పాండురాజు – సెక్స్ శాపం – సైన్స్ కోణం (Part 1)

Sharing is Caring...

వ్యాసుడు రచించిన మహాభారతంలో రచనాశిల్పం అత్యద్భుతం. అది అపూర్వం. అందుకే మహాభారత ఐతిహాసిక గ్రంధం ఈనాటికీ అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం మనం పాండురాజు – సెక్స్ శాపం – సైన్సు కోణం గురించి చెప్పుకుందాం. మాద్రితో సంభోగరతుడైన వెంటనే పాండు  రాజు  ఎందుకు మరణించాడు? దాని వెనుక వ్యాసుని కల్పనాశక్తి మాత్రమే దాగున్నదనుకోవాలా ? లేక రతిలో పాల్గొనగానే మరణించే జీవుల వైచిత్రి గురించి ఆయనకు తెలుసని అనుకోవాలా ? అసలు పాండురాజులో విచిత్ర మరణశాసన లక్షణాలు ఎలా సంక్రమించి ఉంటాయి? ఇందులో ఇమిడిన సైన్స్ కోణం ఏమిటన్న విషయాలను ప్రస్తావించడానికీ,విజ్ఞల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం.
పాండు రాజు వీరుడే కానీ…
తల్లి (సత్యవతి) మాట కాదనలేక వ్యాసుడు అంగీకరించి అంబాలికతో కలవడం వల్ల పుట్టినవాడే పాండురాజు . అంబాలిక భయంతో కళ్లుమూసుకుని సంపర్కంలో పాల్గొనడం వల్ల బలహీనుడైన, పాలిపోయిన శరీరంతో కొడుకు పుడతాడని వ్యాసుడు తన తల్లితో ఆనాడే చెబుతాడు. అనుకున్నట్టే జరిగింది. పాండు అందగాడే కానీ శరీరంలో ఎక్కడో ఏదో లోపం. తెలివిగలవాడే కానీ ఎంతకాలం సంసారజీవితం సాగిస్తాడో సందేహమే.రణరంగంలో వీరుడే కానీ పడకగదిలో ఏమేరకు శూరుడనపించుకుంటాడో అనుమానమే. రక్తహీనతతో ఉన్న అతగాడు ఎక్కువగా శ్రమపడటమన్నది ప్రశ్నార్థకమే. అందుకే కురుపితామహుడు భీష్ముడు ఎందుకైనా మంచిదని ఇద్దరు పడుచులను (కుంతి, మాద్రి)అతనికి భార్యలుగా చేశాడు. ఇద్దరితో పెళ్ళిళ్లు అయ్యాక పాండురాజు  భోగవిలాసాల్లో తేలియాడాడు. కానీ…సంతానం లేదు. దీనికి దీనికి తోడు తర్వాతి కాలంలో సెక్స్ పరంగా అతగాడు శాపం ఎదుర్కోవలసి వచ్చింది.

ఒక రోజు పాండురాజు వేటకు వెళ్లాడు. జింకలను వేటాడాననుకున్నాడు. కానీ ఆ బాణం మైథునంలో పాల్గొంటున్న జింకల్లోని ఒక జింకకు బలంగా తగిలింది. ఆ జింక వెంటనే మునిగా మారింది. తమ తపస్సశక్తితో ఆ ముని దంపతులు జింకలుగామారి అలా క్రీడిస్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది. ముని పరిస్థితి గమనించాడు. తాపం చల్లారి ఆ స్థానంలో కోపం పుట్టుకొచ్చింది. అప్పుడే అక్కడకు వచ్చిన పాండురాజును శపించాడు. తమను ఆనందఘడియల్లో బాణపు ములుకులతో విడదీసినందుకు ప్రతిగా శాపం పెట్టాడు కిందమ అనే ముని.`ఓ రాజా, నువ్వు నిర్వీర్యుడవైపోతావు, కామప్రేరితుడవై సంభోగరతుడవయితే నీవు వెంటనే మరణిస్తావు’- ఇది ఆ శాపం. పాండురాజు దిగ్భ్రాంతి చెందాడు. ముని శాపం ఫలిస్తుందని అతనికి తెలుసు. సంతానం లేక అలమటిస్తుంటే మధ్యలో ఈ శాపమా అని క్రుంగిపోయాడు.

