One of the Panch Kedar Temples…
పంచ కేదార్ దేవాలయాల్లో తుంగనాథ ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న శివాలయం. సముద్ర మట్టానికి ఈ ఆలయం 1273 అడుగుల ఎత్తులో ఉంది. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచివుంటుంది. చలికాలంలో దేవాలయం మంచుతో మూసుకుపోతుంది. ఈ కారణంగానే శివుని ఉత్సవ విగ్రహాన్నిదగ్గర్లో ఉన్న మఠానికి తరలించి అక్కడ నిత్య పూజలు చేస్తారు.
మరల వేసవి రాగానే దేవాలయం తెరుస్తారు. కేదారేశ్వరుడి ఆలయం కంటే ఈ ఆలయం ఎత్తులో ఉంది.
వృషభ రూపంలోని శివుని బాహువులు పడిన ప్రదేశమే తుంగనాథ క్షేత్రంగా విరాజిల్లుతోంది. తుంగం అంటే పర్వతం అని అర్ధం. హిమాలయ సమున్నత పర్వత శ్రేణులకు అధిపతి శివుడు.కాబట్టి ఇక్కడ ఆయనను తుంగనాథుడు అనే పేరుతో పిలుస్తారు.
దేవతలు నివసించే హిమాలయ రాష్ట్రంగా ప్రసిద్ధి గాంచిన ఉత్తరాఖండ్ లోని తుంగ నాథ ఆలయం రుద్రప్రయాగ నుంచి 50 కిమీ దూరంలోని చొప్తా కు దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి కాలినడకన మాత్రమే వెళ్ళగలం.నడవలేని వారు డోలీలలో వెళ్ళవచ్చు.మందాకిని అలకనంద నదుల నడుమ కొలువైన ఈ ఆలయానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది.
అతి ప్రాచీనమైన ఆలయ గోడలపై అద్భుతమైన పురాతన శిల్పాలను చూడవచ్చు. నగారా నిర్మాణ శైలిలో తుంగనాథ్ ఆలయాన్నినిర్మించారు.ఈ ఆలయాన్నిరాళ్లతో నిర్మించారు. దేవాలయంపై కప్పు పైన చెక్కలు,రాతి పలకలు అమర్చారు.
ఈ హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయంగా విలసిల్లుతోంది. సంసార బంధాలనుంచి విముక్తి చెందాలనుకునే వారికి ఈ ఆలయాలు తుది గమ్యం అనుకోవచ్చు. తుంగనాథ్ ఆలయానికి కేవలం 1 కి.మీ దూరంలో చంద్రశిల శిఖరం (మూన్ రాక్ పీక్)ఉంది. ఈ శిఖరం సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తులో ఉంది.
అక్కడ నుంచి నలువైపులా హిమాలయాలు దర్శనమిస్తాయి. అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.కొందరు సాధువులు ఎవరికంటా పడకుండా శీతాకాలం లోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని కూడా అంటారు.ఈ చంద్ర శిలను కూడా ట్రెక్కింగ్ ద్వారా వెళ్లి చూడాల్సిందే.
తుంగనాథ్ దేవాలయం పరిసరాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. యోగా, ధ్యాన అభ్యాసాలకు ఈ ప్రాంతం అనువైన ప్రదేశం..చాలా మంది అంతర్గత శాంతి,ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఈ పవిత్ర ప్రదేశానికి వస్తుంటారు.
ఇక మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవడం సులభమే. 58 వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే చొప్తా అనే గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్లు నడిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. చొప్తా పెద్ద హిల్ స్టేషన్ … ఇక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయి.. రాత్రి వేళల్లో ఓపెన్ క్యాంప్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
యాత్రికులు రాత్రి అక్కడే ఉండి ప్రకృతి సౌందర్యాలను తిలకించవచ్చు. ఇక్కడ నుంచే చంద్రశిలకు. తుంగనాథ్ కు ట్రెక్కింగ్ మొదలవుతుంది. తుంగనాథుడిని దర్శించడానికి ఏప్రిల్ నుండి నవంబర్ వరకు అనువైన సమయం.
రిషికేశ్ కి రైలులో చేరుకుంటే అక్కడనుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోప్తాకు బస్సు లేదా టాక్సీలో చేరుకోవచ్చు. అవకాశం ఉంటే జీవితంలో ఒకసారైనా ఈ ప్రాంతానికి వెళ్లి సమీప క్షేత్రాలను చూసిరండి.
——- Theja

