ముందే చెప్పినట్టు ట్రంప్ కోర్టులను ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలు వస్తోన్న తీరు డోనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా లేదు. బైడెన్ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు అందిన ఫలితాలను చూస్తుంటే విజయం జో బైడెన్ ను వరించేలా ఉంది. బైడెన్ కు 7. 07 కోట్ల ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిగా రికార్డులకెక్కారు. గతంలో ఒబామాకు 6. 94 ఓట్లు వచ్చాయి . ఇక ట్రంప్ కు 6. 73 కోట్ల ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సరికి ఈ మొత్తం మరి కొంత పెరగవచ్చు. బైడెన్ కు ఎలక్టోరల్ ఓట్లు 264 రాగా ట్రంప్ కు 214 వచ్చాయి. మరో నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కౌంటింగ్ ఫలితాలు వచ్చినప్పటికీ ట్రంప్ గెలుపు కష్టమే అంటున్నారు.
అనుకూల ఓటింగ్ కనబడని నేపథ్యంలో ట్రంప్ శిబిరంలో నిరాశ నెలకొంది. అధికారం కోల్పోతున్నామన్న ఆందోళన తో ఓట్ల లెక్కింపును ఆపేయాలని హడావుడి చేశారు. అయితే ఆయన మాటను ఎన్నికల అధికారులు పాటించ లేదు. దీంతో ఆయన ముందు నుంచి చెబుతున్నట్టుగా కోర్టు మెట్లు ఎక్కారు. మిచిగాన్ లో ఓట్ల లెక్కింపును నిలిపి వేయాలని కోరుతూ ట్రంప్ వేసిన పిటీషన్ ని కోర్టు కొట్టివేసింది. ఓట్ల లెక్కింపు పూర్తి కానున్న దశలో కౌంటింగ్ ప్రక్రియను నిలపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. మిచిగాన్ లో బైడెన్ గెలిచే ముందు ఈ పిటీషన్ దాఖలు చేశారు. అయితే పెన్సిల్వేనియా కోర్టులో మటుకు అనుకూల తీర్పు వచ్చింది. మరికొన్ని చోట్ల ట్రంప్ రీ కౌంటింగ్ కూడా కోరుతున్నారు.
బైడెన్ నెగ్గిన అన్ని చోట్లా కూడా కేసులు వేశారు. వేస్తున్నారు. 44 రాష్ట్రాల్లో 300 కేసులు నమోదు అయ్యాయి. ఇంకా తన లాయర్లతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో బైడెన్ మోసం చేశారనడానికి బోలెడు రుజువులు ఉన్నాయని ట్రంప్ వాదిస్తున్నారు. నెవాడా లో ఎన్నికల పద్ధతిని డెమొక్రాట్లు పూర్తిగా మార్చివేశారని ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోర్టుల్లో ఈ వివాదాలు ఉండటం మూలానా ఫలితాల ప్రకటన ఆలస్యం కావచ్చు. మొత్తం మీద ట్రంప్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. తన విజయం పై అనుమానం ఉంది ఆయనకు. అందుకే ముందుగానే కోర్టు కెళతానని ప్రకటించారు. చెప్పినట్టే చేస్తున్నారు.
మొత్తం మీద ఏమి జరుగుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎవరు గెలుస్తారా అని ఆసక్తిగా చూస్తున్నాయి. చైనా అయితే అమెరికా అధ్యక్షుడు మారాలని కోరుకుంటోంది. అమెరికా లో ఉన్న చైనీస్ అమెరికన్లలో 70 శాతం మంది కూడా బైడెన్ గెలవాలని అభిలషిస్తున్నారు.బైడెన్ గెలిస్తే ఇరుదేశాల మధ్య చర్చలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పాత విషయాలను మర్చిపోయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ట్రంప్ వచ్చే ఏడాది జనవరి వరకు 20 వరకు అధికారంలో ఉంటాడు. అప్పటివరకు శ్వేత సౌధం లోనే నివాసం ఉంటారు. ఈ లోగా ఎన్ని జిమ్మిక్కులు అయినా చేయవచ్చని ఆయన విమర్శకులు అంటున్నారు.
———– KNMURTHY