మనం మరచిన స్వామి జ్ఞానానందుడు !!

Sharing is Caring...

Great person…………………………………………

మానవజాతి పురోగతి కోసం కృషి చేసిన మహానుభావులు ఎందరో మనదేశం లో జన్మించారు. ఆ మహానుభావుల గురించి ఈ తరం వారికి పూర్తిగా తెలీదు. అలాంటి వారి జీవిత చరిత్రను పాఠ్యంశాలుగా పెట్టి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మనం మరచిన ఆ మహనీయులు, మానవతావాదుల  గురించి తెలుసుకుందాం.

సైన్స్ కు మతానికి పొత్తు కుదరదని చాలా మంది భావన. కాని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ , జగదీశ్ చంద్ర బోస్ , స్వామి జ్ఞానానంద వంటి వారు ఆ రెంటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా వివరిస్తూ రెండు ఒక దానికొకటి అవసరమని, అప్పుడే మానవ జాతి పురోగతి అని విస్పష్టం గా చెప్పి ఆచరించి మార్గ దర్శనం చేశారు.

న్యూక్లియర్ ఫిజిక్స్ లో స్పెక్త్రోస్కోపి మీద విశేష పరిశోధన చేసి దేశ విదేశాలలో దాన్ని బోధించి హిమాలయాలలో తపస్సు చేసి యోగాభ్యాసం చేసి వేద ప్రాశస్త్యాన్ని నేల నాలుగు చేరగులా ఉపన్యాసాలతో వ్యాప్తి చేసిన మహానుభావుడే మన స్వామీ జ్ఞానానంద.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర గొరగనమూడిలో 1896 డిసెంబర్ అయిదున జన్మించారు.

వీరి అసలు పేరు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు తండ్రి గారు రామరాజు గారు మహా వేద విజ్ఞాన ఖని. వేదాలకు ఉపనిషత్తులకు శాస్త్రాలకు సంబంధించిన వందలాది అపూర్వ గ్రంధాలును, ఆయన చదివి గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించుకొన్నారు.

సంపన్నమైన భూస్వామ్య కుటుంబం వీరిది.ఆ వేద భాండా గారాన్ని లక్ష్మీ నరసింహ రాజు అద్భుతం గా సద్వినియోగ పరచుకొని వేద వేదాంగాలలో ఉత్తమాభినివేశాన్ని సంపాదించుకొన్నారు. ఆ గ్రంధాలకు సార్ధకత చేకూర్చారు.నర్సాపురం లోని టేలర్ హై స్కూల్ లో విద్యాభ్యాసంచేశారు.ఇరవైవ ఏట వివాహం జరిగింది… బుద్ధుని ప్రభావం వారి పైన ఉన్నది అందుకని నేపాల్ లోని లుంబిని కి వెళ్లి కొంతకాలం గడిపారు.

తర్వాత పదేళ్లు దేశ సంచారం లో,పెద్దల దర్శనలతో జీవితాన్ని చదువు కున్నారు. హిమాలయాలకు చేరి అక్కడ యోగాభ్యాసం చేస్తూ మరో పదేళ్లు సార్ధక జీవనం సాగించారు. వేదాధ్యయనం వారిని విడువ లేదు.దాని పై ఉన్న మక్కువ తో అన్ని వేదోపనిషత్తుల సారాన్ని జీర్ణించుకున్నారు . మానసిక వికాసం కలిగింది.ఒక అపూర్వ తేజస్సేదో వారిలో విరాజిల్లింది.

క్రమం గా వీరి దృష్టి భౌతిక శాస్త్రం వైపుకు మళ్ళింది. దేని మీద దృష్టి పడినా దాన్ని ఆసాంతం కరతలా మలకం చేసుకోకుండా ఉండలేదు అందుకని జర్మని చేరుకొన్నారు. అక్కడి డ్రెస్ డ్రెయిన్లో గణితం, ఫిజిక్సు చదివారు.ఫిజిక్స్ అంటే వీరాభిమానం కలిగింది. అంతే అప్పుడే విస్తరిస్తున్న ’హై టెన్షన్ ఎక్స్ రే ఫిజిక్స్ ‘’లో రిసెర్చి ప్రారంభించారు.

