంగ్స్… మోదుకూరి జాన్సన్ – మహారధిల మాటల తూటాలు చిత్రం ఘన విజయానికి కారణాలయ్యాయి.
ఆత్రేయ విరచిత ‘ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు’ అనే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది. నటి శుభ మీద చిత్రీకరించారు. ‘ఇది కాదు మా సంస్కృతి.. ఇది కాదు మా ప్రగతి’, ‘మబ్బులు రెండూ భేటీ అయితే మెరుపే వస్తుంది’ , ‘కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు’ పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ‘స్వాగతం దొరా సుస్వాగతం తేనె లాంటి పిలుపువున్న తెలుగు నేలకు’ అన్నపూర్ణను మించిన ఆంధ్రభూమికి’ అనే వాణిశ్రీ గ్రూప్ డాన్స్ బాగుంటుంది.
పాపం సావిత్రి ! మహానటి !!! తెలుగు చలనచిత్ర రంగాన్ని శాసించిన సావిత్రి ఎలాంటి ప్రాధాన్యత లేని వదిన పాత్రలో , ఏవో కొన్ని సీనుల్లో కనపడే పాత్ర వేయటం బాధ కలుగుతుంది.అందరినీ నమ్మి మోసపోయి, నిస్పృహతో తన జీవితాన్నే తాను నాశనం చేసుకున్న అభాగ్యురాలు. కొందరి జీవితాలు అలాగే ముగుస్తుంటాయి.
నాగభూషణం , ప్రభాకరరెడ్డి , మిక్కిలినేని , ధూళిపాళ , నాగయ్య , రాజనాల , సత్యనారాయణ , రావు గోపాలరావు , రాజసులోచన , పద్మా ఖన్నా ప్రభృతులు నటించారు . By the way , ఈ సినిమాలో NTR సిబిఐ ఆఫీసర్ . ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా NTR కు మారు వేషాలు ఉంటాయి . లేకపోతే జనానికి ఎక్కదు .
కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో ఓ నాలుగయిదు సార్లు చూసి ఉంటా . వెంకటేశ్వర పిక్చర్ పేలసులో ఆడినట్లు గుర్తు . టివిలో కూడా చాలాసార్లు వచ్చింది . An excellent entertaining , musical hit movie . ఈతరం వారిలో చూడని వారుంటే వాచ్ లిస్టులో వేసేసుకోవచ్చు . యూట్యూబులో ఉంది.
———-
tharjani ……………
అప్పట్లో భారీ బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. అంత రిచ్ గా తీసున్న వైనం గమనించి ఎన్టీఆర్ నిర్మాత విశ్వేశ్వరావు తో ‘ఇంత ఖర్చు అవసరమా’ అన్నారట. ఆయన నవ్వుతూ ‘ఖర్చు సంగతి నాకొదిలేయండి.. ఈ సినిమా కు భారీ హంగులు అవసరమే’ అని జవాబు చెప్పారట. నిర్మాత విశ్వేశ్వరావు ఎన్టీఆర్ తర్వాత రోజుల్లో వియ్యంకులు అయ్యారు.
ఇందులో ఎన్టీఆర్ రెండు మారు వేషాలు వేశారు. ఒకటి బ్రౌన్ దొర పాత్ర కాగా రెండోది.. ఒక రౌడీ పాత్ర.ఆపాత్ర పేరు చాకుభరోసా. విలన్ పాత్రలకు పేరొందిన రావుగోపాలరావు ఇందులో సీబీఐ అధికారి పాత్రలో కనిపిస్తారు. మరో విలన్ సత్యనారాయణ చిన్న రోల్ లో నటించారు. ప్రధాన విలన్ పాత్రలో నాగభూషణం మెప్పించారు. ఆయన అనుచరుడిగా రాజనాల సంగతి చెప్పనక్కర్లేదు.
సినిమాలో అధిక భాగం డైలాగులు రచయిత మోదుకూరి జాన్సన్ రాశారు. నాటి రాజకీయాల తీరుపై సెటైరికల్ డైలాగులు బాగా పేలాయి .. ‘స్వాగతం దొరా సుస్వాగతం’ పాటను కూడా జాన్సన్ రాశారు. ఈ పాటను తెరకెక్కించిన తీరు కూడా బాగుంటుంది.
1963 లో ఎన్టీఆర్ తొలి రంగుల చిత్రం ‘లవకుశ’ విడులైంది.అది పౌరాణికం. ఆ తర్వాత పదేళ్లకు వచ్చిన సాంఘిక రంగుల చిత్రం ‘దేశోద్ధారకులు’. లవకుశ దర్శకుల్లో ఒకరైన సీఎస్ రావు ఈ సినిమా కు దర్శకుడు. ఈ రెండు సినిమాలు మార్చి 29న విడుదల కావడం విశేషం. నిర్మాత అంచనా వేసినట్టే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.