Is there a danger with that Chinese project?………………………..
బ్రహ్మపుత్ర.. ఈ నదికి చాల పేర్లు ఉన్నాయి. టిబెట్లోని హిమాలయాల్లో జిమా యాంగ్ జాంగ్ హిమానీ నదంలో యార్లుంగ్ నదిగా పుట్టింది. దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాల్లోని లోతైన లోయలలోకి పరుగులు దీస్తుంది. నైరుతి లో అస్సాంలో ప్రవహించి, దక్షిణాన బంగ్లాదేశ్ లో జమునగా పారుతుంది. అక్కడ గంగానదిలో కలుస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్లో నది ప్రవేశించిన చోట దీని పేరు ‘సియాంగ్’.. అక్కడ చాలా ఎత్తు నుంచి వేగంగా కిందికి దిగుతుంది.పర్వత పాద ప్రాంతంలో ఈ నదిని దిహంగ్ అంటారు. అక్కడ నుండి 35 కిలోమీటర్లు ప్రవహించాక ‘దిబంగ్’, ‘లోహిత్’ అనే మరో రెండు నదులతో కలుస్తుంది.అక్కడ నుంచి ఈ నది ని ‘బ్రహ్మపుత్ర’గా పిలుస్తారు.
ఇక అసలు విషయంలోకి వెళితే టిబెట్లోని మిడాగ్ జిల్లాలో ఈ నదిపై భారీ జల విద్యుత్తు ప్రాజెక్టును చైనా నిర్మించబోతోంది.ఇది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా 300 బిలియన్ kWh విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 137 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. చైనా పంచవర్ష ప్రణాళికలో కూడా డ్యామ్ కోసం బడ్జెట్ కూడా కేటాయించిందని సమాచారం. భారత్లో బ్రహ్మపుత్ర ప్రవేశించడానికి ముందే ఈ భారీ డ్యామ్ను టిబెట్లో చైనా నిర్మిస్తోంది.ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించినప్పటికీ, నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో అస్పష్టంగా ఉంది.
చైనా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పొరుగు దేశాలలో ఆందోళనలను రేకెత్తించింది. ఈ ఆనకట్ట నీటి ప్రవాహాన్ని నియంత్రించే అధికారం చైనాదే. సరిహద్దు ప్రాంతాలకు వరద నీటిని విడుదల చేయడానికి బీజింగ్కు వీలున్న నేపథ్యంలో భారతదేశంలో ఆందోళనలు తలెత్తాయి.అయితే దిగువ నదీ తీర రాష్ట్రాలను ఈ ఆనకట్ట ప్రభావితం చేయదని చైనా అంటోంది.
చైనా తన ప్రణాళిక గురించి జనవరి 6, 2025 న మళ్ళీ ప్రకటించింది .. ఇది ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్ట్ .. దిగువ దేశాలైన భారతదేశం, బంగ్లాదేశ్పై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని ప్రకటించింది. ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్. ఆ డ్యామ్ కన్నాపెద్ద సైజులో ప్రస్తుతం బ్రహ్మపుత్రపై కట్టాలని చైనా సన్నాహాలు చేస్తోంది.
త్రీ గోర్జెస్ డ్యామ్ కన్నా.. కొత్తగా నిర్మించబోయే డ్యామ్ మూడు రెట్లు అధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం జల విద్యుత్ సంస్థ పవర్ చైనా తో చైనా ఒప్పందం కుదుర్చుకుంది. త్రీ గార్జెస్ డ్యామ్ 2024 చివరి నాటికి 1.7 ట్రిలియన్ kWh కంటే ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసింది.
పర్యావరణవేత్తలు మాత్రం ఈ కొత్త డ్యామ్ ను వ్యతిరేకిస్తున్నారు. త్రీ గార్జెస్ నిర్మాణ సమయంలో సుమారు 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. టిబెట్లో డ్యామ్ నిర్మాణం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇండియా కూడా ఈ డ్యామ్ నిర్మాణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది.
బ్రహ్మపుత్ర నది స్వభావం వలన ఏదైనా విపత్తు సంభవించినపుడు ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రధానంగా పర్యావరణం దెబ్బతింటుంది. మిడాగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, హిమపాతాలు ఏర్పడటం, ఆకస్మిక వరదలు సహజం. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే అస్సాం ,అరుణాచల్ ప్రదేశ్ లకు ముప్పు తప్పదు.
చైనా కొత్త ప్రాజెక్టు భారత్ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.ఈ ప్రాజెక్టు అమలులోకొస్తే రక్షణ పరంగానూ భారత్కు ముప్పుపొంచి వున్నట్టే. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే.. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేస్తే అది ‘వాటర్ బాంబ్’గా మారి అల్లకల్లోలం సృష్టిస్తుంది.అంత ఎత్తు నుంచి నీటిని విడుదల చేస్తే అసోం, అరుణాచల్ వంటి రాష్ట్రాలు పూర్తిగా జలసమాధి అవుతాయి. అదే ఇండియా భయం.
ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్రపై ( సియాంగ్ ) ‘అప్పర్ సియాంగ్ మల్టీపర్పస్ స్టోరేజ్’ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నది. 900 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే జలాశయంలా దీన్ని డిజైన్ చేస్తున్నారు.
ఒకవేళ చైనా గనక.. టిబెట్ నుంచి నీటిని తన దేశానికి తరలించుకుపోతే ఈ జలాశయంలోని నీటిని అరుణాచల్, అసోం రాష్ట్రాల్లో బ్రహ్మపుత్రపై ఆధారపడిన ప్రాంతాలకు సరఫరా చేయాలని ప్రభుత్వ యోచన. చైనా కనుక పై నుంచి నీటిని విడుదల చేస్తే ఆ నీటిని ఈ జలాశయంలో స్టోర్ చేయవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సర్వే, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.