ప్రేగ్ లోని చార్లెస్ యూనివర్సిటి లో వీరు రిసెర్చ్ కొన సాగించారు.వీరి ఆధ్యాత్మిక గురువు వీరిలోని వేద విజ్ఞానికి అబ్బుర పడి శిష్యుని వల్ల వేద విజ్ఞానం ప్రపంచమంతా విస్తరిల్లాలని ఆ కాంక్షించి రాజు గారికి ‘’స్వామి జ్ఞానానంద‘’* అనే ఆశ్రమ నామాన్ని ఒసంగి ఆశీర్వ దించారు.అప్పటి నుండి స్వామి కాషాయామ్బర దారిగా జీవించారు.

1927 లో మళ్ళీ జర్మనీ దేశం వెళ్లారు స్వామి జ్ఞానానంద. అక్కడ హిందూ మతం మీద వేద విజ్ఞానం మీద పుంఖాను పుంఖం గా ఉపన్యాసాలిచ్చి చైతన్య వంతుల్ని చేశారు.ఆ ఉపన్యాసం ఒక గంగా ప్రవాహమే.ఎన్నో తెలియ రాని విషయాలను విజ్ఞానంతో ముడి వేసి అలవోకగా అందిస్తూ శ్రోతల మనసులను రంజింప జేసే వారు.

అదొక తపస్సు గా, యోగం గా, వారు భావించి ఉత్తేజితులను చేశారు.ఆ ఉపన్యాస పరంపర ఒక అత్యద్భుత మైన గ్రంధంగా వెలువడింది. డ్రిస్దేయిన్ వర్సిటి ప్రొఫెసర్ స్వామి ఉపన్యాసాలకు పులకించి పోయాడు.అవి మానవాళికి కర దీపికలన్నాడాయన.

జ్ఞానానంద దృష్టి అయిన్ స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతం పైన పడింది.  దాన్ని ఆపోసన పట్టినట్లే 1929 లో దానిమీద రెండేళ్లు అధ్యయనం చేస్తూ అండర్ గ్రాడ్యు యేషన్ పూర్తీ చేశారు. ఆయన సాధించిన యోగా విధానం మీద 150 కి పైగా ప్రసంగాలు చేసి యువతను యోగా మార్గం వైపుకు ఆకర్షితులయేట్లు చేశారు.

యోగ, విజ్ఞాన శాస్త్రాలు సన్నిహిత సంబంధం కలవని ఆయన చెప్పే వారు.యోగాలో బేసిక్స్ నేర్చుకొంటే మనసు, మెదడు, శరీరాలపై పూర్తీ స్వాధీనం కలుగు తుందని సోదాహరణం గా ఉపన్యసించె వారు స్వామీజీ ఉపన్యాసాలన్నీ ‘’పూర్ణ సూత్రాలు ‘అనే ఉద్గ్రంధంగా వెలువడి యోగా మార్గానికి కర దీపిక గా నిలిచింది.

ఇది వారి మహోత్కృష్ట రచన గా ప్రశంశలు అందుకొన్నది. తర్వాత ఆయన ప్రొఫెసర్ డోల్షేక్ గారితో కలిసి జర్మని ,ఫ్రాన్స్, జెకోస్లోవేకియా లలో పర్య టించారు..స్వామి జ్ఞానానంద అభిమాన విషయమైన x ray spectography లో రిసెర్చ్ చేసి 1936 లో D,Sc సాధించారు .ఇంగ్లాండ్, లివర్ పూల్ వర్సిటీ లలో జాన్ చాడ్విక్ అనే మహా శాస్త్ర వేత్త వద్ద రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో పని చేశారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో ‘’spectography of beeta rays radiation ‘’లో అద్భుత పరిశోధన చేసి Ph.D పొందారు.

