ఇంద్రుడు శుక్రవారం తన సభలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఊహించని అతిధి వస్తున్నారని… అలసిపోయిన ఆ గొంతుకు.. ఇక్కడ అమృతo ఇచ్చి, ఆహ్లాద పరచాలని, భూమండలం మీద బంధాలను తెంచుకొని వస్తున్న విశిష్ట అతిథి కి గౌరవ సూచకంగా నృత్య గాన మేళాలతో స్వాగతం పలకాలని ఇంద్రుడు ఆదేశాలు జారీ చేశారు… ఎవర్రా.. ఆ విశిష్ట అతిధి అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు… అంతలోనే పుష్పక విమానం. ఇంద్రలోకం వచ్చింది. అందులో నుంచి ఓ వ్యక్తి మైకు, పుస్తకం చేతపట్టుకొని కిందకు దిగడం కనిపించింది.. తెలుగుదనం ఉట్టి పడేలా ఎప్పుడు నిండుగా కనిపించే ఆ వ్యక్తి 50 రోజులుగా ఆసుపత్రిలో బక్కచిక్కి పోవడంతో చాలామంది పోల్చుకోలేక పోయారు .
అప్పటికే సభలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు, గాన గంధర్వుడు ఘంటసాల, గేయ రచయితలు, ఆరుద్ర, ఆత్రేయ,శ్రీ శ్రీ , వేటూరి వంటి వారు ఎస్పీ బాలసుబ్రమణ్యం ను గుర్తుపట్టారు. ఆప్యాయంగా పలకరించి 50 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మమ్మల్ని కలవడానికి ఇన్నాళ్లకు నీకు తీరిక అయ్యిందా. అంటూ ఆట పట్టించారు. ఇది ఇలా ఉండగా. సభలో తెలుగు మాటలు వినబడడం తో. సేదతీరుతున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, శ్రీదేవి వంటి అందాల నటులు వచ్చారు. ముందుగా ” ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, తెలుగు ప్రజలు ఏమంటున్నారు” అంటూ ఎన్టీఆర్ బాలును ఆలింగనం చేసుకున్నారు.
వేటగాడు పాటలు మళ్లీ సభలో వినిపించాయి,” ఏం బాలసుబ్రమణ్యం ఏమయింది, ఇలా వచ్చారు” అంటూ అక్కినేని పలకరించారు “వందనం అభివందనం నీ పాటకే అభివందనం ” సాంగ్ సభలో వినిపించింది. అందుకు తగ్గట్లు, రంభ, ఊర్వశి, మేనక నృత్యాలతో అందరిని అలరించారు. మైమరిపించారు. ఇంతలోనే సభలోకి సర్దార్ పాపారాయుడు దాసరి నారాయణరావు వచ్చారు.” ఏం బాలు గారు మీరు వచ్చారా, అక్కడ తెలుగు పాటకు రిపేర్ ఎవరు చేస్తారు” అని ప్రశ్నించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాలుని కలవడానికి మరి కొంతమంది వస్తున్నారని ఇంద్రుడు కు కబురు వచ్చింది. దీంతో ద్వారపాలకులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
సుమారు 5 గంటల సమయంలో తెల్లటి లుంగి, పైజమా ధరించి చెయ్యి పైకెత్తి ఊపుతూ ఓ వ్యక్తి రావడం కనిపించింది. ఆ వ్యక్తి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి..” ఏమండీ బాలు గారు ఎలా ఉన్నారు.” అని పలకరించి వివరాలు తెలుసుకున్నారు. తరువాత మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ , మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాజ్పేయి లకు బాలుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బాలు తాను కేంద్రం నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నానని గతాన్ని గుర్తు చేశారు. అందరి కోరిక మేరకు బాలు తన డిక్షనరీ లో నుంచి కొన్ని పాటలు పాడి వినిపించారు. బాలు గొంతు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు లా ఉండడంతో ఇంద్రుడు తో పాటు కొలువుదీరిన వారు ఆశ్చర్య పోయారు . అందరు కలసి బాలుకి పెద్ద ఎత్తున సన్మానం చేశారు. ఇక సభలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్వరాభిషేకం, పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు ఉంటాయని దేవేంద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
source …. వాట్సాప్ లో సంచరిస్తున్న కథనం .. అభిమానులు ఎవరో రాసుకున్నారు