పతి పడుతున్న అవస్థ చూసిన కుంతి (పాండు రాజు  పెద్ద భార్య) గతంలో మరో ముని (దూర్వాస మహర్షి) తనకు అయాచితంగా ప్రసాదించిన మంత్రం గురించి చెప్పింది. ఆ మంత్ర శక్తి ఎంతటిదంటే తనకు ఎవరిద్వారా సంతానం కావాలని మనసులో కోరుకుంటామో మరు క్షణంలోనే మనో ప్రియుడు ప్రత్యక్షమై కోరిక తీరుస్తాడు. ఫలితంగా గర్భం ధరించవచ్చు. లేతవయసులో ఉన్న కుంతి ఆ మంత్ర శక్తి ఏపాటిదో పరీక్షించాలనుకుంది. అప్పటికి ఆమె వయసురీత్యా బాలిక కాదు, అలా అని విచక్షణజ్ఞానం కలిగిన యువతీకాదు. ఈ స్థితిలో సూర్యుడిని మనసులో తలచుకుంటూ సంతానం అందివ్వమంటూ మంత్ర పఠనం చేసింది. అంతే సూర్యభగవానుడు అత్యంత సుందరమైన యువకునిగా ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. కోరిక తీర్చాడు. కుంతి వివాహం కాకుండానే గర్భవతి అయింది. పిల్లవాడు పుట్టాడు. అతనే తర్వాత రాధ వద్ద పెరగడం వల్ల రాధేయుడయ్యాడు. కర్ణుడని నామకరణం చేశారు.

కుంతీ దేవి పిల్లవాడు పుట్టగానే ఆందోళన చెందింది. తన భవిష్యత్తు గంగపాలవుతుందని భావిస్తూ, పిల్లవాడ్ని గంగపాలు చేసింది. అయినా ఆయుష్షు ఉండబట్టి వాడు ఆవలి ఒడ్డుకు చేరి రాధ వద్ద పెరిగాడు.
అంతటి శక్తివంతమైన మంత్రం తన వద్ద ఉన్నదనీ, కనుక మీతో ప్రమేయం లేకుండానే తాను సంతానం పొందగలనని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకన్నా చేసేదేమీలేక పాండురాజు `సరే.. ‘ అన్నాడు. అలా మంత్ర ప్రభావంచేత కుంతీ మరో ముగ్గురికి తల్లి అయింది. ఆ తర్వాత మాద్రి (పాండురాజు రెండవ భార్య )కి కూడా ఈ మంత్రం చెప్పి ఆమెకూ సంతాన భాగ్యం కలిగించింది. మంత్ర శక్తి లేదా వరం అన్నది ఒకరికే కాకుండా దాన్ని వ్యాపింపజేయవచ్చని కుంతీమాత లోకానికి చాటింది. (ఇప్పటికీ అనేక చోట్ల సంతానం కోసం మంత్రాలను నమ్ముకోవడం గమనించవచ్చు)

సరే, పాండురాజుకు పుత్రులు కలిగారు. జన్యుపరంగా చూస్తే సదరు ఈ పుత్రులలో పాండురాజు జన్యువులు లేవు. అయినా లోకానికి ఈ సంగతులేవీ తెలియవుకనుక కుంతీ మాద్రిల సంతానం పాండవులుగానే అనుకున్నారు.
పాండు రాజు భోగవిలాసాల గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి. (రెండవ భాగంలో చదవొచ్చు)

————- Nagabhushana Rao Turlapati 98852 92208

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!