అమెరికా వెళ్లి అక్కడి మిచిగాన్ యూనివర్సిటి లో ‘’రేడియో యాక్టివ్ ఐసోటోపులు ‘’మీద రిసెర్చ్ చేశారు. ఆయన రాసిన ‘’హై వాక్యూం ‘’అనే శాస్త్ర గ్రంధం మేధావులైన ఎంతో మంది శాస్త్ర వేత్తలను ఆకర్షించింది. దాదాపు పాతికేళ్ళు విదేశాలలోనే చదువు ,వేదాంత ప్రవచనాలు, యోగా ఉపన్యాసాలు, తీవ్ర పరిశోధన ల తో గడిపిన స్వామి జ్ఞానానంద* 1947 మాతృదేశమైన భారత దేశం వచ్చేశారు.

డిల్లీ లోని నేషనల్ ఫిజిక్స్ లాబరేటరీ లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా తమ అమూల్యమైన సేవలందించారు. ఏడేళ్ళ తర్వాత స్వామీజీకి భీమవరం వద్ద ఒక ఆక్సిడెంట్ జరిగింది .విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ లో చేరారు. ప్రమాదం తప్పి, ఆరోగ్యం కుదురుకొన్నది. ఆంద్ర విశ్వ విద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో సౌకర్యాలు, పరిశోధనా విభాగం ఆ శాఖా ను తీర్చి దిద్దే బాధ్యతను ఆ నాటి వైస్ చాన్సలర్ స్వామి జ్ఞానానంద కు పూర్తీ బాధ్యత లతో అప్పగించారు.

వారు తమ శక్తి యుక్తులను ధార పోసి తీర్చి దిద్దారు. న్యూక్లియర్ ఫిజిక్స్ కు గొప్ప భవిష్యత్తు స్వామీజీ వల్లనే మన రాష్ట్రం లో కలిగింది .1-7-1956 లో విశ్వ విద్యాలయం లో న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖ‘’ స్వామి ఆధ్వర్యం లో ఏర్పడింది. ఎంతో మందిని ప్రోత్సాహించి .. ప్రేరణ కల్గించి న్యూక్లియర్ ఫిజిక్స్ భవిష్యత్తును చాటి చెప్పి, అందులో విద్య నేర్వటానికి విద్యార్ధులను సంసిద్ధులను చేశారు.

ఆంద్ర దేశం లో న్యూక్లియర్ ఫిజిక్స్ కు పునాదులు వేసి, వ్యాప్తి చేసింది స్వామి జ్ఞానానంద ప్రొఫెసర్ గా.., న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో చేరి, హెడ్ ప్రొఫెసర్ గా1965 న పదవీ విరమణ చేశారు. రాష్ట్ర మంతటా పర్యటించి, వారు వేద వేదాంగ, యోగా శాస్త్ర రహస్యాలను శ్రోతలకు అందించి యోగశాస్త్ర వేద విజ్ఞాన శాస్త్రాల మధ్య ఉన్న సమన్వయాన్ని విశదీకరించే వారు.

ఇవి ఒక దానికొకటి వైరుధ్యం ఉన్నవి కావని, పరస్పర సంబంధం కలవని రుజువు చేశారు. ఆంద్ర విశ్వ విద్యాలయం లో వారి సేవలను గుర్తించి స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ రిసెర్చ్‘’ను ఏర్పాటు చేసి ఘనం గా నివాళులర్పించారు…! స్వామి జ్ఞానానంద మతాన్ని సైన్స్ ను ‘’సింతెసిస్‘’ చేయాలని భావించారు .ఆయన మహా మానవతా వాదిగా నిరూపించుకొన్నారు..
——-  Through   priyadarsini . pk

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!